
విత్తన ఎంపికే కీలకం
● అనుమతి ఉన్న డీలర్ల వద్దే కొనుగోలు చేయాలి ● భూమి పదునెక్కాక సాగు చేస్తే మేలు ● సమగ్ర యాజమాన్య పద్ధతులతో ఉత్తమ దిగుబడి ● ‘సాక్షి’ ఫోన్ ఇన్లో డీఏఓ పుల్లయ్య, కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్
ఖమ్మంవ్యవసాయం: ‘పంటకు విత్తే మూలం.. సరైన విత్తనాలు ఎంచుకుని సమగ్ర విధానాలను అవలంబిస్తే ఆశాజనకమైన దిగుబడులు వస్తాయి..’ అని జిల్లా వ్యవసాయాధికారి ధనసరి పుల్లయ్య, వైరా కేవీకే కో–ఆర్డినేటర్ డాక్టర్ రవికుమార్ తెలిపారు. ‘సాక్షి’ ఆధ్వర్యాన శుక్రవారం నిర్వహించిన ఫోన్ ఇన్లో జిల్లా నలుమూలల నుంచి రైతులు సాగుకు అనువైన విత్తనాలు, అందుబాటులో ఉన్న రకాల వివరాలే కాక సాగు విధానాలు, పంటల సాగులో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అడిగిన ప్రశ్నలకు వారు సమాధానాలు ఇచ్చారు. ప్రభుత్వ ధ్రువీకరణ పొందిన కంపెనీలు, ఏజెన్సీలు, సంస్థలకు చెందిన విత్తనాలే కొనుగోలు చేయాలని సూచించిన అధికారులు పంట కాలం పూర్తయ్యే వరకు రశీదులు భద్రపర్చుకోవాలని తెలిపారు. ఈమేరకు రైతులు అడిగిన ప్రశ్నలకు అధికారులు ఇచ్చిన సమాధానాలు ఇలా ఉన్నాయి.
●ప్రశ్న : ప్రస్తుత వర్షాలకు వరి నార్లు పోసుకోవచ్చా? ఏ రకం విత్తనాలు మేలు?
– గరిడేపల్లి రామారావు, సుర్దేపల్లి
జవాబు : జూన్ మొదటి వారం తర్వాత వరినార్లు పోసుకోవచ్చు. ప్రభుత్వం అనుమతించిన సన్న రకాలను విత్తుకుంటే మద్దతు ధరతో పాటు బోనస్ వస్తుంది.
●ప్ర : పచ్చిరొట్ట విత్తన ధరలు గత ఏడాదితో పోలిస్తే పెంచారు.
– అయినాల కనకరత్నం, కేజీపురం,
మల్లేశ్వరరావు, భీమవరం
జ : విత్తనోత్పత్తి తగ్గడంతో కొంత మేర ధర పెరిగింది. ప్రభుత్వ సబ్సిడీతో పచ్చిరొట్ట విత్తనాలు అందుబాటులో ఉన్నాయి.
●ప్ర : యూరియాకు సబ్సిడీ ఎక్కువగా ఉండడంతో ఎక్కువగా వినియోగించాల్సి వస్తుంది. డీఏపీ, కాంప్లెక్స్ ఎరువులకు సైతం మరింత సబ్సిడీ ఇచ్చే ఆలోచన ఉందా?
– షేక్ లాల్ మహ్మద్, ఖానాపురం
జ : యూరియా వాడకం తగ్గించేలా రైతుల్లో అవగాహన కల్పిస్తున్నాం. కాంప్లెక్స్ ఎరువుల్లోనూ యూరియా పాళ్లు ఉంటాయి. ఫార్మర్ ఐడీ విధానం అమలైతే భూమి ఆధారంగా కోటా నిర్ధారించే అవకాశం ఉంది.
●ప్ర : పెసర ఎప్పుడు, ఏ రకాలు విత్తుకోవచ్చు?
– ఏటుకూరి రవి, నాగులవంచ,
జంగా రవీందర్రెడ్డి, బుచ్చిరెడ్డిపాలెం
జ : ఇప్పుడు దుక్కులు సిద్ధం చేసుకుని 60 మి.మీ.ల వర్షపాతం నమోదయ్యాక జూన్ మొదటి వారం నుంచి పెసర విత్తుకోవచ్చు. ఎంజీజీ రకాలు అందుబాటులోకి వచ్చాయి.
●ప్ర: పంటల సాగుపై మరిన్ని అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తారా?
– శ్రీనివాసరెడ్డి, రామానుజపురం
జ : రైతుల్లో అవగాహన పెంచే కార్యక్రమాలు నిర్వహిస్తున్నాం. లైసెన్స్డ్ డీలర్ల నుంచి విత్తనాలు కొనుగోలు చేస్తే నకిలీల బెడద ఉండదు.
●ప్ర : వరిలో కేఎన్ఎం 7715 రకం అందుబాటులోకి వస్తాయా? – ఏలూరి వెంకట్రావు, కొక్కిరేణి
జ : ఈ విత్తనాలను వ్యవసాయ విశ్వ విద్యాలయం ఇంకా రిలీజ్ చేయలేదు.
