వాటాధనం నుంచి వాటా.. | - | Sakshi
Sakshi News home page

వాటాధనం నుంచి వాటా..

Jun 24 2025 3:49 AM | Updated on Jun 24 2025 3:49 AM

వాటాధ

వాటాధనం నుంచి వాటా..

● సొసైటీలకు ఆరు శాతం డివిడెంట్‌గా చెల్లించేందుకు నిర్ణయం ● ఫలితంగా రూ.103 కోట్లలో రూ.6 కోట్లు అందే అవకాశం ● రాష్ట్రంలోనే తొలిసారి ఖమ్మం డీసీసీబీలో అమలు

ఖమ్మంవ్యవసాయం: సహకార బ్యాంకుల మనుగడకు మూలమైన ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాల(పీఏసీఎస్‌)ల బలోపేతానికి జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ) నడుం బిగించింది. సహకార వ్యవస్థలో కీలకమైన పీఏసీఎస్‌లకు రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా వాటాధనంలో కొంత మేర చెల్లించాలని నిర్ణయించింది. సహకార సంఘాల సభ్యులకు డీసీసీబీ నుంచి ఏటా పంట రుణాలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు మధ్య కాలిక, దీర్ఘ కాలిక రుణాలను ఇస్తున్నారు. ప్రతీ రుణంలో 10 శాతం వాటాధనాన్ని అప్పులో భాగంగా తమ వద్దే డిపాజిట్‌ చేస్తారు. ఇందులో నుంచి ఆరు శాతాన్ని డివిడెంట్‌ రూపంలో పీఏసీఎస్‌లకు అందించాలని డీసీసీబీ పాలకవర్గం తాజాగా నిర్ణయించింది. ఖమ్మం జిల్లా కేంద్ర సహకార బ్యాంకు పరిధిలోని ఖమ్మం జిల్లాలో 75, భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో 26, మహబూబాబాద్‌, ములుగు జిల్లాల్లో రెండేసీ పీఏసీఎస్‌లతో పాటు 176 వ్యవసాయేతర పరపతి సంఘాలు ఉన్నాయి. అంతేకాక బ్యాంకు 50 బ్రాంచ్‌లతో రూ.3,600 కోట్ల టర్నోవర్‌ కలిగి ఉంది. ఏటా సుమారు రూ.1,200 కోట్ల పంట రుణాలు, రూ.900 కోట్లు డిపాజిట్లు కొనసాగుతుండగా, వ్యవసాయ అవసరాలకే కాక బంగారు తాకట్టుపై, గృహ నిర్మాణం, వాహన, విద్య అవసరాలకు కూడా రుణాలు ఇస్తున్నారు.

డివిడెంట్‌గా ఆరు శాతం

సహకార సంఘాల ద్వారా అందించిన పంట రుణాలు, ఇతర మధ్య కాలిక, దీర్ఘ కాలిక రుణాల ద్వారా వాటాధనంగా రూ.103 కోట్ల నిధులు ఉన్నాయి. ఇందులో నుంచి ఆరు శాతం అంటే రూ.6 కోట్ల మేర సహకార సంఘాలకు డివిడెంట్‌ రూపంలో చెల్లించేలా తీర్మానించారు. ఈ నిధులతో సంఘాలు తిరిగి సంఘ సభ్యులకే లబ్ధి జరిగేలా ఖాతాల్లో అప్పు కింద జమ చేసుకునే అవకాశం ఉంది. లేదంటే దీర్ఘకాలిక అవసరాల కోసం గోదాంలు, కోల్డ్‌ స్టోరీజీలు నిర్మించే ప్రతిపాదనలు చేసినట్లు సమాచారం.

100 సంఘాలకు ప్రయోజనం

వాటాధనం నుంచి ఆరు శాతం డివిడెంట్‌ రూపంలో డీసీసీబీ చెల్లిస్తుండగా, బ్యాంకు పరిధిలోని 100 సహకార సంఘాలకు ప్రయోజనం చేకూరే అవకాశం ఉంది. వాటాధనంగా జమ అయిన మొత్తం రైతులు తీసుకున్న పంట రుణాల ద్వారా సమకూరగా, ఆ వాటాధనం రైతులదే కావడంతో అన్నదాతలతో పాటు సహకార సంఘాలకు ప్రయోజనం కలిగేలా డీసీసీబీ పాలక వర్గం డివిడెంట్‌ చెల్లింపునకు నిర్ణయించింది.

సొసైటీల బలోపేతమే లక్ష్యం

పీఏసీఎస్‌ల బలోపేతమే లక్ష్యంగా సంస్కరణలు అమ లు చేస్తున్నాం. బ్యాంకు ఎదుగుదలకు కీలకమైన పీఏసీఎస్‌ల నుంచి రైతులు తీసుకున్న రుణాల్లో వాటాధనం సేకరిస్తున్నాం. అందులో నుంచి ఆరు శాతం డివిడెంట్‌గా సంఘాలకు చెల్లించేందుకు పాలకవర్గం నిర్ణయించింది.

–ఎన్‌.వెంకటఆదిత్య, సీఈఓ, డీసీసీబీ

తొలిసారి ఇక్కడే..

రాష్ట్రంలో తొమ్మిది డీసీసీబీలు ఉండగా, ఖమ్మం డీసీసీబీ మాత్రమే వాటాధనంలో ఆరు శాతాన్ని సహకార సంఘాలకు డివిడెంట్‌గా చెల్లించాలని నిర్ణయించడం విశేషం. 105 ఏళ్ల చరిత్ర కలిగిన డీసీసీబీ అనేక సంస్కరణలను తీసుకురాగా, ఒడిదుడుకులు, లాభ నష్టాలను అధిగమిస్తూ రైతులు, ఇతర వర్గాలకు అండగా నిలుస్తోంది. 2023 – 24 నుంచి బ్యాంకు లాభాల్లో పయనిస్తుండగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరంలో రూ.9.64 కోట్ల లాభాలు గడించింది. ఈ నేపథ్యాన బ్యాంకు మనుగడకు మూలమైన పీఏసీఎస్‌లకు ప్రయోజనం కలిగేలా వాటాధనం చెల్లింపునకు నిర్ణయం తీసుకుంది.

వాటాధనం నుంచి వాటా.. 1
1/1

వాటాధనం నుంచి వాటా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement