పారదర్శకంగా ఎన్నికల నిర్వహణ
ఖమ్మం సహకారనగర్: మున్సిపల్ ఎన్నికలు పారదర్శకంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని సూచించారు. హైదరాబాద్ నుంచి సీఎస్ రామకృష్ణారావు, డీజీపీ శివధర్రెడ్డితో కలిసి మంగళవారం ఆమె వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కలెక్టర్లతో సమీక్షించారు. నామినేషన్ల స్వీకరణ, పోలింగ్ కేంద్రాల్లో ఏర్పాట్లు, ఎన్నికల సామగ్రి పంపిణీ, కౌంటింగ్ కేంద్రాలను సిద్ధం చేయడమే కాక ఉద్యోగులను ఎంపిక చేసి శిక్షణ ఇవ్వాలని తెలిపారు. వీసీలో జిల్లా నుంచి కలెక్టర్ అనుదీప్ మాట్లాడుతూ ఐదు మున్సిపాలిటీల్లో బుధవారం నుంచి నామినేషన్ల స్వీకరణకు ఏర్పాట్లు చేశామని వెల్లడించారు. పోలీసు కమిషనర్ సునీల్దత్, అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, డీఆర్వో ఏ.పద్మశ్రీ, జెడ్పీ సీఈఓ దీక్షారైనా, డీఆర్డీవో సన్యాసయ్య, జిల్లా ఉపాధి అధికారి శ్రీరామ్, సీపీఓ శ్రీనివాస్, డీపీఓ రాంబాబు, డీటీఓ జగదీష్, డీసీఓ గంగాధర్, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు.
పకడ్బందీగా ఏర్పాట్లు
ఎన్నికల కమిషనర్ వీసీ అనంతరం కలెక్టర్ అనుదీప్ అధికారులతో సమావేశమై ఎన్నికల నిర్వహణపై చర్చించారు. జిల్లాలోని ఐదు మున్సిపాలిటీల్లో ఉద్యోగుల ఎంపిక శిక్షణ పూర్తయిందని తెలిపారు. నామినేషన్ల స్వీకరణకు ఏర్పాటుచేసిన కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించాలని సూచించారు. అంతేకాక నామినేషన్, పోలింగ్, లెక్కింపు కౌంటింగ్ కేంద్రాల్లో సీసీ కెమెరాలు బిగించాలని, కేంద్రాల వద్ద 163 సెక్షన్ అమలు చేయాలని తెలిపారు.
రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రాణి కుముదిని