●ప్ర: ఆయిల్పామ్లో మొక్కజొన్నను అంతర పంటగా వేసుకోవచ్చా?
– కన్నెబోయిన రామకృష్ణయాదవ్,
బస్వాపురం
జ : 19 నెలల వయసు ఉన్న తోటలో అంతర పంటగా మొక్కజొన్న కంటే కూరగాయలు, పెసర, మినుము సాగు మేలు. దుక్కి ఎక్కువగా దున్నకూడదు. అలా చేస్తే ఆయిల్ పామ్ వేరు వ్యవస్థ దెబ్బతింటుంది. యాసంగి పంటగా మాత్రం మొక్కజొన్నకు అవకాశముంది.
●ప్ర : మెట్ట వరి సాగులో అధిక దిగుబడి ఇచ్చే రకాలు ఏవీ? – వరదా సైదులు, కొక్కిరేణి
జ : మెట్టలో వరి సాగు చేస్తే అంతగా దిగుబడులు రాకపోగా సమస్యలు ఉత్పన్నమవుతాయి. కలుపు, తెగుళ్ల సమస్యలు ఉంటాయి. అలాగే, ఆరుతడి వరి సాగులో ఆశించిన ప్రయోజనాలు ఉండవు.
●ప్ర : పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పట్టకుండా ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు?
– శీలం సత్యనారాయణ రెడ్డి, ఎర్రుపాలెం
జ : రైతుల కోసం అందుబాటులో ఉంచే పచ్చిరొట్ట విత్తనాలు పక్కదారి పడితే సహించేది లేదు. ఎవరైనా సరైన బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. తీసుకున్న విత్తనాలపై అవసరమైన ప్రాంతాల్లో క్రాప్ బుకింగ్ చేయిస్తాం.
●ప్ర : ఈ వర్షాలతో పత్తి సాగు చేయొచ్చా? పెసలు ఎప్పుడు వేసుకోవచ్చు?
– చాంద్పాషా, ముష్టికుంట్ల, సైదారావు, తనికెళ్ల, డి.తిరుపతిరావు, రాజులదేవరపాడు
జ : ఈ ఏడాది రోహిణి కార్తెలోనే వానలు కురుస్తున్నాయి. నేలలో పదును ఆధారంగా జూన్ 10 తర్వాత పత్తి విత్తనాలు విత్తుకోవచ్చు. పెసర కూడా జూన్ రెండో వారం నుంచి విత్తుకోవచ్చు. పెసరలో ఎంజీజీ రకాలు, వరంగల్ రకాలు అనుకూలం.
●ప్ర: ప్రస్తుత వర్షాలకు మెట్ట పైరుగా పత్తి సహా ఏయే పంటలు వేసుకోవచ్చు?
– శ్యాంసుందర్ రెడ్డి, గైగోళ్లపల్లి
జ : ఈ వర్షాలకు నేల రకాల ఆధారంగా మెట్ట పంటలుగా పత్తి, పెసర సాగు చేసుకోవచ్చు. ప్రస్తుతం పత్తి వేసిన నేలలో యాసంగి పంటగా మొక్కజొన్న వేసుకునే అవకాశముంది.
●ప్ర : ఎరువులు పాత నిల్వలు ఇస్తుండడంతో గడ్డలుగా ఉంటున్నాయి. వరిలో సన్న రకాల విత్తనాలు లభ్యం కావడం లేదు.
– నంద్యాల మాధవరావు, తిమ్మినేనిపాలెం
జ : ఎరువుల నిల్వలు అయిపోయాయి. ఇకపై గడ్డ కట్టిన ఎరువుల సరఫరా ఉండదు. రేక్ పాయింట్ కూడా మారింది. వరిలో సన్న బీపీటీ 5204 సాంబమసూరితో పాటు పలు సన్న రకాలు అందుబాటులోకి వచ్చాయి.
ప్ర : విత్తనాలు నకిలీవా, మంచివా ఎలా గుర్తించాలి?
– భూక్యా రాంబాబు, చంద్రశేఖర్,
సింగరేణి మండలం
జ: లైసెన్స్డ్ దుకాణాల్లో మాత్రమే కొనుగోలు చేయడమే కాక అన్ని వివరాలతో రశీదు తీసుకోవాలి. అపరిచిత వ్యక్తులు మాయమాటలతో అమ్మే విత్తనాలు నకిలీవని భావించాలి.
ప్ర : వరిలో 1224 రకాన్ని సాగు చేస్తే విక్రయానికి ఇబ్బంది పడ్డాం. ఇప్పుడేం చేయాలి?
– పోతురాజు నర్సింహారావు, తుమ్మలపల్లి
జ : 1224 కాకుండా ఇతర సన్న రకాల సాగు మంచిది. ఎంటీయూ 1010 వంటి అనేక రకాలు ఉన్నాయి.

విత్తన ఎంపికే కీలకం