
సర్వేకే పరిమితమైన డబ్లింగ్ లైన్
ఇళ్లు, వ్యవసాయ భూములు కోల్పోనున్న పలువురు
● ఐదు నెలల క్రితమే సర్వే, ఆపై మార్కింగ్ ● ఇప్పటికీ పరిహారం ఊసెత్తని అధికారులు
కారేపల్లి: డోర్నకల్ రైల్వే జంక్షన్ నుంచి కారేపల్లి రైల్వే జంక్షన్ మీదుగా కొత్తగూడెం స్టేషన్ వరకు ఉన్న సింగిల్ ట్రాక్ను డబుల్ ట్రాక్గా నిర్మించేందుకు రైల్వే అధికారులు నిర్ణయించారు. ఈమేరకు కారేపల్లి మండలంలో కమలాపురం, గేటుకారేపల్లి, కారేపల్లి, గాంధీనగర్, చీమలపాడు, రేలకాయపల్లి గ్రామాల్లో భూసేకరణ కోసం సర్వే చేశారు. మండల వ్యాప్తంగా 54 ఎకరాలు అవసరమని గుర్తించగా, కారేపల్లి పరిధి సింగరేణి రెవెన్యూలో సుమారు 60 – 70 మంది నుంచి 11.35 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించాలని ఉంటుందని నిర్ధారించారు. అలాగే, కారేపల్లిలో స్టేషన్ విస్తరణ, రెండో ప్లాట్ ఫామ్, అదనంగా రెండు ట్రాక్ల నిర్మాణానికి 20 కుటుంబాల నుంచి ఇళ్లు సేకరించాల్సి ఉంటుంది. ట్రాక్ నుంచి 45 మీటర్ల మేర వ్యవసాయ భూమి, స్టేషన్ పరిధిలో 65మీటర్ల భూమితో పాటు ఇళ్లు సేకరించేలా మార్కింగ్ సైతం వేశారు. ఈ ఏడాది జనవరిలో నోటిఫికేషన్ విడుదల చేసిన రైల్వే అధికారులు స్థానిక రెవెన్యూ అధికారులతో పాటు భూనిర్వాసితులకు సమాచారం ఇచ్చారు. ఆపై గ్రామసభలు నిర్వహించినా, ఇప్పటివరకు పరిహారంపై ప్రకటన చేయకపోవడంతో నిర్వాసితుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది.
సాగు చేయాలా.. వద్దా ?
డబ్లింగ్ లైన్ నిర్మాణ భూసేకరణ కోసం సర్వే చేపట్టి ఐదు నెలలు కావొస్తుండగా, పరిహారంపై స్పష్టత కోసం నిర్వాసితులు ఎదురుచూస్తున్నారు. వ్యవసాయ సీజన్ మొదలుకావడంతో రైల్వే అధికారులు మార్కింగ్ చేసిన భూముల్లో పంట సాగు చేయాలా, వద్ద మీమాంస నెలకొంది. సింగరేణి రెవెన్యూ పరిధి మైదాన ప్రాంతంలో ఉండడంతో ఇక్కడి భూములకు మంచి ధర పలుకుతోంది. అయితే, వ్యవసాయి భూములు, ఇంటి స్థలాలకు మార్కెట్ ధర కంటే మూడు రెట్లు అదనంగా పరిహారంగా నిర్ణయించినట్లు తెలిసింది. ఇక ఇళ్లకు స్వభావం ఆధారంగా ధర నిర్ణయించి గ్రామసభలో తీర్మానం చేస్తారని సమాచారం. ఇదంతా ఎప్పుడు జరుగుతుందో తెలియకున్నా పరిహారం స్పష్టత లేక, పంటల సాగుపై అవగాహన లేక నిర్వాసితులు ఎదురుచూపుల్లో గడుపుతున్నారు.

సర్వేకే పరిమితమైన డబ్లింగ్ లైన్