
తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలి
వైరా: కొనుగోలు కేంద్రాలకు వచ్చిన ధాన్యంలో తేమ శాతం సరిపడా రాగానే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని అదనపు కలెక్టర్ పి. శ్రీనివాసరెడ్డి అధికారులకు సూచించారు. మండలంలోని స్నానాల లక్ష్మీపురంలో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని, వైరాలో ఏఎంసీ, ఎంఎల్ఎస్ పాయింట్లను ఆదివారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొనుగోలు కేంద్రాలకు వచ్చే ధాన్యంలో తేమ శాతాన్ని ఎప్పటికప్పడు పరిశీలించాలని చెప్పారు. ధాన్యాన్ని మిల్లులకు తరలించడానికి ఆవసరమైన వాహనాలు సంఖ్య పెంచాలన్నారు. మిల్లులు, కొనుగోలు కేంద్రాల వద్ద హమాలీల కొరత లేకుండా చర్యలు చేపట్టాలన్నారు. రైతులు ఇబ్బంది పడకుండా ధాన్యం కొనుగోలు చేసిన వెంటనే డబ్బు చెల్లించేలా చూడాలని ఆదేశించారు.
ధాన్యం తరలింపు
వేగవంతం
ఖమ్మం సహకారనగర్ : జిల్లాలోని వివిధ మండలాల్లో రైతుల నుంచి కొనుగోలు చేసిన ధాన్యాన్ని మిల్లులకు తక్షణమే తరలిస్తున్నట్లు జిల్లా పౌరసరఫరాల శాఖాధికారి చందన్కుమార్ తెలిపారు. నేలకొండపల్లి, ముదిగొండ, కూసుమంచి, కొణిజర్ల, సత్తుపల్లి, వైరా, తల్లాడ తదితర ప్రాంతాల నుంచి లారీల ద్వారా హన్మకొండ జిల్లా పంపించామని వివరించారు. జిల్లాలో ఇప్పటి వరకు 1.11లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించగా, 21వేల మెట్రిక్ టన్నులు హన్మకొండ జిల్లాలోని మిల్లులకు తరలించామని తెలిపారు. వర్షాలు కురుస్తున్నందున కొనుగోలు కేంద్రాల ఇన్చార్జ్లు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.
నెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఖమ్మం స్పోర్ట్స్ : జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఆధ్వార్యాన ఆదివారం ఖమ్మం రూరల్ మండలం పెద్ద వెంకటగిరి జెడ్పీ హైస్కూల్లో ఉమ్మడి జిల్లా స్థాయి నెట్బాల్ బాలబాలికల సబ్ జూనియర్ జట్లను ఎంపిక చేశారు. జిల్లా వ్యాప్తంగా 30మంది బాలురు, 28మంది బాలికలు ఎంపికలకు హాజరయ్యారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 15 నుంచి 17వ తేదీ వరకు జనగామలో జరిగే రాష్ట్రస్థాయి సబ్ జూని యర్ నెట్బాల్ చాంపియన్షిప్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు. బాలబాలికల జట్టుకు 24 మంది చొప్పున ఎంపిక చేశామని వెల్లడించారు. కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎ.నాగేశ్వరరావు, స్కూల్ చైర్ పర్సన్ శ్రీదేవి, జిల్లా నెట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు దీప్తి, కార్యదర్శి ఎన్.ఫణికుమార్, పీడీ పి.వి.వెంకటరమణ పాల్గొన్నారు.
ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి
ఖమ్మంమయూరిసెంటర్ : ఆపరేషన్ కగార్ను వెంటనే నిలిపివేయాలని, మావోయిస్టుల పేరున ఆదివాసీలపై జరుపుతున్న దాడులను ఆపాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యులు తమ్మినేని వీరభద్రం కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. స్థానిక సుందరయ్య భవనంలో ఆదివారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గతేడాది కాలంగా మావోయిస్టులను అంతం చేస్తామంటున్న కేంద్రం.. వివిధ ఆపరేషన్ల పేరుతో ఆదివాసీలపై దాడులు చేస్తోందని విమర్శించారు. శాంతి చర్చలకు సిద్ధమంటూ మావోయిస్టుల నుంచి రెండుసార్లు ప్రతిపాదనలు వచ్చినా పట్టించుకోకుండా అణచివేత చర్యలకు పాల్పడటం దారుణమని అన్నారు. మేధావులు, పౌరహక్కుల నేతలు మధ్యవర్తులుగా వ్యవహరిస్తామని చెప్పినా కేంద్ర ప్రభుత్వం స్పందించకపోవడం సరైంది కాదన్నారు. అడవుల్లో ఉన్న సహజ వనరులు, విలువైన ఖనిజాలను కార్పొరేట్ శక్తులకు కట్టబెట్టేందుకే ఆపరేషన్ కగార్ను ఎంచుకుందని ఆరోపించారు. సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శి నున్నా నాగేశ్వరరావు, నాయకులు బి.రమేష్, మాదినేని రమేష్, ఎం.సుబ్బారావు, మెరుగు సత్యనారాయణ, షేక్ బషీరుద్దీన్, పిన్నింటి రమ్య పాల్గొన్నారు.

తేమ శాతం రాగానే కొనుగోలు చేయాలి