జమలాపురంలో ప్రత్యేక పూజలు
ఎర్రుపాలెం : తెలంగాణ తిరుపతిగా ప్రసిద్ధి గాంచిన జమలాపురం శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయంలో శనివారం ప్రత్యేక పూజలు చేశారు. శ్రీవారిని, శ్రీ అలివేలు మంగ, పద్మావతి అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు. శ్రీవారి పాదానికి పంచామృతాభిషేకం గావించారు. స్వామి, అమ్మవార్లకు నిత్యకల్యాణం నిర్వహించగా భక్తులు కనులపండువగా తిలకించారు. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లోని పలు ప్రాంతాలకు చెందిన భక్తులు స్వామివారిని దర్శించుకుని మొక్కులు చెల్లించారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ జగన్మోహన్రావు, ప్రధానార్చకులు ఉప్పల శ్రీనివాసశర్మ, సీనియర్ అసిస్టెంట్ సోమయ్య, జూనియర్ అసిస్టెంట్ కృష్ణప్రసాద్ పాల్గొన్నారు.
నామినేషన్లన్నీ ఓకే..
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలో ఎన్నికలు జరిగే ఐదు మున్సిపాలిటీల పరిధిలో దాఖలైన నామినేషన్లను శనివారం పరిశీలించారు. మొత్తం 117 వార్డులకు గాను 776 మంది అభ్యర్థులు 922 నామినేషన్లు దాఖలు చేయగా ఒక్కటి కూడా తిరస్కరణకు గురి కాలేదని స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ పి.శ్రీజ తెలిపారు. వీటిపై వచ్చిన అభ్యంతరాలను ఈనెల 2న పరిష్కరించనుండగా, 3వ తేదీన ఉపసంహరణల అనంతరం అభ్యర్థుల తుది జాబితా ప్రకటిస్తామని పేర్కొన్నారు.
యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలి
కూసుమంచి: రైతులు వ్యవసాయ శాఖ రూపొందించిన యాప్ ద్వారా ఎరువులు బుక్ చేసుకోవాలని జిల్లా వ్యవసాయాధికారి డి. పుల్లయ్య సూచించారు. శనివారం ఆయన కూసుమంచిలోని మన గ్రోమోర్ సెంటర్, జక్కేపల్లి సొసైటీలో యాప్ ద్వారా యూరియా బుక్ చేసుకున్న రైతులతో మాట్లాడారు. యాప్ విధానం సులభంగా ఉందని, యూరియా పంపిణీలో గత ఇబ్బందులు ఇప్పుడు లేవని రైతులు చెప్పారు. అనంతరం కూసుమంచిలో వరి పొలాలను పరిశీలించి చీడపీడల ఉధృతి నివారణకు సస్యరక్షణ చర్యలను వివరించారు. వరిలో వాతావరణ మార్పులతో వచ్చే అగ్గి తెగులు పట్ల రైతులు అప్రమత్తంగా ఉండాలని అన్నారు. కార్యక్రమంలో ఏఓ వాణి, ఏఈఓలు పాల్గొన్నారు.
ప్రాక్టికల్స్ పకడ్బందీగా నిర్వహించాలి
ఖమ్మం సహకారనగర్: జిల్లాలో ఈ నెల 2 నుంచి 11 వరకు ఇంటర్మీడియట్ పబ్లిక్ ప్రాక్టికల్ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలని డీఐఈఓ కె.రవిబాబు అన్నారు. నగరంలోని నయాబజార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్లతో శనివారం నిర్వహించిన సన్నాహాక సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో 67 కేంద్రాల్లో ప్రాక్టికల్ పరీక్షలు రెండు సెషన్లలో నిర్వహిస్తున్నామని, జనరల్ సైన్స్కు 13,007 మంది, వృత్తి విద్యా కోర్సుకు ప్రథమ సంవత్సరంలో 2,182, ద్వితీయ సంవత్సరంలో 1,858 మంది విద్యార్థులు హాజరవుతారని వివరించారు. సమావేశంలో డిస్ట్రిక్ట్ ఎగ్జామినేషన్ కమిటీ బాధ్యులు విజయకుమారి, సయ్యద్ యూసఫ్, ప్రవీణ్కుమార్, హై పవర్ కమిటీ బాధ్యులు సింహాచలం తదితరులు పాల్గొన్నారు.
7న నవోదయ ప్రవేశ పరీక్ష
కూసుమంచి: పాలేరులోని జవహర్ నవోదయ విద్యాలయలో 2026–27 విద్యా సంవత్సరానికి గానూ 9, 11 తరగతుల్లో ప్రవేశాలకు ఈనెల 7న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రిన్సిపాల్ కె. శ్రీనివాసులు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అడ్మిట్ కార్డులను ఆన్లైన్లో నవోద య వెబ్సైట్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 9వ తరగతి పరీక్ష రాసే వారికి కూసుమంచి జెడ్పీ ఉన్నత పాఠశాలలో, 11వ తరగతి ప్రవేశ పరీక్ష రాసే వారికి పాలేరులోని నవోదయలో కేంద్రాలు ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. పరీక్షలు ఉదయం 11.15 నుంచి మద్యాహ్నం 1.45 గంటల వరకు ఉంటాయని, విద్యార్థులు ఉదయం 10.30 గంటలకే పరీక్ష కేంద్రాల వద్దకు చేరుకోవాలని సూచించారు.
జమలాపురంలో ప్రత్యేక పూజలు
జమలాపురంలో ప్రత్యేక పూజలు


