
బెస్ట్ చదువు కోసం..
●ఎవరెవరు అర్హులు
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి ప్రభుత్వం పలు అర్హతలను నిర్ణయించింది. తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో అయితే రూ.1.50 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.2 లక్షలకు మించొద్దు. జిల్లాకు చెందిన విద్యార్థినీ విద్యార్థులకు మాత్రమే అవకాశం కల్పిస్తారు. ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఒకటో తరగతిలో చేరేందుకు 2019 జూన్ 1 నుంచి 2020 మే 31 మధ్య జన్మించిన వారు (5 – 6 ఏళ్ల వయస్సు) అర్హులు. కాగా, విద్యార్థుల ఎంపిక ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పారదర్శకంగా జరుగుతుంది. సీట్ల కేటాయింపులో ఎస్సీ కేటగిరీ –1 ఉపకులాల వారికి 1 శాతం, ఎస్సీ కేటగిరీ – 2 ఉపకులాల వారికి 9 శాతం, ఎస్సీ కేటగిరి – 3 ఉపకులాల వారికి 5 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ఒకవేళ నిర్ణీత సీట్ల కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే డ్రా పద్ధతిన విద్యార్థులను ఎంపిక చేయనున్నారు.
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల విద్యార్థినీ, విద్యార్థులకు ఉత్తమ విద్యను అందించేందుకు ప్రభుత్వం బెస్ట్ అవైలబుల్ స్కూళ్ల పథకాన్ని ప్రవేశపెట్టింది. ఇందులో భాగంగా 2025 – 26 విద్యాసంవత్సరంలో ఈ పథకం ద్వారా ప్రవేశాల కోసం దరఖాస్తులు ఆహ్వానించారు. ఐదో తరగతిలో రెసిడెన్షియల్ విధానం, ఒకటో తరగతిలో డే స్కాలర్లకు ప్రవేశాలు కల్పిస్తారు. ఇందులో 5వ తరగతికి 131, 1వ తరగతికి 128 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ముందుకొచ్చే ప్రైవేట్ స్కూళ్లను బెస్ట్ అవైలబుల్ స్కూళ్లుగా ఎంపిక చేసి విద్యార్థులకు ప్రవేశాలు కల్పిస్తారు.
రిజర్వేషన్లు ఇవే..
ఈ పథకం ద్వారా ఒక కుటుంబం నుంచి ఒక విద్యార్థికి మాత్రమే అవకాశం ఉంటుంది. విద్యార్థి తల్లిదండ్రులు డిగ్రీ లేదా అంతకంటే ఎక్కువ విద్యార్హతలు కలిగి ఉండొద్దు. సీట్ల కేటాయింపులో ప్రత్యేక రిజర్వేషన్లు ఉంటాయి. 50 శాతం సీట్లు వ్యవసాయ కూలీల పిల్లలకు, మొదటి తరం విద్యార్థులకు(కుటుంబంలో మొదటిసారి చదువుకుంటున్న వారికి) కేటాయిస్తారు. మిగిలిన 50 శాతంలో అనాథలకు 20 శాతం, జోగినుల పిల్లలకు 15 శాతం, బాండెడ్ లేబర్ పిల్లలకు 15 శాతం సీట్లు ఉంటాయి.
అందజేయాల్సిన పత్రాలు
దరఖాస్తుతో పాటు అధికారులు సూచించిన ధ్రువపత్రాల జిరాక్స్ కాపీలు జత చేయాలి. ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి మార్కుల జాబితా, ఒకటో తరగతికి పుట్టినతేదీ ధ్రువీకరణ పత్రం, రేషన్ లేదా ఆధార్ కార్డు జిరాక్సు, మీ–సేవ ద్వారా జారీ చేసిన నూతన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ పత్రాలు జత చేయాలి. ఈనెల 16న సాయంత్రం 5 గంటలలోపు దరఖాస్తు ఫారాలను కలెక్టరేట్లోని షెడ్యూల్డు కులాల అభివృద్ధి శాఖ ఉపసంచాలకుల కార్యాలయంలో అందజేయాల్సి ఉంటుంది.
ఎస్సీ విద్యార్థులకు మంచి అవకాశం
భవిష్యత్లో ఉన్నత విద్యను అభ్యసించేలా ఎస్సీ విద్యార్థులకు బెస్ట్ అవైలబుల్ స్కూల్ పథకం దోహదపడుతుంది. ఈ పథకం ద్వారా జిల్లాలో ఎంపిక చేసిన ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థులకు ప్రభుత్వం సీట్లు కేటాయించింది. బీఏఎస్ పాఠశాలల్లో వీరికి నాణ్యమైన విద్య అందుతుంది.
– కస్తాల సత్యనారాయణ, ఎస్సీ డీడీ
చిన్నారుల ఉజ్వల
భవిష్యత్కు పునాది
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
1, 5వ తరగతుల్లో 259 మంది
విద్యార్థులకు అవకాశం
ఎంపిక చేసిన ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు

బెస్ట్ చదువు కోసం..