
రిక్తహస్తమే..!
● రైల్వే బడ్జెట్ కేటాయింపుల్లో మొండిచేయి ● అంచనాలు రూ.కోట్లలో.. కేటాయింపులు రూ.లక్షల్లో ● ‘పింక్ బుక్’లో జాడే లేని లైన్లు
సాక్షి ప్రతినిధి, భద్రాద్రి కొత్తగూడెం: ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రైల్వేబడ్జెట్లో భద్రాద్రి కొత్తగూడెం జిల్లాకు మొండిచేయే ఎదురైంది. గత మార్చిలో బడ్జెట్ ప్రకటించగా కేటాయింపులపై పింక్బుక్ వివరాలు ఇటీవల వెల్లడయ్యాయి. ప్రతీ ప్రాజెక్టుకు అంచనా వ్యయం రూ.కోట్లలో ఉంటే కేటాయింపులు మాత్రం రూ.లక్షలకే పరిమితమయ్యాయి.
నామ్కే వాస్తే నిధులు..
భద్రాచలంరోడ్–కొవ్వూరు రైల్వే లైన్ను 151 కి.మీ. నిడివితో నిర్మించాల్సి ఉండగా ప్రస్తుత బడ్జెట్లో ఆమోదం లభించినా నిధులు అంతంతే కేటాయించారు. ట్రాక్ నిర్మాణానికి రూ.1,444 కోట్లు అవసరమైతే కేవలం రూ.95 లక్షలే కేటాయించడం గమనార్హం. ఈ లైన్తో పాటు కొత్తగా భద్రాచలం(పాండురంగాపురం)–మల్కన్గిరి, కిరండోల్– కొత్తగూడెం, మణుగూరు–రామగుండం రైల్వే లైన్ల నిర్మాణానికి సూత్రప్రాయంగా అంగీకారం తెలిపిన రైల్వే శాఖ.. ఫైనల్ లొకేషన్ సర్వే (ఎఫ్ఎల్ఎస్)కు ఆదేశాలు జారీ చేసింది. దీంతో ఈ మార్గాలకు కూడా ప్రస్తుత బడ్జెట్లో నిధులు కేటాయిస్తారని ఆశించినా ఫలితం కానరాలేదు.
మణుగూరుకు
మొండిచేయి..
మణుగూరు–రామగుండం రైల్వే లైన్ నిడివి 200 కి.మీ. కాగా నిర్మాణ వ్యయం రూ.2,911 కోట్లుగా అంచనా వేశారు. ఈ లైన్కు ప్రస్తుత బడ్జెట్లో కంటి తుడుపు చర్యగా రూ.73లక్షలు కేటాయించారు. రామగుండం సమీపంలోని రాఘవాపురం వద్ద మొదలై మంథని– భూపాలపల్లి–మేడారం–తాడ్వాయి– రామానుజపురం మీదుగా మణుగూరు వరకు ఈ లైన్ నిర్మించాల్సి ఉంది. ఇప్పటికే జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో భూసేకరణ చివరి దశ కు చేరగా, బడ్జెట్లో రిక్తహస్తమే ఎదురైంది.
ఆ లైన్ల ఊసేలేదు..
గిరిజన ప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా ఒడిశాలోని మల్కన్గిరి నుంచి ఛత్తీస్గఢ్, ఏపీ మీదుగా భద్రాచలం (పాండురంగాపురం) రైల్వేలైన్ నిర్మాణానికి ఆ శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ప్రత్యేక శ్రద్ధ చూపారు. ఈ మార్గానికి సంబంధించి భద్రాచలంరోడ్డు – మణుగూరు సెక్షన్లో పాండురంగాపురం నుంచి భద్రాచలం వరకు 15 కి.మీ. మార్గం దక్షిణ మధ్య రైల్వే పరిధిలోకి వస్తుంది. అయితే ప్రస్తుతం సౌత్ సెంట్రల్ రైల్వేకు చూపించిన కేటాయింపుల్లో ఈ మార్గం ఊసే లేదు. ఈస్ట్రన్ రైల్వే పరిధిలోని మల్క న్గిరి సెక్షన్లో జరిగే పనులకే రైల్వేశాఖ నుంచి నిధులు మంజూరయ్యాయి. అలాగే కొత్తగూడెం నుంచి ఛత్తీస్గఢ్లోని కిరోండల్కు సంబంధించి కూడా ప్రస్తుత బడ్జెట్లో ప్రస్తావనే లేకపోవడం గమనార్హం.
పోచారం, గాంధీపురం స్టేషన్లకు నిధులు
భద్రాచలం రోడ్ మీదుగా సర్వే నిర్వహించిన రైల్వే లైన్లలో ఒకటైన కొండపల్లి – కొత్తగూడెం(125 కి.మీ) రైల్వేలైన్ నిర్మాణ అంచనా వ్యయం రూ.997 కోట్లు కాగా ప్రస్తుత బడ్జెట్లో రూ.10 లక్షలే కేటాయించారు. డోర్నకల్ నుంచి భద్రాచలంరోడ్ వరకు ఉన్న సింగిల్ లైన్ను డబ్లింగ్ చేసేందుకు రూ.770 కోట్లు అవసరం. కానీ బడ్జెట్లో కేటాయింపులేమీ చూపలేదు. అయితే సింగరేణి (కారేపల్లి) మండల పరిధిలో పోచారం, గాంధీపురం రైల్వే సేష్టన్ల అభివృద్ధికి దాదాపు రూ.50 కోట్ల నిధులు కేటాయించారు.