ఆయిల్‌ ‘ఫామ్‌’లోకి వచ్చేలా.. | - | Sakshi
Sakshi News home page

ఆయిల్‌ ‘ఫామ్‌’లోకి వచ్చేలా..

Jun 6 2025 6:25 AM | Updated on Jun 6 2025 6:25 AM

ఆయిల్

ఆయిల్‌ ‘ఫామ్‌’లోకి వచ్చేలా..

● జిల్లాలో 14,500 ఎకరాల్లో సాగుకు ప్రణాళిక ● ఆయిల్‌ ఫెడ్‌, గోద్రెజ్‌ కంపెనీల ద్వారా పంట సాగు ● ఇదే సమయాన పండ్లు, కూరగాయల తోటల సాగుకు ప్రోత్సాహం

ఖమ్మంవ్యవసాయం: ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రభుత్వం పెద్దపీట వేస్తుంది. రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా గత కొంత కాలంగా జిల్లాలో ఆయిల్‌ పామ్‌ సాగుకు రైతులు ప్రాధాన్యం ఇస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహకాలకు తోడు, ఇక్కడి భూములు, వాతావరణం, నీటి లభ్యత అనుకూలిస్తుండడం, పంట కొనుగోలుకు పరిశ్రమలు ఉండడం సాగు విస్తీర్ణం పెరగడానికి దోహదపడుతున్నాయి. పోషకాలున్న పామ్‌ ఆయిల్‌కు ఉన్న డిమాండ్‌ను దృష్టిలో పెట్టుకొ ని రాష్ట్ర ప్రభుత్వం పంట సాగుకు ప్రాధాన్యం ఇస్తుంది. పామ్‌ ఆయిల్‌ ఇండోనేషియా, మలేషియా, థాయ్‌లాండ్‌ తదితర దేశాల నుంచి మన దేశానికి దిగుమతి అవుతున్న తరుణాన.. ఇక్కడ పంట సాగుకు వనరులుండడంతో పాటు డిమాండ్‌ కూడా ఉండడంతో రాష్ట్రంలో సాగు విస్తీర్ణాన్ని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈనేపథ్యాన రాష్ట్రంలోని 27 జిల్లాల్లో పంట సాగుకు నేలలు అనుకూలంగా ఉండగా 2022 నుంచి 2027 వరకు 30 లక్షల ఎకరాల్లో పంటను సాగు చేయాలని నిర్దేశించింది. దీనిలో భాగంగా ప్రతి ఏటా పంట సాగు లక్ష్యాలను విధిస్తున్నారు. జిల్లాలో పంట సాగు విస్తీర్ణం 28,184 ఎకరాలు కాగా 2022 నుంచి 2025 వరకు మూడేళ్ల కాలంలో 21,390 ఎకరాల్లో సాగవుతోంది.

రూ. 56 కోట్ల నిధులతో..

జిల్లాలో 2025–26 సంవత్సరంలో రూ.56 కోట్లతో 14,500 ఎకరాల్లో ఆయిల్‌ పామ్‌ సాగుకు ప్రణాళిక రూపొందించారు. నాలుగేళ్ల కాలపరిమితితో ఆయిల్‌ ఫెడ్‌ ద్వారా 9,250, గోద్రెజ్‌ ద్వారా 5,250 ఎకరాల్లో పంట సాగుకు నిర్ణయించారు. ఒక్కో ఎకరానికి డ్రిప్‌, మొక్కలు, అంతర పంటల సాగుకు రూ.38,600 చొప్పున ప్రోత్సాహకంగా అందిస్తున్నారు. డ్రిప్‌ పరికరాలకు మొదటి విడతలో 1,710 ఎకరాలకు గాను రూ.16.17 కోట్లను కేటాయించారు. షెడ్యూల్‌ కులాలు, షెడ్యూల్‌ తెగల వారికి 100 శాతం, వెనకబడిన తరుగుతులు, సన్న, చిన్నకారు రైతులకు 90 శాతం, ఇతర రైతులకు 80 శాతం రాయితీలు కల్పిస్తున్నారు. మొక్కలకు ఎకరాకు రూ.11,600 రాయితీతో పాటు అంతరపంటలకు ఎకరాకు రూ.4,200 రాయితీ అందించేలా నిర్ణయించారు. డిసెంబర్‌ నాటికి లక్ష్యాలను చేరే విధంగా ప్రణాళికలు రూపొందించారు.

