తాగునీటి పథకాల పనితీరుపై సర్వే
ఖమ్మం అర్బన్: రానున్న వేసవిలో ఎక్కడ కూడా తాగునీటి ఎద్దడి కాకుండా ముందస్తు చర్యల్లో ఆర్డబ్ల్యూఎస్ అధికారులు నిమగ్నమయ్యారు. ఈమేరకు జిల్లావ్యాప్తంగా 20రోజుల పాటు తాగునీటి పథకాల పనితీరు, అంతరాయాలను పరిశీలించి తక్షణ మరమ్మతులకు ఉపక్రమించనున్నారు. ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ జి.శేఖర్రెడ్డి, ఈఈలు పుష్పలత, వాణిశ్రీ మండలాల వారీగా ఇంజనీర్ల సర్వేను పరిశీలించి సూచనలు చేస్తున్నారు. ఎర్రుపాలెం, రఘునాథపాలెం, పెనుబల్లి తదితర మండలాల్లో సోమవారం సర్వే జరగగా సర్పంచ్లు, గ్రామ కార్యదర్శులను కలిసి అక్కడి తాగునీటి పథకాలు, పనితీరు, పైపులైన్లు, లీకేజీలపై ఆరా తీశారు. రఘునాథపాలెం మండలంలో డీఈఈలు ఓంప్రకాష్, ఇందిరాజ్యోతి ఆధ్వర్యాన సర్వే చేయగా సర్పంచ్ కోటేరు నర్సిరెడ్డి, పంచాయతీ కార్యదర్శి ఉదయ్కుమార్ తదితరులు వారికి వివరాలు వెల్లడించారు.
వేసవిలో ఎద్దడి రాకుండా ముందస్తు చర్యలు


