హాస్టల్ నుంచి వెళ్లి విగతజీవిగా..
ఖమ్మంమయూరిసెంటర్: మూడు రోజుల క్రితం వసతిగృహం నుంచి వెళ్లిన విద్యార్థి సాగర్ కాల్వలో మృతదేహమై తేలాడు. ఖమ్మం ఎస్సీ డీడీ బాలుర(సీ) వసతిగృహంలో ఉంటూ ఎన్నెస్పీ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్న పస్తం సంజయ్కుమార్(17) మృతదేహాన్ని శుక్రవారం యూపీహెచ్ కాల నీ వద్ద ఎన్నెస్పీ కాల్వలో గుర్తించారు. ఖమ్మం అర్బ న్ పోలీసులు చేరుకుని అన్నం శ్రీనివాసరావు బృందం సహకారంతో బయటకు తీసి మార్చురీకి తరలించారు. అప్పటికే విద్యార్థి అదృశ్యమైన కేసు నమోదై ఉండడంతో హాస్టల్ ఉద్యోగులు, తల్లిదండ్రులకు సమాచారం ఇవ్వగా వారు చేరుకుని సంజయ్కుమార్ మృతదేహం గుర్తించారు.
సోదరుడితో ఘర్షణ
ఖమ్మం రూరల్ మండలం పల్లెగూడెంకు చెందిన పస్తం సాగర్–రమ్య కుమారుడు సంజయ్కుమార్ తన సోదరుడితో కలిసి ఎన్నెస్పీ క్యాంపులోని హాస్టల్లో ఉంటున్నాడు. బుధవారం సాయంత్రం సంజయ్కుమార్, ఆయన సోదరుడు ఘర్షణ పడగా వర్కర్లు, విద్యార్థులు ఆపారు. ఆతర్వాత సంజయ్ సోదరుడు హాస్టల్ నుంచి వెళ్లిపోవడంతో భయంతో సంజయ్ కూడా బయటకు వెళ్లాడు. అయితే, ఆయన సోదరుడు తిరిగి వచ్చినా సంజయ్ రాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేసి గాలిస్తున్నారు. ఇంతలోనే శుక్రవారం ఎన్నెస్పీ కాల్వలో మృతదేహమై కనిపించడంతో కుటుంబీకుల రోదనలు మిన్నంటాయి. కాగా, మృతదేహం వద్దకు వచ్చిన తల్లి రమ్య తన కుమారుడిదేనని గుర్తించగానే కుప్పకూలడంతో ఆస్పత్రిలో చికిత్స అందించారు.
రూ.3 లక్షలు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం..
అధికారులు, సిబ్బంది నిర్లక్ష్యంతోనే ఘటన జరిగిందని ఆరోపిస్తూ విద్యార్థి సంఘాల నాయకులు జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్ద ఆందోళనకు దిగారు. ఈమేరకు అధికారులు సంజయ్ కుటుంబానికి రూ.3లక్షల పరిహారం, ఔట్ సోర్సింగ్ ఉద్యోగం ఇస్తామని ప్రకటించారు. ఘటనపై ప్రభుత్వానికి లేఖ రాశామని, ఏదైనా సాయం అందితే కూడా అందజేస్తామని ఆర్డీఓ నరసింహరావు, ఎస్సీ డీడీ గుడికందుల జ్యోతి తెలిపారు. సీపీఐ నాయకుడు బాగం హేమంతరావుతో పాటు వివిధ సంఘాల నాయకులు ఇటికాల రామకృష్ణ, సీహెచ్.ప్రవీణ్, గోకినేపల్లి మస్తాన్, మందా సురేష్, అశోక్ తదితరులు పాల్గొనగా ఆస్పత్రి వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.
ఎన్నెస్పీ కాల్వలో
మృతదేహమై తేలిన విద్యార్థి
హాస్టల్ నుంచి వెళ్లి విగతజీవిగా..


