
సెడార్ వ్యాలీ పాఠశాలలో వైమానిక శిక్షణ
రఘునాథపాలెం: మండలంలోని వీవీపాలెంలో ఉన్న సెడార్ వ్యాలీ ఇంటర్నేషనల్ పాఠశాలలో ఆదివారం స్పేస్ జెన్ సంస్థతో కలిసి వైమానిక శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. హార్వెస్ట్ విద్యాసంస్థలకు చెందిన సుమారు 100 మంది విద్యార్థులు ఈ శిక్షణలో పాల్గొన్నట్లు పాఠశాల ప్రిన్సిపాల్ తెలిపారు. కాక్పిట్, సిమ్యులేటర్ ద్వారా విద్యార్థులు విమానం టేకాఫ్, లాండింగ్, ఫ్లయింగ్ విభాగాల్లో శిక్షణ పొందారు. శిక్షణ అనంతరం విద్యార్థులకు కరస్పాండెంట్ రవిమారుత్, అకడమిక్ అడ్వయిజర్లు పార్వతీరెడ్డి, ఉదయశ్రీ ధ్రువపత్రాలు అందించారు.
ప్రజా సమస్యలను
పార్లమెంట్లో వినిపిస్తున్నా..
ఎంపీ రామసహాయం రంఘురాంరెడ్డి
ఖమ్మంవన్టౌన్: తన పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రజా సమస్యలను పార్లమెంట్లో వినిపిస్తూ, వాటి పరిష్కారం దిశగా పనిచేస్తున్నానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడారు. తమది తొలి నుంచి ప్రజలతో ముడిపడిన జీవితమని, మున్నేరు వరదలప్పుడు సైతం అనేక కాలనీల్లో సహాయక చర్యల్లో పాల్గొని, నిత్యావసరాలు పంపిణీ చేశానన్నారు. జిల్లా అభివృద్ధే లక్ష్యంగా జాతీయ రహదారులు, సర్వీస్రోడ్లు, అండర్పాస్ల రూపకల్పనకు కృషిచేశానని, కొత్తగూడెం ఎయిర్పోర్ట్ అంశాన్ని గత ప్రభుత్వం నిర్లక్ష్యం చేసిందని, తాను తిరిగి ఫైల్ తెరిపించి విమానయాన శాఖ అధికారులను సర్వేకు పిలిచానని పేర్కొన్నారు. పాలేరులో ప్రత్యామ్నాయ రైల్వే రూట్, పులిగుండాల ఎకో టూరిజం పార్క్, జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలపై తాను గళం విప్పానని స్పష్టం చేశారు.
ధాన్యం కొనుగోళ్లు
చేపట్టాలని ఆందోళన
కూసుమంచి: అకాల వర్షాలు వస్తున్నందున ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని, కాంటాలు వేసిన ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని డిమాండ్ చేస్తూ ఆదివారం పాలేరులో రైతులు ఖమ్మం – సూర్యాపేట రహదారిపై రాస్తారోకో చేపట్టారు. విషయం తెలుసుకున్న అధికారులు అక్కడకు చేరుకుని రైతులతో మాట్లాడారు. ఎస్ఐ నాగరాజు అప్పటికప్పుడు జాతీయ రహదారిపై వెళ్తున్న లారీలను ఆపి కొనుగోలు కేంద్రానికి తరలించారు. గన్నీ బ్యాగులను కూడా తీసుకొచ్చి కాంటాలు వేయటంతో పాటు ధాన్యాన్ని లారీల్లో తరలించటంతో రైతులు ఆందోళన విరమించారు.
డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడిన లారీ
రఘునాథపాలెం: ఖమ్మం నుంచి రాజమండ్రికి వెళ్తున్న లారీ ఆదివారం ఉదయం మండలంలోని వీవీపాలెం సమీపంలో డివైడర్ను ఢీకొట్టి రోడ్డుపై పడింది. ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాలేదని తెలిసింది. రఘునాథపాలెం సీఐ ఉస్మాన్ షరీఫ్ ఘటనా ప్రాంతానికి చేరుకుని లారీని పక్కకు తరలించి, ట్రాఫిక్ను పునరుద్ధరించారు.
కేసు నమోదు
బోనకల్: ప్రభుత్వ పాఠశాలలో జూదం ఆడుతున్న వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పొదిలి వెంకన్న తెలిపారు. మండలంలోని ఆళ్లపాడు పాఠశాలలో కొన్ని రోజులుగా కొందరు జూదం ఆడుతున్నట్లు సమాచారం అందగా ఎస్ఐ అక్కడికి చేరుకుని, ఆరుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ.2,700 స్వాధీనం చేసుకొని, కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.
కిన్నెరసానిలో జలవిహారం
పాల్వంచరూరల్: కిన్నెరసానిలో ఆదివారం పర్యాటకులు సందడి చేశారు. వివిధ ప్రాంతాల నుంచి సందర్శకులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. డ్యామ్పైనుంచి జలాశయాన్ని, డీర్ పార్కులోని దుప్పులను వీక్షించారు. రిజర్వాయర్లో జలవిహారం చేశారు. 535 మంది పర్యాటకులు కిన్నెరసానిలో ప్రవేశించగా వైల్డ్లైఫ్ శాఖ రూ.29,600 ఆదాయం లభించగా, 200 మంది బోటు షికారు చేయగా టూరిజం కార్పొరేషన్ సంస్థకు రూ.10,400 ఆదాయం లభించినట్లు నిర్వాహకులు తెలిపారు.

సెడార్ వ్యాలీ పాఠశాలలో వైమానిక శిక్షణ

సెడార్ వ్యాలీ పాఠశాలలో వైమానిక శిక్షణ

సెడార్ వ్యాలీ పాఠశాలలో వైమానిక శిక్షణ