
మన్మోహన్ సింగ్ ‘ఎర్త్ సైన్సెస్’..
● కొత్తగూడెం వర్సిటీకి మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరు ● తెలంగాణ కేబినెట్ సమావేశంలో లభించిన ఆమోదం ● జిల్లా ప్రజల్లో వ్యక్తమవుతున్న హర్షాతిరేకాలు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ఉమ్మడి ఖమ్మం జిల్లాకు ఇటీవల మంజూరైన ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయానికి మన్మోహన్ సింగ్ ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీగా నామకరణం చేశారు. ఈ మేరకు గురువారం హైదరాబాద్లో జరిగిన కేబినెట్ సమావేశంలో ఆమోదం లభించింది. దీంతో జిల్లా ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్రెడ్డికి వ్యవసాయ శాఖమంత్రి తుమ్మల నాగేశ్వరరావు ధన్యవాదాలు తెలిపారు.
ప్రపంచంలోనే రెండోది
సింగరేణి స్కూల్ ఆఫ్ మైన్స్గా 50 ఏళ్ల క్రితం 300 ఎకరాల్లో మొదలై యూనివర్సిటీ కాలేజీ ఆఫ్ ఇంజనీరింగ్ (కాకతీయ)గా అప్గ్రేడ్ చెందిన కేఎస్ఎం ప్రస్థానంలో మరో ఎత్తుకు చేరుకుంది. ఇటీవల ఈ కాలేజీని యూనివర్సిటీ ఆఫ్ ఎర్త్ సైన్సెస్గా రాష్ట్ర ప్రభుత్వం మార్చింది. ఇప్పుడీ కాలేజీకి ఆర్థికవేత్త, మాజీ ప్రధాని మన్మోహన్సింగ్ పేరును పెట్టింది. నాగరికతతో పాటు పెరుగుతున్న జనాభా అవసరాలు తీర్చడంలో సహజ వనరులు కీలక పాత్ర పోషించనుంది. ఎర్త్ సైన్సెస్ విశ్వవిద్యాలయంలో వివిధ కోర్సులను అమలుతో జాతీయస్థాయిలో కార్యకలాపాలు విస్తరించే అవకాశం ఉంది. ప్రపంచంలోనే ఇలాంటి విశ్వవిద్యాలయం కేవలం అమెరి కాలోనే ఉంది. రెండోది కొత్తగూడేనికి మంజూరైంది.
అందించే కోర్సులు
ప్రపంచంలో రెండో ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీ కావడంతో దేశ విదేశాల నుంచి అధ్యాపకులు, విద్యార్థులు ఇక్కడకు వచ్చే అవకాశముంది. కాలేజీ రాకతో ఈ ప్రాంత నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి, ఉద్యోగ అవకాశాలు లభించనున్నాయి. వేలాదిమంది విద్యార్థుల ఉన్నత చదువులకు అవకాశాలు లభించడంతోపాటు శాస్త్రవేత్తలుగా తయారుచేసే అవకాశాలు ఉన్నాయి. ఎర్త్ సైన్సెస్ వర్సిటీతో జియో కెమిస్ట్రీ, జియో ఫిజిక్స్, ప్లానెట్రీ జియాలజీ, జియో మేరపాలజీ, స్ట్రక్చర్ జియాలజీ, ఖనిజ శాస్త్రం, పర్యావరణ భూగర్భ శాస్త్రం వంటి విభిన్న కోర్సులు అందుబాటులోకి రానున్నాయి.
కళకళలాడనున్న క్యాంపస్
గ్రాడ్యుయేషన్లో జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో ఫిజిక్స్, జియో కెమిస్ట్రీ కోర్సులు ఉండగా పోస్ట్ గ్రాడ్యుయేషన్లో జియాలజీ, ఎన్విరాన్మెంట్ సైన్స్, జియో కెమిస్ట్రీ అందుబాటులోకి తేనున్నారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ నిబంధనల మేరకు పీహెచ్డీ చేయొచ్చు. ఇప్పటికే క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో మైనింగ్, కంప్యూటర్సైన్స్, ఈఈఈ, ఈసీఈ, ఐటీ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఇంజనీరింగ్ విభాగంలో ప్రతీ కోర్సులో 60 సీట్ల చొప్పున మొత్తం 780 సీట్లు ఇక్కడ అందుబాటులో ఉండగా ఎర్త్ సైన్సెస్ సబ్జెక్టులు రావడంతో ఈ సంఖ్య రెట్టింపు కానుంది.
అన్ని అనుకూలతలే..
దక్షిణ భారతదేశంలో ఖనిజనిధిగా భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు పేరుంది. ఎర్త్ సైన్స్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అన్ని అనుకూల వసతులు ఉన్నాయి. నేషనల్ హైవేకు సమీపంలో వర్సిటీ ఏర్పాటు చేస్తున్నారు. విశ్వవిద్యాలయం సమీపంలో మినీ స్టీల్ ప్లాంట్, నవభారత్ లిమిటెడ్, ఫెర్రో అల్లాయిస్, ఫెర్రో మెగ్నీషియం, విద్యుత్ ప్లాంట్లు కూడా ఉన్నాయి. జిల్లాలో ఐటీసీ పేపర్ బోర్డ్, హెవీ వాటర్ ప్లాంట్ ఉండగా, ఇక్కడికి సుమారు 20 కిలోమీటర్ల దూరంలో విమానాశ్రయాన్ని ఏర్పాటుకు ప్రతిపాదనలు పంపారు. త్వరలో ఈ కల నెరవేరనుంది. రోడ్డు, రైలు రవాణా మార్గాలు అతి సమీపంలో ఉన్నాయి. 35 కిలోమీటర్ల దూరంలో గోదావరి నది ప్రవహిస్తోంది. దీనివల్ల భవిష్యత్లో నీటి ఇబ్బందులు ఉండవు. ఇలా కొత్తగూడేనికి ఉన్న అనుకూలతలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి ఎర్త్ సైన్సెస్ యూనివర్సిటీని మంజూరు చేయించేందుకు మంత్రి తుమ్మల నిర్విరామంగా కృషి చేశారు. ఇప్పుడు మన్మోహన్సింగ్ పేరు పెట్టడంతో వర్సిటీపై దేశవ్యాప్తంగా చర్చ జరగనుంది.