ధాన్యం బోనస్‌.. మైనస్‌ | - | Sakshi
Sakshi News home page

ధాన్యం బోనస్‌.. మైనస్‌

Jun 24 2025 4:05 AM | Updated on Jun 24 2025 4:05 AM

ధాన్య

ధాన్యం బోనస్‌.. మైనస్‌

ఏప్రిల్‌లో అమ్మినా...

ఈ రైతు నేలకొండపల్లి మండలం భైరవునిపల్లికి చెందిన మరికంటి శంకర్‌. రబీలో సన్నధాన్యం సాగు చేసిన ఈయన నేలకొండపల్లి మార్కెట్‌లో 150 క్వింటాళ్ల ధాన్యం అమ్మాడు. గత ఏప్రిల్‌లో విక్రయించగా మే నెలలో ధాన్యానికి సంబంధించి నగదు ఖాతాలో జమ అయింది. కానీ బోనస్‌ మాత్రం ఇప్పటివరకు రాలేదు. వానా కాలం సాగు పనులు సాగుతున్నందున ఇప్పటికై నా బోనస్‌ చెల్లిస్తే పెట్టుబడికి ఉపయోగపడుతుందని ఎదురుచూస్తున్నాడు.

సాక్షి ప్రతినిధి, ఖమ్మం: గడిచిన యాసంగి సీజన్‌లో సన్న ధాన్యం సాగు చేసి ప్రభుత్వ కేంద్రాల్లో విక్రయించిన రైతులు బోనస్‌ కోసం ఎదురుచూస్తున్నారు. ధాన్యం సేకరణ పూర్తయి, కేంద్రాలు మూసివేసినా బోనస్‌ రాకపోవడం వారిని ఆందోళనకు గురిచేస్తోంది. సీజన్‌లో 18,855మంది రైతులు 12,70,653 క్వింటాళ్ల సన్న ధాన్యాన్ని అనేక సమస్యల నడుమ విక్రయించారు. మద్దతు ధరకు తోడు బోనస్‌ వస్తుందని ఆశిస్తే ప్రభుత్వం ఇప్పటివరకు విడుదల చేయలేదు. జిల్లా రైతులకు రూ.63,53,26,800 చెల్లించాల్సి ఉండగా, ఇప్పుడైనా విడుదల చేస్తే వానాకాలం పంటల సాగు అవసరాలకు ఉపయోగపడుతుందని నిరీక్షిస్తున్నారు.

బోనస్‌తో పెరిగిన సాగు

రాష్ట్ర ప్రభుత్వం సన్నధాన్యానికి మద్దతు ధరతో పాటు క్వింటాకు రూ.500 బోనస్‌ చెల్ల్లిస్తామన్న ప్రకటనతో రైతులు యాసంగిలో సన్న రకాలే ఎక్కువగా సాగు చేశారు. సహజంగా యాసంగిలో ఆరుతడి పంటల సాగు చేయాలని వ్యవసాయ అధికారులు సూచిస్తుండగా, రైతులు తక్కువ విస్తీర్ణంలో వరి సాగు చేస్తారు. కానీ బోనస్‌ ప్రకటనకు తోడు నాగార్జునసాగర్‌ ఆయకట్టుతో పాటు నాన్‌ ఆయకట్టులోని బోర్లు, బావుల కింద 2,10,830 ఎకరాల్లో వరి సాగు చేశారు. ఇందులో సన్న రకాలే 1,29,064 ఎకరాల్లో సాగవయ్యాయి.

12.70 లక్షల క్వింటాళ్లు సేకరణ

యాసంగిలో ఈసారి సన్న రకం, దొడ్డు రకం కలిపి 54,51,516 క్వింటాళ్ల ధాన్యం దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. మిల్లర్లు, ప్రైవేట్‌ వ్యాపారుల కొనుగోళ్లు, రైతుల అవసరాలు పోగా 25,84,928 క్వింటాళ్ల సన్న, దొడ్డు ధాన్యం సేకరణను లక్ష్యంగా పెట్టుకున్నారు. ఇందులో సన్న రకాలు 18,53,370 క్వింటాళ్లు ఉండగా.. 18,855 మంది రైతుల నుంచి 12,70,653.60 క్వింటాళ్ల ధాన్యాన్ని పౌర సరఫరాల సంస్థ సేకరించింది.