పండ్ల తోటలకు ప్రోత్సాహకాలు

సమీకృత ఉద్యా మిషన్‌ పథకం ద్వారా పండ్ల తోటల సాగుకు ప్రోత్సాహకాలను అందించేలా ప్రణాళిక రూపొందించారు. డ్రాగన్‌ ఫ్రూట్‌, అరటి, అంజీర, అవకాడో, బొప్పాయి, ఉసిరి, మామిడి, నిమ్మ, జామ, హైబ్రిడ్‌ కూరగాయలు, పూల తోటలను మొత్తం 227 హెక్టార్లలో పెంపకానికి రాయితీలు కల్పించారు. అంతేకాక 13 హెక్టార్లలో ముదరు మామిడి తోటల పునరుద్ధరణకు, 540 హెక్టార్లలో మల్చింగ్‌ షీట్లకు, రెండు ప్యాక్‌ హస్‌ యూనిట్లకు, ఉద్యాన యాంత్రీకరణ 63 యూనిట్లకు, ఫ్రూట్‌ కవర్లకు, వీడ్‌ మ్యాట్లకు నిధులు కేటాయించారు. రాష్ట్రీయ కృషి వికాస్‌ యోజన పథకం కింద తీగజాతి కూరగాయల శాశ్వత పందిర్లు 50 యూనిట్లకు రూ. 25 లక్షలు కేటాయించారు. జాతీయ వెదురు మిషన్‌ పథకం కింద 50 ఎకరాల్లో మొక్కలు నాటేందుకు రాయతీలను కల్పించారు. ఇందుకోసం రూ.7.20 లక్షలు కేటాయించినట్లు అధికారులు తెలిపారు.

ప్రోత్సాహకాలను

వినియోగించుకోండి..

రైతుల ఆర్థిక బలోపేతం కోసం ప్రభుత్వం ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకాలను అందిస్తోంది. ఇందులో భాగంగా ఆయిల్‌ పామ్‌ సాగుకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. పంట సాగుతో అనేక ప్రయోజనాలుండగా.. మార్కెటింగ్‌కు జిల్లాలో పరిశ్రమలు కూడా నెలకొల్పబడి ఉన్నాయి. పండ్ల తోటలకూ ప్రోత్సాహకాలను అందిస్తున్న నేపథ్యాన ఆసక్తి కలిగిన రైతులు సమీప ఉద్యాన అధికారులను సంప్రదించి దరఖాస్తు చేసుకోవాలి.

– ఎం.వీ.మధుసూదన్‌,

జిల్లా ఉద్యాన, పట్టు పరిశ్రమాధికారి

ఆసక్తి కలిగిన రైతులు సంప్రదించాల్సిన నంబర్లు

అధికారి సెల్‌ నంబర్‌ మండలాలు

పి.అపర్ణ 89777 14104 కూసుమంచి, ఖమ్మం రూరల్‌, తిరుమలాయపాలెం, నేలకొండపల్లి

ఎ.విష్ణు 89777 14113 ముదిగొండ, చింతకాని, బోనకల్‌, మధిర, ఎర్రుపాలెం

ఎ.వేణు 89777 14105 వైరా, కొణిజర్ల, కామేపల్లి, సింగరేణి, ఏన్కూరు

జి.నగేష్‌ 89777 14103 ఖమ్మం అర్బన్‌, రఘునాథపాలెం, తల్లాడ, కల్లూరు, పెనుబల్లి

జి.శ్రావణి 89777 14114 సత్తుపల్లి, వేంసూరు

ఆయిల్‌ ‘ఫామ్‌’లోకి వచ్చేలా..1
1/1

ఆయిల్‌ ‘ఫామ్‌’లోకి వచ్చేలా..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement