
కారు – ఆటో ఢీ, ఒకరు మృతి
కారేపల్లి: బతుకుతెరువు కోసం ఊరూరా తిరుగుతూ పాత సామాన్ల వ్యాపారం చేసే కుటుంబంలో రోడ్డు ప్రమాదం విషాదాన్ని నింపింది. కారేపల్లి మండలంలో జరిగిన ఈ ప్రమాదం వివరాలు... మధిర పట్టణానికి చెందిన ఒకే కుటుంబ వాసులు మేకల సీత(30), అద్దంకి ఎల్లయ్య, మంగమ్మ, అద్దంకి సాయి ట్రాలీ ఆటోలో శుక్రవారం ఇల్లెందు సమీప గ్రామాల్లో తిరుగుతూ పాత సామగ్రి కొనుగోలు చేశారు. ఆపై కారేపల్లి – ఇల్లెందు ప్రధాన రహదారిలో వస్తుండగా ఆలియాతండా సమీపాన ఉసిరికాయలపల్లి శ్రీ కోటమైసమ్మతల్లి ఆర్చి వద్ద భాగ్యనగర్తండా గ్రామానికి చెందిన గుగులోతు రోమి, ఆయన సోదరుడు కారులో వెళ్లూ క్రమాన రెండు వాహనాలు ఢీకొన్నాయి. రెండు వాహనాలు రోడ్డు పక్కకు దూసుకెళ్లగా మేకల సీత తీవ్రగాయాల పాలై అక్కడికక్కడే మృతి చెందింది. అలాగే, ఆటోలో ఉన్న సాయి, ఎల్లయ్య, మంగమ్మకు సైతం గాయాలయ్యాయి. కారులో ఉన్న వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. కారేపల్లి పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు దర్యాప్తు చేపట్టారు.
మరో ముగ్గురికి తీవ్రగాయాలు