ఢీకొట్టి.. తలపై నుంచి వెళ్లిన లారీ
● తీవ్రగాయాలతో వ్యక్తి మృతి
సత్తుపల్లిటౌన్: లారీ ఢీకొన్న ఘటనలో తీవ్రగాయాలతో ఓ వ్యక్తి మృతి చెందాడు. సత్తుపల్లి మండలం కాకర్లపల్లికి చెందిన పొదిలి నారాయణరావు(59) మోపెడ్పై తిరుగుతూ ఫాన్సీ వస్తువులు విక్రయిస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. బుధవారం ఆయన వాహనంపై వెళ్తుండగా రింగ్ సెంటర్ వద్ద ఖమ్మం వైపు నుంచి వస్తున్న లారీ ఢీకొనడంతో కిందపడ్డాడు. ఆపై తల పైనుంచి లారీ టైర్లు కింద వెళ్లడంతో తీవ్రగాయాలతో మృతి చెందాడు. నారాయణరావుకు భార్య లక్ష్మి, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. ఘటనపై సత్తుపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు.
తాళం పగులగొట్టి బంగారం, నగదు చోరీ
కామేపల్లి: మండలంలోని మద్దులపల్లిలో ఓ ఇంటి తాళం పగలగొట్టి ఆగంతకులు చోరీ చేశారు. గ్రామానికి చెందిన దేవండ్ల ఉపేందర్ కుటుంబంతో కలిసి మంగళవారం మేడారం జాతరకు వెళ్లాడు. బుధవారం రాత్రి ఇద్దరు యువకులు తాళం పగలకొట్టి దొంగతనానికి పాల్పడ్డారు. స్థానికులు ఇచ్చిన సమాచారంతో ఉపేందర్ గురువారం చేరుకుని పరిశీలించగా బీరువాలో దాచిన ఆరు తులాల బంగారు ఆభరణాలు, రూ.80 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈమేరకు ఎస్సై శ్రీకాంత్ చేరుకుని వివరాలు ఆరా తీసి దర్యాప్తు చేపట్టారు.


