
మున్నేరు, ఆకేరు బ్రిడ్జిలపై ఫ్లడ్గేజ్ స్టేషన్లు
ఖమ్మం అర్బన్: మున్నేరుకు వచ్చే వరద ప్రవాహాన్ని ఎప్పటికప్పుడు పరిశీలిస్తూ ముంపును గుర్తించేలా జలవనరుల శాఖ అధికారులు తాత్కాలికంగా ఫ్లడ్గేజ్ స్టేషన్ల ఏర్పాటుకు నిర్ణయించారు. మున్నేరు ఉప్పొంగి ఖమ్మంపై ప్రభావం చూపకముందే వరద స్థాయిని అంచనా వేసేందుకు ఇవి ఉపయోగపడతాయని చెబుతున్నారు. ఈ క్రమంలో పోలిశెట్టిగూడెం వద్ద బ్రిడ్జితో పాటు తంగిళ్లపల్లి వద్ద ఆకేరు వంతెనపై ఒక్కో స్టేషన్ ఏర్పాటుకు అధికారులు పాయింట్లను గుర్తించారు. నాయుడుపేట నుండి ఈ ఫ్లడ్గేజ్ పాయింట్ల వరకు సుమారు 9 కిలోమీటర్ల దూరం ఉండగా, అధిక వర్షపాతం నమోదైన సమయాన ప్రవాహ మోతాదును అంచనా వేయడం, పరీవాహక ప్రజలకు అప్రమత్తం చేసయడంలో ఈ ఫ్లడ్గేజ్ పాయింట్లు కీలకంగా నిలుస్తాయని అధికారులు భావిస్తున్నారు. అయితే, హైడ్రాలజీ విభాగం ఆధ్వర్యాన పూర్తిస్థాయిలో సర్వే చేపట్టి శాశ్వతంగా ఫ్లడ్ గేజ్ స్టేషన్లను ఏర్పాటుచేస్తే మరింత ఉపయోగంగా ఉంటుందనే భావనలో ఉన్నతాధికారులకు ప్రతిపాదించినట్లు తెలిసింది.
87శాతం
బియ్యం పంపిణీ
ఖమ్మం సహకారనగర్: జిల్లాలోని రేషన్షాపుల ద్వారా ఇప్పటివరకు 87శాతం సన్నబియ్యం పంపిణీ పూర్తయిందని జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. జిల్లాలో 4,15,904 కార్డులకు గాను 3,63,361కార్డుల ద్వారా(87శాతం) బియ్యం తీసుకెళ్లారని ఆయన వెల్లడించారు. బియ్యం పంపిణీ ఈనెల 30వ తేదీ వరకే ఉంటుందని, గడువు పొడిగించే అవకాశం లేనందున లబ్ధిదారులు త్వరగా తీసుకెళ్లాలని డీసీఎస్ఓ సూచించారు.