కేఎంసీ పాత భవనానికి శతాధిక చరిత్ర
ఖమ్మంమయూరిసెంటర్: ఉమ్మడి జిల్లాలో ఏడు మున్సిపాలిటీలతోపాటు కొత్తగూడెం మున్సిపల్ కార్పొరేషన్కు ఈ నెల 11న ఎన్నికలు జరగనున్నాయి. ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ పాలకవర్గం గడువు ఈ ఏడాది ఏప్రిల్ వరకు ఉండటంతో ఇక్కడ ఎన్నికలు జరగడం లేదు. అయితే ఖమ్మం నగర పాలకసంస్థ పాత భవన చరిత్ర మాత్రం ఆకట్టుకుంటోంది. 2022 ఏప్రిల్ 15వ తేదీ వరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయంగా సేవలందించిన భవనానికి 113 ఏళ్ల చరిత్ర ఉంది. రైల్వే స్టేషన్కు సమీపంలో బ్రిటీష్ కాలంలో భవనం నిర్మించగా తొలినాళ్లలో కలెక్టర్ బంగ్లాగా కొనసాగించారు. ఖమ్మం మున్సిపాలిటీ ఏర్పడ్డాక మున్సిపల్ భవనంగా మార్చారు. ఖమ్మం 1942లో స్పెషల్ గ్రేడ్, 1952లో గ్రేడ్–3, 1959లో గ్రేడ్–2, 1980లో గ్రేడ్–1 మున్సిపాలిటీగా అభివృద్ధి చెందుతూ వచ్చింది. 2012, అక్టోబర్ 19న మున్సిపల్ కార్పొరేషన్గా మారింది. అప్పటి నుంచి భవనం సేవలందిస్తోంది. పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త భవనం నిర్మించగా, 2022, ఏప్రిల్ 18 నుంచి నూతన భవనంలో ఖమ్మం కార్పొరేషన్ ప్రజలకు సేవలందిస్తున్నారు. ఇక పాత భవనాన్ని హెరిటేజ్ భవనంగా గుర్తించడంతోపాటు, అనుబంధంగా నిర్మించిన భవనాల్లో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే అభ్యర్థులకు గ్రంథాలయం, ఇతర శాఖలకు కార్యాలయాలుగా వినియోగిస్తున్నారు.
కలెక్టర్ బంగ్లాగా సేవలు ప్రారంభం


