
చిరు వ్యాపారులతో సంఘాలు
● కార్పొరేషన్, మున్సిపాలిటీల్లో కొత్త సీఐజీల ఏర్పాటు ● మెప్మా ఆధ్వర్యాన సంఘాల నిర్మాణం
ఖమ్మంమయూరిసెంటర్: పట్టణ పేదల జీవనోపాధిని మెరుగుపర్చడమే లక్ష్యంగా మెప్మా తమ 100 రోజుల ప్రణాళికలో భాగంగా వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. వీధి వ్యాపారుల కోసం కామన్ ఇంట్రెస్ట్ గ్రూప్లు (సీఐజీ) ఏర్పాటు చేయించడం ఈ కార్యక్రమ లక్షంగా చెబుతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ పరిధిలో చిరు వ్యాపారాలు నిర్వహించుకునే వీధి వ్యాపారులకు సంఘాల ఏర్పాటుతో వారి జీవితాల్లో మార్పులు వస్తాయని, ఆర్థిక స్వావలంబనకు మార్గం ఏర్పడుతుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఈమేరకు ఖమ్మం మున్సిపల్ కార్పొరేషన్తో పాటు మధిర, సత్తుపల్లి, వైరా మున్సిపాలిటీల పరిధిలో మొత్తం 284 సీఐజీల ఏర్పాటును ప్రభుత్వం లక్ష్యం నిర్దేశించగా ఇప్పటి వరకు 57 గ్రూప్లను ఏర్పాటు చేశారు.
పదేసి మందితో...
ఒకే రకమైన వ్యాపారం చేసేవారు లేదా ఒకే ప్రాంతంలో వ్యాపారం చేసే వీధి వ్యాపారులను కలిపి గ్రూప్గా ఏర్పాటుచేస్తారు. కూరగాయలు, పండ్లు, చిరుతిళ్లు, వస్త్రాలు ఇలా ఒకే కేటగిరీకి చెందిన వారు, ఒకే వీధిలో తోపుడు బండ్లు, చిన్న బడ్డీ కొట్ల ద్వారా వ్యాపారం చేసేవారిపై దృష్టి సారించారు. ఒక్కో గ్రూప్లో ఐదు నుంచి 10 మంది సభ్యులు ఉండేలా చూస్తున్నారు.
ఆర్థిక సాయం..
వీధి వ్యాపారులతో సీఐజీలను ఏర్పాటుచేశాక మెప్మా ఆధ్వర్యాన బ్యాంక్ లింకేజీ రుణాలు ఇప్పించే వీలుంటుంది. వీధి వ్యాపారులు వ్యక్తిగత రుణం తీసుకోవడానికి ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ నేపథ్యాన సంఘంగా ఏర్పడితే బ్యాంకుల నుండి లింకేజీ రుణాలు సులువుగా మంజూరు కానున్నాయి. ఒక్కో గ్రూప్కు రూ.లక్ష వరకు రుణం మంజూరయ్యే అవకాశమున్నందున వ్యాపార విస్తరణకు ఉపయోగపడుతుందని భావిస్తున్నారు. అంతేకాక సీఐజీలు ఏర్పడ్డాక వీధి వ్యాపారులకు వ్యాపార నైపుణ్యాలు, కొత్త పద్ధతులపై శిక్షణ ఇప్పిస్తారు. అలాగే, ఒకే రకమైన సమస్య ఎదుర్కొంటున్న వ్యక్తులు గ్రూప్గా ఏర్పడడం ద్వారా మానసిక మద్దతు ఇచ్చిపుచ్చుకుంటారని.. వారి సమస్యలపై చర్చించుకుని పరిష్కరించుకునేలా వీలు ఏర్పడుతుందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో సీఐజీల లక్ష్యం, ఏర్పాటు
స్థానిక సంస్థ సీఐజీల ఏర్పాటైన
లక్ష్యం సీఐజీలు
ఖమ్మం కార్పొరేషన్ 218 30
మధిర 23 08
సత్తుపల్లి 22 09
వైరా 21 10