
కేన్సర్ బాధితులకు బేఫికర్
● జిల్లా కేంద్రంలోనే చికిత్సకు ఏర్పాట్లు ● పెద్దాస్పత్రిలో సిద్ధమవుతున్న 20 పడకల వార్డు
ఖమ్మంవైద్యవిభాగం: జిల్లాలో కేన్సర్ బారిన పడిన పేదల ఇక్కట్లు తీరనున్నాయి. ప్రభుత్వ వైద్యం కోసం హైదరాబాద్ తదితర ప్రాంతాలకు వెళ్లకుండా జిల్లా కేంద్రంలోని చికిత్స అందుబాటులోకి రానుంది. కేన్సర్ సోకి చివరి దశలో ఉన్న వారికే ప్రస్తుతం చికిత్స అందుతోంది. ఇకపై కేన్సర్ నిర్ధారణ, కీమోథెరఫీ, ఇతర చికిత్స కూడా అందించేలా ఏర్పాట్లు చేస్తున్నారు.
జిల్లా ఆస్పత్రిలో వార్డు
కేన్సర్ బారిన పడిన కొందరికి కీమోతోపాటు రేడియేషన్ థెరపీ అవసరమవుతుంది. కానీ ప్రభుత్వ పరంగా ఆ సౌకర్యం లేకపోవడంతో హైదరాబాద్కి వెళ్లాల్సి వస్తోంది. నాన్ కమ్యూనబుల్ డిసీజ్ ప్రోగ్రామ్ ద్వారా కేన్సర్ బాధితులను గుర్తిస్తుండగా.. మహిళా ఆరోగ్య కార్యక్రమం ద్వారా బ్రెస్ట్, ఓరల్, సర్వైకల్ కేన్సర్ బాధితుల గుర్తింపు కొనసాగుతోంది. వీరిలో వ్యాధి ప్రారంభ దశలో ఉంటే జిల్లాలోనే చికిత్స అందిస్తుండగా, సీరియస్ కేసులకు ప్రత్యేకంగా వార్డు లేదు. దీంతో కీమో, రేడియేషన్ థెరఫీ కోసం వారిని హైదరాబాద్ పంపిస్తున్నారు. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కేన్సర్ బాధితులు పెరుగుతున్న నేపథ్యాన రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మెడికల్ కళాశాలల అనుబంధ ఆస్పత్రుల్లో ప్రత్యేక సెంటర్లు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా ఖమ్మం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో 20 పకడలతో కేన్సర్ వార్డు సిద్ధం చేస్తున్నారు. వచ్చే నెలాఖరు నాటికి ఈ వార్డును అందుబాటులోకి తీసుకొచ్చేలా ఆధునికీకరణ పనులు చేపడుతున్నారు.
చివరి దశలో ఉంటే..
జిల్లాలో కేన్సర్ బారిన పడి చివరి దశలో ఉన్న వారికి పెద్దాస్పత్రిలోని పాలియేటివ్ సెంటర్లో చికిత్స అందిస్తున్నారు. ఈ సెంటర్లో కేవలం ఏడు పడకలే ఉన్నాయి. హైదరాబాద్లో చికిత్స చేయించినా ఫలితం లేక జీవిత చరమాంకానికి చేరిన వీరికి ఈ సెంటర్లో చికిత్స అందించడమే కాక ఇంకొందరికి మొబైల్ వాహనం ద్వారా మందులు ఇస్తున్నారు.ప్రభుత్వ నిర్ణయం ప్రకారం పెద్దాస్పత్రిలో 20 పడకలతో కూడిన కేన్సర్ సెంటర్ త్వరలోనే అందుబాటులోకి రానుంది. జిల్లాలో ప్రస్తుతం 3వేల మంది వరకు కేన్సర్ బాధితులు ఉన్నట్లు అంచనా. ఆస్పత్రిలో ప్రత్యేక వార్డుతో పాటు కీమో, రేడియేషన్ థెరపీ సేవలు మొదలైతే ప్రభుత్వ వైద్యం కోసం హైదరాబాద్ వెళ్లాల్సిన ఇక్కట్లు తీరనున్నాయి.

కేన్సర్ బాధితులకు బేఫికర్