
‘కటాఫ్’తో పరిసమాప్తం
● రైతులందరికీ అందని ‘పీఎం కిసాన్ సమ్మాన్ నిధి’ ● కటాఫ్ డేట్ పేరుతో జాబితాలో దక్కని చోటు ● ఏటా రూ.6 వేలు కోల్పోతున్న అన్నదాతలు
ఎర్రుపాలెం: దేశవ్యాప్తంగా సన్న, చిన్నకారు రైతు లకు పంటల సాగు పెట్టుబడిగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకంలో అర్హులందరికీ లబ్ధి జరగడం లేదు. కటాఫ్ డేట్ నిబంధనతో లక్షల మంది రైతులు ఈ పథకానికి దూరమవుతున్నారు. కేంద్ర ప్రభుత్వం 2019 జనవరి 31వ తేదీలోపు పట్టాదారు పాస్పుస్తకాలు కలిగిన రైతులకు ఏటా మూడు విడతలుగా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ.6 వేలు ఆర్థికసా యం అందిస్తోంది. ఆదాయ పన్ను చెల్లింపుదారు లు, ప్రభుత్వ ఉద్యోగులు, చార్టెడ్ అకౌంటెంట్లు, వైద్యు లు, రాజ్యాంగపదవిలో కొనసాగుతున్న ప్రజా ప్రతినిధులు తదితరులను ఈ పథకం ఆరంభం నుంచి అనర్హులుగా తేల్చారు. జిల్లాలో మొదటి విడతగా 1.94 లక్షల మంది రైతులకు ఆర్థికసాయం జమ చేయగా, ఆపై విడతల వారీగా అనర్హులను గుర్తిస్తుండడంతో నేడు ఆ సంఖ్య 1.04 లక్షలుగా ఉంది.
ఇంకా 2.50 లక్షల మందికి పైగానే
2019 ఫిబ్రవరి నుంచి భూములు కొనుగోలు చేసి పట్టాదారు పాస్పుస్తకాలు తీసుకున్న 2.50 లక్షల మంది సన్న చిన్న కారు రైతులకు ఈ పథకం ద్వారా ఆర్థిక సాయం అందడం లేదు. కటాఫ్ డేట్ నిబంధన కారణంగానే వీరంతా నష్టపోతున్నట్లు చెబుతున్నారు. 2019 నాటికి పథకం ద్వారా నగదు తీసుకుంటున్న రైతుల్లో ఎవరైనా చనిపోతే వారి వారసులకు మాత్రం సాయం అందుతోంది. అంతేతప్ప కొత్తగా భూములు కొనుగోలు చేసి పట్టా పాస్పుస్తకాలు తీసుకున్న రైతులకు మాత్రం లబ్ధి జరగడం లేదు. దీంతో 2019 ఫిబ్రవరి తర్వాత భూములు కొనుగోలు చేసిన రైతులు పాస్పుస్తకాలతో పీఎం కిసాన్ సమ్మాన్ నిధి స్కీం సాయం కోసం మీ సేవా కార్యాలయాల్లో దరఖాస్తు చేసుకోవడం, ఏఈఓల లాగిన్కు వెళ్లగానే తిరస్కరించడం పరిపాటిగా మారింది. ఫిబ్రవరిలో 1.04 లక్షల మంది రైతులకు 19వ విడత ఆర్థికసాయం అందింది. ఇక జూన్లోనే 20వ విడత ఆర్థికసాయం జమ కావాల్సి ఉన్నా ఇంకా జరగలేదు. ఇదిలా ఉండగా రాష్ట్ర ప్రభుత్వం భూభారతి ద్వారా నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో పలువురు కొత్త పట్టాదారుపాస్ పుస్తకాల కోసం దరఖాస్తులు చేసుకున్నారు. వీరిలోనూ అర్హులకు పాస్పుస్తకాలు జారీ చేస్తే పీఎం కిసాన్ సమ్మాన్ నిధిలో అర్హుల సంఖ్య పెరగనుంది. అయితే, ఈ పథకం నిబంధనల ప్రకారం ప్రతీ ఐదేళ్లకోసారి తిరిగి కొత్త రైతులను గుర్తించి కటాఫ్ డేట్ నిర్దేశించాల్సి ఉన్నా కేంద్ర ప్రభుత్వం ఎలాంటి చర్యలు చేపట్టకపోవడంతో అర్హులైన లక్షలాది మంది పెట్టుబడి సాయం కోల్పోతున్నారు.
మేమేం పాపం చేశాం..
2019 తర్వాత భూములు కొనుగోలుచేసిన చేసిన రైతులకు కిసాన్ సమ్మాన్ నిధి సాయం అందకపోవడంతో తామేం పాపం చేశామని వాపోతున్నారు. కటాఫ్ డేట్ పేరుతో కేంద్ర ప్రభుత్వం తమను విస్మరించడంపై ఆవేదన చెందుతున్నారు. ఆరేళ్లలో ఏటా రూ.6 వేల ఆర్థికసాయం కోల్పోతున్న తమను ఇకనైనా పరిగణనలోకి తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. పథకం నిబంధనల మేరకు ఐదేళ్లకోసారి కొత్త రైతులను గుర్తించాల్సి ఉన్నందున అమలు చేయాలని విజ్ఞప్తి చేస్తున్నారు.