తీర్థాల జాతరకు విస్తృత ఏర్పాట్లు
●అధికారులతో సమీక్షించిన కలెక్టర్ అనుదీప్
ఖమ్మం సహకారనగర్: ఖమ్మం రూరల్ మండలంలో ని తీర్థాల సంగమేశ్వర స్వా మి ఆలయంలో మహా శివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18వరకు ఐదు రోజుల పాటు జాతర జరగనుంది. లక్షల్లో భక్తులు హాజరుకాను న్న నేపథ్యాన విస్తృతంగా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి ఆదేశించారు. కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో మంగళవారం సమీక్షించిన ఆయన మాట్లాడారు. తీర్థాల జాతరకు దాదాపు నాలుగు లక్షల మంది భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్నందున గతంలో కంటే మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. అవసరమైన మేర పారిశుద్ధ్య కార్మికులను నియమించి ఆలయ ప్రాంగణం, జాతర పరిసరాలను శుభ్రం చేయించాలని సూచించారు. అంతేకాక బస్సుల ఏర్పాటు, ప్రత్యేక వైద్య శిబిరాల నిర్వహణ, కంట్రోల్ రూం ఏర్పాటుపై సూచనలు చేశారు. కాగా, జాతరలో వసతుల కల్పనకు కేటాయించిన రూ.10 లక్షల చెక్కును ఆలయ ఈఓ కె.వేణుగోపాల్కు కలెక్టర్ అందజేశారు. ఈసమావేశంలో డీఎంహెచ్ఓ రామారావు, డీపీఓ రాంబాబు, ఆర్డీఓ జి.నర్సింహారావు, మిషన్ భగీరథ ఈఈ పుష్పలత, ఖమ్మం రూరల్ తహసీల్దార్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


