కనుల పండువగా కల్యాణం
భద్రాచలం: భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామిదేవస్థానంలో గురువారం రామయ్య నిత్యకల్యాణం కనుల పండువగా జరిగింది. తొలుత తెల్లవారుజామున గర్భగుడిలో స్వామివారికి సుప్రభాత సేవ, సేవా కాలం, ఆరాధన తదితర పూజలు చేశారు. అనంతరం మేళతాళాల నడుమ గర్భగుడి నుంచి ఊరేగింపుగా తీసుకొచ్చి బేడా మండపంలో కొలువుదీర్చారు. విశ్వక్సేన పూజ, పుణ్యావాచనం అనంతరం కంకణధారణ, యజ్ఞోపవీత ధారణ, అమ్మవారికి కంకణధారణ, యోక్త్రధారణ గావించి కల్యాణాన్ని శాస్త్రోక్తంగా జరిపారు. అనంతరం మూలమూర్తులను దర్శించుకుని తీర్థ ప్రసాదాలను స్వీకరించారు.
భక్తుల కోరిక మేరకు ఈ నెల 8న వైజాగ్లో భద్రాచలం శ్రీ సీతారామ చంద్రస్వామివారి కల్యాణాన్ని జరపనున్నట్లు ఆలయ ఈఓ దామోదర్ రావు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. హిందూ ధర్మ ప్రచారంలో భాగంగా వైజాగ్లోని రాజప్పనాయుడు వీధి రామాలయ నిర్వహణ సేవా సంఘం సంప్రదించారని పేర్కొన్నారు. నిబంధనల మేరకు 7న శోభాయాత్ర, 8న కల్యాణం నిర్వహిస్తామని వెల్లడించారు.


