● విత్తన ఎంపిక, సస్యరక్షణ చర్యల్లో అప్రమత్తత ● ‘రైతు ముంగిట్లో శాస్త్రవేత్తలు’లో కలెక్టర్ ముజమ్మిల్ఖాన్
మంత్రుల పర్యటనకు ఏర్పాట్లు
ఖమ్మంఅర్బన్: త్వరలో జరగనున్న మెడికల్ కాలేజీ భవనాల శంకుస్థాపనకు పలువురు మంత్రులు హాజరుకానున్నందున, పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ ఆదేశించారు. రఘునాథపాలెం వద్ద మెడికల్ కాలేజీకి కేటాయించిన భూములను పరిశీలించి శంకుస్థాపన ఏర్పాట్లపై సూచనలు చేశారు. మంత్రులు తమ పర్యటనలో భాగంగా శంకుస్థాపన చేయడంతో పాటు ప్రభుత్వ ఆస్పత్రిని సందర్శిస్తారని, కలెక్టరేట్లో సమీక్షించనున్నందున వివరాలతో అధికారులు సిద్ధం కావాలన్నారు. అదనపు కలెక్టర్ డాక్టర్ పి.శ్రీజ, ఆర్అండ్బీ ఎస్ఈ, ఈఈ యుగంధర్ తదితరులు పాల్గొన్నారు.
రఘునాథపాలెం: రైతులు పంటల సాగులో శాస్త్రవేత్తల సూచనలు పాటిస్తే మేలైన దిగుబడి సాధ్యమవుతుందని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ తెలిపారు. వానాకాలం పంటల సాగుపై అవగాహన కల్పించేలా ‘రైతు ముంగిట శాస్త్రవేత్తలు’ పేరిట నిర్వహిస్తున్న కార్యక్రమం సోమవారం ప్రారంభమైంది. ఈసందర్భంగా రఘునాథపాలెం మండలం రాంక్యాతండా రైతు వేదికలో నిర్వహించిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ మార్కెట్లో డిమాండ్ ఉన్న పంటల గుర్తింపు, మేలైన విత్తనాల ఎంపిక, సస్యరక్షణ చర్యల్లో అధికారులు, శాస్త్రవేత్తల సూచనలు పాటించాలని తెలిపారు. అంతేకాక పంట మార్పిడి, ప్రత్యామ్నాయ పంటలపై దృష్టి సారించాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి దనసరి పుల్లయ్య మాట్లాడుతూ విత్తనాలు, పురుగు మందుల రశీదులు పంట పూర్తయ్యేలా భద్రం చేయాలని సూచించారు. వైరా కేవీకే కోఆర్డినేటర్ రవికుమార్ మాట్లాడుతూ యూరియా వాడకం, నేల ఆరోగ్యం పరిరక్షణ తదితర అంశాలపై అవగాహన కల్పించారు. రఘునాథపాలెం, మంచుకొండ సొసైటీల అధ్యక్షులు తాతా రఘురాం, మందడపు సుధాకర్, ఖమ్మం డివిజన్ ఆత్మ చైర్మన్ దిరిశాల చిన్న వెంకటేశ్వర్లు, ఏడీఏ కొంగర వెంకటేశ్వరరావు మాట్లాడగా ఎంపీడీఓ అశోక్ కుమార్, మండల వ్యవసాయ అధికారి ఉమామహేశ్వర్రెడ్డి, ఉద్యానవనాధికారి నగేష్, ఏఈఓలు ప్రతిభ, వేదవ్యాస్, శివ, వెంకటేష్, శిరణ్మయి, పంచాయతీ సెక్రటరీ లాలయ్యతో పాటు నాయకులు నల్లమల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం కొత్త పంటల సాగులో ప్రతిభ కనబరుస్తున్న పలువురు రైతులను కలెక్టర్ సన్మానించారు.
జీవితంలో గొప్పగా ఎదగాలి
ఖమ్మంవన్టౌన్: విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను ఎంచుకోవడమే కాక వాటి సాధనకు కృషి చేయాలని కలెక్టర్ ముజమ్మిల్ఖాన్ సూచించారు. జిల్లా కేంద్రంలోని బాలల సదనాన్ని సందర్శించిన ఆయన పరీక్షల్లో మంచి మార్కులు సాధించిన వారిని అభినందించారు. అందుబాటులో ఉన్న అవకాశాలను సమర్ధవంతంగా వినియోగించుకుంటే మంచి ఫలితాలు వస్తాయని తెలిపారు. అనంతరం బాలల సదనంలో ఆధునికీకరణ పనులపై అధికారులకు సూచనలు చేశారు. జిల్లా సంక్షేమాధికారి కీసర రాంగోపాల్రెడ్డి, ఉద్యోగులు కృష్ణలాల్, విద్యాచందన పాల్గొన్నారు.