మున్సిపాలిటీల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ !
గెలిచే సత్తా ఉన్న వారికే బీ ఫామ్లు
రాష్ట్ర మంత్రి కొండా సురేఖ
ఖమ్మంమయూరిసెంటర్: మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయడం ఖాయమని రాష్ట్ర దేవాదాయ, అటవీ శాఖల మంత్రి, మున్సిపల్ ఎన్నికల ఖమ్మం పార్లమెంటరీ ఇన్చార్జి కొండా సురేఖ ధీమా వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణులు కష్టపడితే అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లను కై వసం చేసుకోవడం సులువవుతుందని తెలిపారు. ఖమ్మంలోని కాంగ్రెస్ జిల్లా కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.
హామీలు అమలు చేస్తున్నాం
పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో తెలంగాణ అప్పుల పాలు కాగా, పేదలకు ఇళ్లు, రేషన్కార్డులు కూడా ఇవ్వలేదని మంత్రి సురేఖ విమర్శించారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి నేతృత్వాన తమ ప్రభుత్వం మాత్రం ఉచిత బస్సు ప్రయాణం, 200 యూనిట్ల ఉచిత విద్యుత్, రైతు రుణమాఫీ, రూ.500 బోనస్తో ధాన్యం కొనుగోలు, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, సన్న బియ్యం పంపిణీతో ప్రజలకు మేలు చేస్తోందని తెలిపారు. కాగా, గెలుపు గుర్రాలు, ప్రజల్లో గుర్తింపు ఉండి, పార్టీ గౌరవాన్ని పెంచే వారికే మున్సిపల్ ఎన్నికల్లో బీ ఫామ్లు ఇస్తామని మంత్రి వెల్లడించారు. ఒకే వార్డులో ఆశావహులు ఎక్కువగా ఉంటే నాయకులు చర్చించుకుని ఏకాభిప్రాయానికి రావా లని, రెబల్స్ లేకుండా చూడాలని సూచించారు. మాట వినని పక్షంలో పార్టీ నిర్ణయం తీసుకుంటుందని స్పష్టం చేశారు. సాధారణంగా నెల పాటు జరిగే ఎన్నికల ప్రక్రియను తక్కువ సమయంలోనే పూర్తి కానుందని, మద్యం, డబ్బుతో ఓటర్లను ప్రలోభ పెట్టే సంస్కృతికి అడ్డుకట్ట వేసేందుకు ఈ నిర్ణయం ఉపయోగపడుతుందని తెలిపారు. శ్రేణులు బాధ్యతగా పనిచేయాలని, క్షేత్రస్థాయిలో సర్పంచ్లు, వార్డు సభ్యులు, మున్సిపల్ చైర్మన్లు కాంగ్రెస్ వారు ఉంటేనే ప్రభుత్వ పథకాలు వేగంగా చేరతాయనే విషయాన్ని ప్రజలకు అవగాహన కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణగౌడ్, రాష్ట్ర గిడ్డంగుల సంస్థ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, నగర అధ్యక్షుడు నాగండ్ల దీపక్ చౌదరి, జిల్లా మహిళా అధ్యక్షురాలు దొబ్బల సౌజన్య, నాయకులు కొత్తా సీతరాములు, వేజెండ్ల సాయికుమార్, మొక్కా శేఖర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.


