విమానంలో ‘మమత’ సేవలు
ఖమ్మం అర్బన్: ఖమ్మంలోని మమతా మెడికల్ కాలేజీకి చెందిన మానసిక వైద్యుల బృందం విమాన ప్రయాణం సందర్భంగా ఓ వ్యక్తికి అత్యవసర చికిత్స అందించి అభినందనలు అందుకున్నారు. వైద్యుల బృందం గతనెల 31వ తేదీన ఢిల్లీలో జాతీయ సదస్సుకు హాజరై హైదరాబాద్కు ఎయిర్ ఇండియా విమానంలో తిరిగి వస్తున్నారు. ఈక్రమాన ప్రయాణికుల్లో ఒకరికి మద్యం మానేయడం వల్ల కలిగే డెలిరియం లక్షణాలు కనిపించాయి. ఆ వ్యక్తిలో తీవ్రమైన అశాంతి, ఆగ్రహం, ఎవరో చెడు చేయబోతున్నారని అనుమానం, తనలో తానే మాట్లాడుకోవడం వంటి లక్షణాలు గమనించారు. దీంతో నిరంతర మాటల ద్వారా శాంతింపజేయడం, భరోసా కల్పించడం, దృష్టి మళ్లించే పద్ధతులతో నియంత్రించగా క్యాబిన్ క్రూ సిబ్బందికి కూడా సహకరించారు. విమానం ల్యాండ్ అయ్యే వరకు సదరు వ్యక్తిని శాంతింపజేస్తుండడం ద్వారా ఇతర ప్రయాణికుల భద్రతకు భరోసా కల్పించినట్లయింది. వైద్యుల బృందంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ కె.దివ్యారెడ్డితో పాటు చింతల శ్రీకర్, అడపా ప్రణతి, యర్లగడ్డ ప్రీతి, వినయకాంత్ తేజ ఎస్, శాఖమూరి నిహారిక, ఆదిత్య కులకర్ణి ఉన్నారు.


