ఖమ్మంక్రైం: ఏసీబీ డీఎస్పీ రమేష్కు విధినిర్వహణలో అభినందనలు దక్కాయి. అవినీతికి పాల్పడుతున్న ప్రభుత్వ ఉద్యోగులను అరెస్ట్ చేయడంలో కీలకంగా వ్యవహరిస్తున్న ఆయన ఉమ్మడి జిల్లాలో అత్యధిక కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యాన హైదరాబాద్లో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో డీఎస్పీకి ఏసీబీ డీజీపీ విజయకుమార్ క్యాష్ రివార్డు అందజేసి అభినందించారు.
బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ప్రవేశానికి దరఖాస్తులు
ఖమ్మంమయూరిసెంటర్: షెడ్యూల్డ్ కులాల అభివృద్ధి శాఖ ద్వారా బెస్ట్ అవైలబుల్ స్కూళ్లలో ఐదో తరగతి(రెసిడెన్షియల్), ఒకటో తరగతి(డే స్కాలర్)లో ప్రవేశానికి వచ్చేనెల 2నుంచి 16వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవాలని ఎస్సీ డీడీ కస్తాల సత్యనారాయణ తెలిపారు. ఐదో తరగతిలో 131 మంది, ఒకటో తరగతిలో 128 మందికి అవకాశం ఉంటుందని పేర్కొన్నారు. కాగా, ఐదో తరగతిలో ప్రవేశానికి నాలుగో తరగతి మార్కుల జాబితా, ఒకటి తరగతిలోనైతే పుట్టినతేదీ ధ్రువపత్రం, రేషన్కార్డు లేదా ఆధార్కార్డు జిరాక్స్, మీ సేవ ద్వారా జారీ చేసిన కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణపత్రాలను దరఖాస్తుకు జత చేయాలని సూచించారు. ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం రిజర్వేషన్ ఆధారంగా సీట్లు కేటాయిస్తారని తెలిపారు.
ముగిసిన ఉపాధ్యాయుల భర్తీ ప్రక్రియ
ఖమ్మంమయూరిసెంటర్: భద్రాద్రి జోన్ పరిధి ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సాంఘిక సంక్షేమ గురుకులాల్లో ఖాళీగా ఉన్న అధ్యాపక, ఉపాధ్యాయ పోస్టుల భర్తీ పూర్తిచేశామని జోనల్ అధికారి స్వరూపరాణి తెలిపారు. ఖమ్మంలోని డాక్టర్ బీఆర్.అంబేద్కర్ సాంఘిక సంక్షేమ కళాశాల(బాలికలు)లో నిర్వహించిన ఇంటర్వ్యూలకు దరఖాస్తు చేసుకున్న 1,165 మంది అభ్యర్థుల్లో 700 మంది హాజరయ్యారని వెల్లడించారు. విద్యార్హతలు, ప్రతిభ, డెమో ఆధారంగా తాత్కాలిక అధ్యాపకులు, ఉపాధ్యాయుల భర్తీ చేపట్టామని ఆమె ఓ ప్రకటనలో తెలిపారు.
కొనసాగుతున్న ‘దోస్త్’ ప్రవేశాలు
ఖమ్మం సహకారనగర్: డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ(దోస్త్) ద్వారా డిగ్రీ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాల ప్రక్రియ కొనసాగుతోంది. మొదటి విడతలో భాగంగా సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 6వ తేదీలోగా కళాశాలల్లో రిపోర్ట్ చేయాలని ఎస్ఆర్బీజీఎన్ఆర్ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ మహ్మద్ జకీరుల్లా తెలిపారు. లేనిపక్షంలో వారు సీటు కోల్పోతారని పేర్కొన్నారు. ఇక రెండో విడత ప్రవేశాల కోసం జూన్ 9వ తేదీ వరకు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని దోస్త్ కోఆర్డినేటర్ ఎం.డీ.సలీంపాషా ఓ ప్రకటనలో వెల్లడించారు.
లబ్ధిదారులకు అండగా నిలుస్తాం..
మధిర: ఇందిరా మహిళా డెయిరీ లబ్ధిదారులకు యంత్రాగగం అన్నివిధాలుగా సహకరిస్తుందని జిల్లా పశు సంవర్ధక శాఖ అధికారి డాక్టర్ వి.శ్రీనివాసరావు తెలిపారు. మధిర మండలం సిరిపురం, వంగవీడు గ్రామాల లబ్ధిదారులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా పశుగ్రాసం ఆవశ్యకత, గేదెల ఎంపిక, అధిక పాల ఉత్పత్తికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. త్వరలో యూనిట్లు అందనున్నందున ఇప్పటి నుంచే పశుగ్రాసం సాగుపై దృష్టి సారించాలని సూచించారు. అలాగే, అధిక పాల దిగుబడి వచ్చేలా మేలైన గేదెలను ఎంపిక చేసుకుని, పాలను ప్రభుత్వ కేంద్రాలకు సరఫరా చేయాలని తెలిపారు. ఆపై లబ్ధిదారుల సందేహాలను ఆయన నివృత్తి చేశారు. మండల పశు వైద్యాధికారి డాక్టర్ ఉమాకుమారి, గ్రామ దీపికలు పాల్గొన్నారు.

ఏసీబీ డీఎస్పీకి క్యాష్ రివార్డు