
చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలి
పోలీసు కమిషనర్ సునీల్దత్
ఖమ్మంక్రైం: యువత చెడు వ్యసనాలకు దూరంగా ఉండాలని, తద్వారా మంచి భవిష్యత్ ఏర్పర్చుకోవచ్చని పోలీసు కమిషనర్ సునీల్దత్ తెలిపారు. మాదక ద్రవ్యాల వినియోగం, రవాణాకు వ్యతిరేకంగా ఖమ్మం రిక్కాబజార్ పాఠశాలలో సోమవారం ఏర్పాటుచేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. సిగరెట్లు, గంజాయి, మద్యం వంటివి సరదాగా మొదలైనా ఆ తర్వాత వాటికి బానిసలైతే జీవితాన్ని కోల్పోవాల్సి ఉంటుందని పేర్కొన్నారు. అంతేకాక మాదక ద్రవ్యాలకు అలవాటు పడితే సమాజం ఎదుట దోషిగా నిలబడాల్సి వస్తుందని చెప్పారు. ఈమేరకు మాదక ద్రవ్యాలను నిర్మూలించడంలో విద్యార్థులు, యువత భాగస్వామ్యం కావాలని సూచించారు. ఎక్కడైన గంజాయి, డ్రగ్స్ వంటి వినియోగం, అమ్మకాల సమాచారం తెలిస్తే 1908, 100 నంబర్లకు సమాచారం ఇవ్వాలని తెలిపారు. అనంతరం పాఠశాల ఆవరణలో సీపీ మొక్కలు నాటారు. ఈకార్యక్రమంలో నగర ఏసీపీ రమణమూర్తి, సీఐ బాలకృష్ణ, ఎంఈఓ శైలజలక్ష్మి, హెచ్ఎం విశ్రాంత, ఉపాధ్యాయులు కట్టా శేఖర్రావు, సుజాత, ఉమాదేవి, పోలీసు ఉద్యోగులు పాల్గొన్నారు.