
వరుణుడి కటాక్షం
ఖమ్మంవ్యవసాయం: ఎట్టకేలకు వరుణుడు కటాక్షించాడు. ఈనెల 22వ తేదీన ఆరుద్ర కార్తె ప్రారంభం నుంచి ఉష్ణోగ్రతలు తగ్గడమే కాక ఆకాశం మేఘావృతమవుతోంది. ఇందులో భాగంగానే మూడు రోజుల నుంచి జిల్లాలోని పలుచోట్ల వర్షపు జల్లులు, అక్కడక్కడా ఓ మోస్తరు వర్షం కురుస్తోంది. ఇక బుధవారం సాయంత్రం నుంచి జిల్లావ్యాప్తంగా వర్షం మొదలైంది. సాయంత్రం 4గంటలకు ఓ మోస్తరుగా మొదలైన వాన అంతకంతకూ పెరుగుతూ రాత్రి వరకు కొనసాగింది. రాత్రి 7గంటలకు వాతావరణ శాఖ విడుదల చేసిన బులెటిన్ ప్రకారం అత్యధికంగా వేంసూరులో 54.3 మి.మీ.ల వర్షపాతం నమోదైంది. అలాగే, సదాశివునిపాలెంలో 38.5, వైరాలో 38, గుబ్బగుర్తిలో 35.5, కుర్నవల్లిలో 33.5, ఖమ్మం ఖానాపురం, రావినూతలో 30.5, బచ్చోడులో 29, పల్లెగూడెంలో 28, సత్తుపల్లిలో 26.8, కొణిజర్ల 26.5, ఖమ్మం కలెక్టరేట్ వద్ద 26.3, తిరుమలాయపాలెంలో 25, ఖమ్మం ప్రకాష్నగర్లో 24.8, పెనుబల్లిలో 24.3, ఖమ్మం ఎన్నెస్పీ గెస్ట్హౌస్ వద్ద 23.5, రఘునాథపాలెంలో 21.8, తల్లాడ 20.5 మి.మీ. వర్షపాతం నమోదు కాగా, మిగతా ప్రాంతాల్లోనూ వర్షం కురుస్తోంది.
పంటల సాగుకు దోహదం
ప్రస్తుతం కురుస్తున్న వర్షం పంటల సాగుకు దోహదపడుతుంది. మెట్ట పంటలను విత్తుకునేందుకు 60 – 70 మి.మీ.ల వర్షపాతం అవసరమని వ్యవసాయ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే, మే చివరి వారం రోహిణి కార్తె ఆరంభంలో వర్షం కురవగా, రైతులు పత్తి, పెసర, కంది, మొక్కజొన్న విత్తారు. కానీ జూన్ ఆరంభం నుంచి వానలు లేకపోగా ఆశించిన మేర విత్తనాలు మొలకెత్తలేదు. ప్రస్తుతం కురుస్తున్న వాన పంటల సాగుకు దోహదపడుతుందని రైతులు ఆశిస్తున్నారు.
పత్తిని మళ్లీ విత్తాల్సిందేనా?
జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంటల్లో పత్తి ఒకటి. ఈ పంట జిల్లాలో 2.20 లక్షల ఎకరాల్లో సాగవుతుందని అంచనా వేశారు. ఇప్పటికే 2లక్షల ఎకరాల్లో నాటినట్లు తెలుస్తుండగా.. సరిపడా వర్షం లేక చాలాచోట్ల పూర్తి స్థాయిలో మొలకెత్తలేదు. మొలకెత్తని చోట తిరిగి మరోమారు పత్తి విత్తనాలు వేసేందుకు రైతులు సమాయత్తమవుతున్నారు. వచ్చేనెల 20వరకు పత్తి విత్తనాలు వేసే అవకాశమున్నందున రైతులు ముందడుగు వేస్తున్నారు. ఇక గత ఏడాది మిర్చి దిగుబడి తగ్గడం, గిట్టుబాటు ధర దక్కకపోవడంతో రైతులు పత్తి వైపే దృష్టి సారించారు. ఇంకొందరు మొక్కజొన్న సాగుకు ప్రాధాన్యత ఇస్తున్నారు.
కారేపల్లి : పత్తి చేనులో పాటు చేస్తున్న రైతు
జిల్లా వ్యాప్తంగా ఓ మోస్తరు వాన
ఊపందుకోనున్న పంటల సాగు

వరుణుడి కటాక్షం