ఖమ్మం సహకారనగర్: సమస్యలపై ఫిర్యాదులు, ప్రభుత్వ పథకాల కోసం వినతిపత్రాలు స్వీకరించేందుకు ప్రతీ సోమవారం కలెక్టరేట్లో నిర్వహించే గ్రీవెన్స్ డే(ప్రజావాణి)కు జనం పోటెత్తుతున్నారు. మండల స్థాయిలో కూడా ప్రజావాణి నిర్వహిస్తున్నా జిల్లా కేంద్రంలోనైతే కలెక్టర్ దృష్టికి నేరుగా సమస్యను తీసుకెళ్లవచ్చని భావిస్తుండడం ఇందుకు కారణంగా తెలుస్తోంది. దీంతో వారం వారం ఇక్కడ ఫిర్యాదులు, వినతుల సంఖ్య పెరుగుతోంది. అయితే, ఇందులోనూ చాలా మంది రెండు, మూడుసార్లు విన్నవించినా పరిష్కారం కాక అదే సమస్యపై మళ్లీమళ్లీ ఫిర్యాదులు ఇస్తుండడం గమనార్హం.
ప్రజావాణి ఇలా...
కలెక్టర్గా అనుదీప్ దురిశెట్టి బాధ్యతలు స్వీకరించాక గత సోమవారం తొలిసారి ప్రజావాణికి హాజ రయ్యారు. ఈక్రమంలో ఆయన ఫిర్యాదుల ఆన్లైన్, పరిష్కారంపై అధికారులకు సూచనలు చేశారు. మండల స్థాయిలో సమస్యల పరిష్కారంపై జిల్లా అధికారులు సమీక్షించాలని తెలిపారు. ఏవైనా సమస్యలు పరిష్కరించలేకపోతే అందుకు కారణాలను వివరించాలని సూచించారు. అంతేకాక ప్రతీ సోమవారం ప్రజావాణికి ముందు గత వారం ఫిర్యాదులపై సమీక్షించాలని ఆదేశించారు. దీంతో ఈ వారం అధికారులు సమీక్షించి పెండింగ్ దరఖాస్తులపై ఆరా తీశారు. ఇక సోమవారం సైతం గ్రీవెన్స్ డేకు హాజరైన కలెక్టర్ అనుదీప్.. అదనపు కలెక్టర్లు శ్రీజ, శ్రీనివాసరెడ్డితో కలిసి ఫిర్యాదులు స్వీకరించారు. డీఆర్వో పద్మశ్రీ, డీఆర్డీఓ సన్యాసయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.
ఫిర్యాదులు కొన్ని..
● ఖమ్మం పంపింగ్ వెల్ రోడ్డులో కొప్పు ప్రభావతి, కొప్పు పద్మావతి, కొప్పు సంపత్కుమార్కు 4,716 చదరపు గజాల స్థలం ఉండగా, అందులో 616 గజాల్లో నగరపాలక సంస్థ అధికారులు పార్క్ నిర్మించారని ఫిర్యాదు చేశారు. తమ భూములు తిరిగి ఇప్పించాలని కోరారు.
● చింతకానికి చెందిన దివ్యాంగుడు పి.జగన్నాథం సదరం సర్టిఫికెట్ మంజూరు చేయాలని కోరారు.
● పువ్వాడ ఉదయ్నగర్ కాలనీ గ్రామకార్యదర్శి అక్రమాలకు పాల్పడుతుండగా, గతంలోనూ ఫిర్యాదు చేసినా చర్యలు తీసుకోలేదని వీర నారీమణుల ఆశయసాధన సమితి బాధ్యులు తెలిపారు. ఆయనను బదిలీ చేయాలని వినతిపత్రం అందజేశారు.
రెండు గదుల్లో ఏడుగురం..
నేను కూలీ పనులతో జీవనం సాగిస్తున్నా. రెండు గదులు ఉన్న అత్త గారింట్లో ఉంటుండగా... ఇందిరమ్మ ఇంటి పథకంలో నన్ను ఎల్–3 కింద చేర్చారు. రెండు గదుల్లో ఏడుగురు ఉంటూ ఇబ్బంది పడుతున్నందున మొదటి విడతలో ఇల్లు మంజూరు చేయాలి.
– రేగళ్ల నాగమణి, తాటిపుడి, వైరా మండలం
స్థలం ఆక్రమణ, అమ్మకం
వారసత్వంగా నాకు, నా సోదరుడికి ఆరు కుంటల ఇంటి స్థలం రావాల్సి ఉంది. కానీ ఇంకో సోదరుడు, ప్రభుత్వ ఉద్యోగి హలావత్ వెంకన్న మమ్ముల్ని బెదిరించి స్థలాన్ని ఇతరులకు అమ్మాడు. అధికారులు విచారణ చేపట్టి న్యాయం చేయాలి.
– హలావత్ సీత్లా, రత్యా, కోక్యాతండా
నా భూమి ఇప్పించండి
చింతకాని మండలం అనంతసాగర్లో ఎనిమిది కుంటల వ్యవసాయ భూమి ఉంది. ఈ భూమి 277 సర్వేనంబర్లో ఉంటే, 278గా చెబుతూ సైదులు ఖమ్మంకు చెందిన శ్రీనివాసరావుకు విక్రయించాడు. అధికారులు పరిశీలించి భూమి ఇప్పించాలి.
– పాశం సైదులు, రామకృష్ణాపురం
కొన్ని సమస్యలపై పదేపదే ఫిర్యాదులు
అయినా పరిష్కారం కాక ఆవేదన
ప్రజావాణికి బారులు...
ప్రజావాణికి బారులు...
ప్రజావాణికి బారులు...
ప్రజావాణికి బారులు...