ఆసరా అవుతుందని..

కష్టనష్టాల నడుమ సన్న రకాలు సేద్యం చేయగా, ధాన్యం విక్రయించేందుకు కొనుగోలు కేంద్రాల్లో అవస్థ పడ్డారు. అయినా రూ.500 బోనస్‌ వస్తుందని భావిస్తే నెలలు గడుస్తున్నా జమ కాకపోవడంతో రైతుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. బోనస్‌ విషయమై విస్తృత ప్రచారం చేసిన ప్రభుత్వం అమ్మకాలు పూర్తికాగానే జమ చేస్తామని వెల్లడించింది. అయినా జిల్లా రైతులకు రూ.63,53,26,800 అందకపోగా, వానాలం సీజన్‌ ప్రారంభమైన తరుణాన స్పందించాలని కోరుతూ ప్రతిరోజు బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్‌ చూసుకోవడం పరిపాటిగా మారింది.

యాసంగి సీజన్‌ నగదు జమ కాక ఎదురుచూపులు

జిల్లా రైతాంగానికి రూ.63.53 కోట్ల బకాయి

ఎప్పుడు జమ అవుతుందోనని నిరీక్షణ

జిల్లాలో అత్యధికంగా బోనస్‌ కావాల్సిన మండలాల వివరాలు...

మండలం రైతులు ధాన్యం (క్వింటాళ్లలో) రావాల్సిన నగదు

నేలకొండపల్లి 3,450 2,39,889.60 రూ.11,99,44,800

తల్లాడ 1,888 2,32,940 రూ.11,64,70,000

కూసుమంచి 2,201 1,38,829.60 రూ.6,94,14,800

కల్లూరు 1,305 1,29,354.00 రూ.6,46,77,000

ముదిగొండ 1,979 1,00,090.80 రూ.5,00,45,400

వేంసూరు 1,410 74,749.60 రూ.3,73,74,800

పెనుబల్లి 1,052 67,555.60 రూ.3,37,77,800

తిరుమలాయపాలెం 1,282 66,666.40 రూ.3,33,33,200

సత్తుపల్లి 1,050 62,449.60 రూ.3,12,24,800

ఖమ్మంరూరల్‌ 983 40,340.40 రూ.2,01,70,200

అష్టకష్టాల నడుమ...

సన్నధాన్యం విక్రయం సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రాల్లో ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కాంటాలు ఆలస్యమవుతుండడంతో రోజుల తరబడి పడిగాపులు కాశారు. ఇక తేమ శాతం పేరుతో క్వింటాకు 3 – 5 కేజీల వరకు తరుగు తీస్తామని మిల్లర్లు చెప్పగా, కాంటా పూర్తయ్యాక లారీలు అందుబాటులో లేక ఎదురు చూడాల్సి వచ్చింది. అదే సమయాన అకాల వర్షాలతో ధాన్యం తడిసిపోవడంతో మళ్లీ ఆరబెట్టారు. ఇలా అనేక అవాంతరాలు ఎదురైనా క్వింటాకు రూ.500 బోనస్‌ వస్తుందనే ఆశలతో ప్రభుత్వ కేంద్రాల్లోనే ఎక్కువ మంది ధాన్యం విక్రయించారు. కొందరు మాత్రమే ఈ ఇబ్బందులు భరించలేక ప్రైవేట్‌ వ్యాపారులను ఆశ్రయించారు.

ధాన్యం బోనస్‌.. మైనస్‌1
1/2

ధాన్యం బోనస్‌.. మైనస్‌

ధాన్యం బోనస్‌.. మైనస్‌2
2/2

ధాన్యం బోనస్‌.. మైనస్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement