వేసవిలోనూ ఆగకుండా విద్యుత్
కార్యాచరణ అమలుకు శ్రీకారం
అవసరమైన చోట అదనపు
ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు
అంతరాయాలు లేని సరఫరాయే లక్ష్యం
ఖమ్మంవ్యవసాయం: వేసవిలో విద్యుత్ వినియోగం పెరగనున్నందున అంతరాయం లేకుండా సరఫరా చేసేలా విద్యుత్ శాఖ సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా సమ్మర్ యాక్షన్ ప్లాన్ అమలుకు శ్రీకారం చుట్టారు. నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేసే లా అవసరమైన ప్రాంతాల్లో అదనపు ట్రాన్స్ఫార్మర్ల ఏర్పాటు ప్రారంభించారు. ఇందులో భాగంగా మధిర విద్యుత్ డివిజన్ పరిధి బోనకల్ సెక్షన్లో బుధవారం అదనపు డిస్ట్రిబ్యూటరీ ట్రాన్స్ఫారర్ల(డీటీఆర్)ను ఏర్పాటు చేశారు. జానకీపురంలో మూ డు, చిన్నబీరవల్లి, నారాయణపురంలో రెండు చొప్పున, బోనకల్, రావినూతలలో ఒక్కో అదనపు డీటీఆర్ ఏర్పాటు చేశారు. వీటి ఏర్పాటుతో గృహ, వ్యవసాయ అవసరాలకు వినియోగం పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయడం వీలవుతుంది. ఖమ్మం టౌన్, ఖమ్మం రూరల్, సత్తుపల్లి, వైరా, మధిర డివిజన్లలో డీటీఆర్ల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించగా, ప్రాధాన్యతా క్రమంలో పనులు చేపట్టనున్నారు.
లోడ్ బ్యాలెన్సింగ్
వేసవిలో సహజంగా గృహ విద్యుత్ వినియోగం పెరుగుతుంది. ఈమేరకు సాంకేతిక సమస్యలను ముందస్తుగా గుర్తించి పరిష్కరించడంతో పాటు పరికరాల తనిఖీ చేపట్టనున్నారు. ఈ అంశంపై ఇప్పటికే అధికారులు, ఉద్యోగులకు అవగాహన కల్పించారు. ఇదే సమయాన అవసరమైన చోట్ల అదనపు ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటుచేయనుండడంతో వేసవిలో ఇబ్బందులు ఎదురుకావని చెబుతున్నారు.
రానున్న వేసవిలో ఎంత డిమాండ్ పెరిగినా అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేసేందుకు సిద్ధమవుతున్నాం. ఇందుకోసం అన్ని విభాగాల సమన్వయంతో పనులు చేపడుతున్నాం. అవసరమైన ప్రాంతాల్లో అదనపు డీటీఆర్ల ఏర్పాటు ప్రక్రియ మొదలైంది. – ఇనుగుర్తి శ్రీనివాసాచారి, ఎస్ఈ


