ఊరట కలిగేనా ?
ఆగని రైళ్లు.. తప్పని పాట్లు..
గ్రానైట్ పరిశ్రమలకు పన్ను రాయితీ కల్పించాలంటున్న వ్యాపారులు
బొగ్గు బ్లాక్లను సింగరేణికే
కేటాయించాలని వేడుకోలు
ఉమ్మడి జిల్లా సమస్యలు బడ్జెట్లో పరిష్కారమయ్యేనా..
నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న
నిర్మలా సీతారామన్
కేంద్రం స్పందించాలి..
సాక్షిప్రతినిధి, ఖమ్మం: ప్రతీ ఏడాది లాగే ఈసారి కూడా ఉమ్మడి జిల్లా వాసులు కేంద్ర బడ్జెట్పై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. అయితే ఏ బడ్జెట్లోనూ జిల్లాకు ప్రత్యేక ప్రయోజనాలేమీ ఒనగూరడం లేదు. ప్రధానంగా రైల్వే సమస్యలపై ప్రజాప్రతినిధులు, ప్రజలు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా కేంద్రం పెడచెవిన పెడుతోందనే ఆవేదన సర్వత్రా వ్యక్తమవుతోంది. జిల్లా పురోభివృద్ధిలో కీలకమైన పరిశ్రమలకు రాయితీల్లో కేంద్రం ముందుకు రావడం లేదని కొందరు ఆరోపిస్తున్నారు. ఇక బొగ్గు బ్లాక్లను సింగరేణికే కేటాయించాలనే డిమాండ్ పెరుగుతోంది. ఆదాయ పన్ను మినహాయింపుల్లో ఈసారి మార్పులు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. నేడు పార్లమెంట్లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్లో ఈ అంశాలు ఎలా ఉంటాయోననే ఉత్కంఠ ఉమ్మడి జిల్లా వాసుల్లో నెలకొంది.
కొత్తగూడెం – కొవ్వూరు ఎప్పటికయ్యేనో..?
కొత్తగూడెం(భద్రాచలం రోడ్) – కొవ్వూరు రైల్వే లైన్ ఏళ్ల క్రితమే మంజూరైనా కేంద్రం దీనిపై దృష్టి సారించడం లేదు. భద్రాచలం రోడ్ నుంచి సత్తుపల్లి వరకు 56 కిలోమీటర్ల వరకు రైల్వే లైన్ నిర్మాణం పూర్తయింది. సత్తుపల్లి నుంచి ఏపీలోని కొవ్వూరు వరకు దాదాపు 95 కిలోమీటర్ల లైన్ పూర్తి కావాల్సి ఉన్నా.. బడ్జెట్లో అరకొర నిధులు కేటాయించడంతో జాప్యం జరుగుతోంది. ఈసారైనా నిధులు కేటాయించాలని స్థానికులు కోరుతున్నారు.
పరిశ్రమల మనుగడకు..
గ్రానైట్ పరిశ్రమకు జిల్లా పుట్టినిల్లుగా ఉంది. అయి తే ఇప్పుడు మాత్రం సంక్షోభం దిశలో పయనిస్తోంది. గతంలో దాదాపు 400 గ్రానైట్ పరిశ్రమలుండగా.. ఇప్పుడా సంఖ్య 100కు తగ్గింది. ప్రభు త్వ ప్రోత్సాహకాలు లేకపోవడంతో వ్యాపారులు నష్టాల ఊబిలో కూరుకుపోతున్నారు. రాయితీలు లేకపోవడంతో పరిశ్రమల నిర్వహణ సవాల్గా మారింది. దీంతో పాటు జిల్లా పురోభివృద్ధికి వ్యవసాయాధారిత పరిశ్రమల ఏర్పాటుకు కేంద్రం కృషి చేయాలని, బయ్యారం ఉక్కు పరిశ్రమ ఏర్పాటుపై నిర్ణయం తీసుకోవాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయి.
బొగ్గు బ్లాక్లు సింగరేణికే దక్కాలి..
ఉమ్మడి ఖమ్మం జిల్లా అభివృద్ధిలో సింగరేణి ప్రధాన పాత్ర పోషిస్తోంది. ప్రస్తుతం అనేక బొగ్గు బ్లాక్లను ప్రభుత్వం వేలం వేస్తుండగా.. వీటిని ప్రైవేట్ సంస్థలకు కాకుండా సింగరేణికే ఇవ్వాలనే డిమాండ్ వినిపిస్తోంది. దీనిపై కేంద్రం సానుకూలంగా స్పందించాలని కార్మికులు కోరుతున్నారు.
ఆదాయపన్నుపై ఊహాగానాలు..
ఆదాయ పన్ను మినహాయింపులపై పెద్ద ఎత్తున ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం వేతన జీవులకు స్టాండర్డ్ డిడెక్షన్తో కలిపి రూ.12.75 లక్షల వరకు పన్ను లేదు. దీన్ని రూ.15 లక్షల నుంచి రూ.18 లక్షల వరకు పెంచుతారనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వ్యక్తిగత పన్ను చెల్లింపుదారులకు 8 రకాల మార్పులు చేయనున్నట్లు తెలుస్తోంది. వీటిలో ప్రధానంగా 30 శాతం స్లాబ్ పరిమితి పెంపు, భార్యాభర్తల ఆదాయంపై జాయింట్ ట్యాక్సేషన్ వంటి కీలక నిర్ణయాలు ఉంటాయనే ప్రచారం జరుగుతోంది. గృహ రుణాల వడ్డీపై కనీసం రూ.2 లక్షల వరకు మినహాయింపు తదితర మార్పులు ఉంటాయని తెలుస్తోంది.
ఉత్తర, దక్షిణాది రాష్ట్రాలకు జంక్షన్గా ఉన్న ఖమ్మంలో పలు రైళ్లు ఆగడం లేదు. వ్యాపార, వాణిజ్య రంగంలో ప్రముఖ పాత్ర పోషిస్తున్న ఖమ్మం నుంచి నిత్యం వేలాది మంది ఇతర రాష్ట్రాలకు రాకపోకలు సాగిస్తుంటారు. ఇక్కడ పలు రైళ్లు ఆగకపోవడంతో విజయవాడ లేదా వరంగల్ వెళ్లాల్సి వస్తోంది. ఇక ప్రధానంగా కేరళ ఎక్స్ప్రెస్ ఇక్కడ ఆగడం లేదు. దీంతో శబరిమల, తిరుపతి వెళ్లే భక్తులు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యమైన అన్ని రైళ్లనూ ఖమ్మంలో ఆపాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు.
రైల్వే సమస్యలను
పట్టించుకోని కేంద్రం
ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సమస్యలకు బడ్జెట్లో పరిష్కారం చూపాలి. పలు అవరోధాలతో ఉమ్మడి జిల్లా అభివృద్ధికి నోచుకోవడం లేదు. భద్రాద్రి జిల్లాలో విమానాశ్రయ నిర్మాణానికి కేంద్రం గ్రీన్సిగ్నల్ ఇవ్వాలి. ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా ద్వారా పునఃపరిశీలించాలి. దశాబ్దాలుగా పెండింగ్లో ఉన్న పాండురంగాపురం – భద్రాచలం రైల్వే మార్గాన్ని చేపట్టాలి. ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం ప్రకారం తెలంగాణలో ఉక్కు కర్మాగారం సాధ్యాసాధ్యాల నివేదిక కోసం ప్రత్యేక ఏజెన్సీకి బాద్యతలు అప్పగించాలి.
– రామసహాయం రఘురాంరెడ్డి, ఎంపీ, ఖమ్మం
ఊరట కలిగేనా ?


