అటవీ అభివృద్ధి, సంరక్షణపై ప్రత్యేక దృష్టి | - | Sakshi
Sakshi News home page

అటవీ అభివృద్ధి, సంరక్షణపై ప్రత్యేక దృష్టి

Jun 26 2025 10:11 AM | Updated on Jun 26 2025 11:52 AM

సత్తుపల్లిటౌన్‌: జిల్లాలో అటవీ అభివృద్ధి, సంరక్షణపై ఉద్యోగులు ప్రత్యేక శ్రద్ధ కనబర్చాలని జిల్లా అటవీశాఖ అధికారి సిద్ధార్థ్‌ విక్రమ్‌సింగ్‌ సూచించారు. సత్తుపల్లిలో బుధవారం పర్యటించిన ఆయన సింగరేణి స్వాధీనంలో ఉన్న అటవీ భూముల లీజ్‌ నిబంధనలపై సింగరేణి అధికారులతో చర్చించారు. అలాగే, సింగరేణి బొగ్గు గనులు, కిష్టారం, కొమ్మేపల్లి బీట్‌ పరిధిలోని ప్లాంటేషన్లు, సీతారామ లిఫ్ట్‌ ఇరిగేషన్‌ పరిధిలోని అటవీ భూములను పరిశీలించారు. అనంతరం చంద్రాయపాలెంలో వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటనున్న అటవీ భూమిని పరిశీలించాక డీఎఫ్‌ఓ మాట్లాడారు. జిల్లాలో ఈ ఏడాది అటవీశాఖ ఆధ్వర్యాన 5,47,200 మొక్కలు నాటాలని లక్ష్యంగా నిర్ధేశించుకున్నట్లు తెలిపారు. ఈ విషయంలో ఉద్యోగులు చిత్తశుద్ధితో కృషి చేయాలని సూచించారు. ఎఫ్‌డీఓ వాడపల్లి మంజుల, రేంజర్‌ స్నేహలత, సింగరేణి పీఓలు ప్రహ్లాద్‌, నర్సింహారావు, వైల్డ్‌లైఫ్‌ నిపుణుడు నారాయణ్‌, ఎఫ్‌ఎస్‌ఓలు నర్సింహ, నాగరాజు, కొండారెడ్డి, బీట్‌ ఆఫీసర్లు పాల్గొన్నారు.

పారదర్శకంగా ఎరువుల విక్రయం

రఘునాథపాలెం: జిల్లాలోని డీలర్లు యూరియా, డీఏపీ అమ్మకాల్లో పారదర్శకత పాటిస్తూ ఎప్పటికప్పుడు వివరాలను రిజిస్టర్లలో నమోదు చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి ధనసరి పుల్లయ్య సూచించారు. అంతేకాక పీఓఎస్‌ మిషన్‌ ద్వారానే విక్రయాలు జరపాలని తెలిపారు. రఘునాథపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ఎరువుల షాప్‌లను బుధవారం ఆయన తనిఖీ చేశారు. డీలర్ల వద్ద రిజిస్టర్ల ఆధారంగా స్టాక్‌, విక్రయాలను పరిశీలించిన ఆయన సూచనలు చేశారు. మండల వ్యవసాయ అధికారి కర్నాటి ఉమామహేశ్వరరెడ్డి, ఏఈఓలు పాల్గొన్నారు.

నియోనాటల్‌ వాహనంలో అధునాతన పరికరాలు

నేలకొండపల్లి: అధునాతన పరికరాలతో కూడిన నియోనాటల్‌ వాహనం ద్వారా మెరుగైన వైద్యసేవలు అందుతాయని ఈఎంఆర్‌ఐ, గ్రీన్‌ హెల్త్‌ సర్వీసెస్‌ ఉమ్మడి జిల్లా పోగ్రామ్‌ మేనేజర్‌ శివకుమార్‌ తెలిపారు. మండల కేంద్రంలోని సీహెచ్‌సీ వద్ద బుధవారం నియోనాటల్‌ వాహనంలో పరికరాల పనితీరుపై ఉద్యోగులకు అవగాహన కల్పించారు. అనంతరం శివకుమార్‌ మాట్లాడుతూ జిల్లాకు తొలిసారిగా ఈ వాహనాన్ని కేటాయించగా అత్యాధునిక పరికరాలు, వైద్య నిపుణులు అందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రత్యేకంగా నవజాత శిశువుల సంరక్షణకు ఈ వాహనం సమకూర్చారని చెప్పారు. కాగా, 108 అంబులెన్స్‌లు ఖమ్మం జిల్లాలో 21, భద్రాద్రి జిల్లాలో 28 ఉండగా, ఒక్కో వాహనంలో కనీసం నెలకు 120 ట్రిప్పుల ద్వారా ఆపదలో ఉన్న వారిని ఆస్పత్రులకు తరలిస్తున్నామని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమర్జెన్సీ మెడికల్‌ ఎగ్జిక్యూటివ్‌ అధికారి దుర్గాప్రసాద్‌, 108 సిబ్బంది అజీమ్‌, పుష్పలత పాల్గొన్నారు.

పీజీ లాసెట్‌లో 9వ ర్యాంకు.. ప్రతిభ చాటిన జిల్లా యువతి భవ్యశ్రీ

ఖమ్మం సహకారనగర్‌: తెలంగాణ లాసెట్‌, పీజీ లాసెట్‌ ఫలితాలు విడుదలయ్యాయి. ఈ సందర్భంగా పీజీ లాసెట్‌లో ఖమ్మం నగరానికి చెందిన యరమల భవ్యశ్రీ రాష్ట్రస్థాయిలో 9వ ర్యాంక్‌ సాధించి సత్తా చాటింది. ఈమేరకు ఆమె మాట్లాడుతూ ప్రస్తుతం ఓయూలో ఎల్‌ఎల్‌బీ చేస్తున్నట్లు వెల్లడించింది. ఉపాధ్యాయుడైన తండ్రి బాలస్వామి, తల్లి నాగేంద్రమ్మతో పాటు కళాశాల అధ్యాపకుల సహకారంతో పీజీ చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపింది. పేదలకు న్యాయ సాయం అందించాలనేదే లక్ష్యమని వెల్లడించింది. కాగా, భవ్యశ్రీ 1నుంచి 10వ తరగతి వరకు ఖమ్మంలోని కేంద్రియ విద్యాలయంలో, ఇంటర్మీడియట్‌ పాలేరు నవోదయలో పూర్తిచేసింది.

అటవీ అభివృద్ధి, సంరక్షణపై ప్రత్యేక దృష్టి1
1/1

అటవీ అభివృద్ధి, సంరక్షణపై ప్రత్యేక దృష్టి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement