ఏసీబీ వలలో తూనికలు, కొలతల అధికారి
● వే బ్రిడ్జి లైసెన్స్కు లంచం డిమాండ్
ఖమ్మక్రైం: వే బ్రిడ్జి లైసెన్స్ మంజూరుకు లంచం డిమాండ్ చేసిన జిల్లా తూనికల కొలతల శాఖ జిల్లా అధికారి ఏసీబీకి చిక్కారు. ఏసీబీ డీఎస్పీ రమేష్ వెల్లడించిన వివరాలు... ఓ వ్యక్తి వే బ్రిడ్జి ఏర్పాటుకు లైసెన్స్ మంజూరు చేయాలని జిల్లా తూనికలు, కొలతల శాఖ ఇన్స్పెక్టర్(జిల్లా అధికారి) ప్రవీణ్ను సంప్రదించాడు. అయితే, రూ.10వేలు ఇస్తేనే లైసెన్స్ మంజూరు చేస్తానని ఆయన బదులిచ్చాడు. దీంతో సదరు వ్యక్తి ఏసీబీ అధికారులను ఆశ్రయించగా వారు ప్రవీణ్కు ఫోన్ చేయించి మాట్లాడగా రూ.5వేలకు ఒప్పుకున్నాడు. ఇదంతా రికార్డ్ చేసిన ఏసీబీ డీఎస్పీ రమేష్ ఆధ్వర్యాన ఖమ్మం దానవాయిగూడెంలోని లీగల్ మెట్రాలజీ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సోమవారం రాత్రి ఆయనను అరెస్ట్ చేశారు.
హుండీ ధ్వంసం, నగదు చోరీ
మధిర: మండలంలోని మల్లారంలో శ్రీ ఆంజనేయ స్వామి దేవాలయం నుంచి హుండీని ఆదివారం అర్ధరాత్రి గుర్తుతెలియని వ్యక్తులు ఎత్తుకెళ్లి నగదు తీసుకుని వదిలేసి వెళ్లారు. సోమవారం ఉదయం అర్చకులు హుండీ లేదని గుర్తించి గ్రామస్తులతో కలిసి గాలిస్తుండగా పాఠశాల వెనకాల లభించింది. ఘటనపై మధిర రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
కల్వర్టును ఢీకొట్టిన లారీ
కామేపల్లి: లారీ అదుపుతప్పి కల్వర్టును ఢీకొట్టిన ఘటన ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ఇల్లెందు నుంచి ఇసుక లోడ్తో ఖమ్మం వెళ్తున్న లారీ పండితాపురం బైపాస్ వద్ద అదుపుతప్పి కల్వర్టు, రోడ్డు పక్కనే చెట్టును ఢీకొట్టింది. లారీ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డాడు.


