
వర్షం.. అన్నదాతలకు నష్టం
కూసుమంచి/తిరుమలాయపాలెం/నేలకొండపల్లి/ఖమ్మం అర్బన్/వైరా రూరల్: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం అర్ధరాత్రి కురిసిన వర్షంతో రైతులకు నష్టం ఎదురైంది. బుధవారం రాత్రి, గురువారం ఉదయం కూడా వర్షం కురవగా, కల్లాలు, కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం తడిసి ముద్దయింది. పలుచోట్ల బొప్పాయి తదితర తోటలకు నష్టం ఎదురైంది. గురువారం అర్ధరాత్రి కూడా వర్షం కురవడంతో మరోమారు రైతుల నెత్తిన పిడుగు పడినట్లయింది. కూసుమంచి మండలంలోని పలుచోట్ల ధాన్యం తడిసి ముద్దవగా.. చేగొమ్మ పీఏసీఎస్ కొనుగోలు కేంద్రంలో ధాన్యం కొట్టుకుపోయింది. నేలకొండపల్లి మండలం నేలకొండపల్లి, పైనంపల్లి, ముజ్జుగూడెం, సింగారెడ్డిపాలెం తదితర గ్రామాల్లోనూ కాంటా వేసిన ధాన్యం తడిసింది. తిరుమలాయపాలెం మండలంలోని పలు గ్రామాల్లో ధాన్యం, మిర్చి పంటలపై టార్పాలిన్ పట్టాలు గాలికి ఎగిరిపోవడంతో పంటలు తడిసాయి. కాగా, ఖమ్మం ఏడో డివిజన్ టేకులపల్లి కేసీఆర్ టవర్స్ సమీపాన రాంబాబు కిరాణం షాపుపై పిడుగు పడింది. దీంతో కొంత సామగ్రి దెబ్బతినగా, ఇంట్లో ఉన్నవారు ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నారు. అలాగే, పలు మండలాల్లో గాలిదుమారానికి ఇళ్లపై రేకులు కొట్టుకుపోగా, చెట్లు, విద్యుత్ స్తంభాలు విరిగిపడ్డాయి. ఈమేరకు విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో సిబ్బంది రాత్రంతా శ్రమించి పునరుద్ధరించారు. ఇక కొన్నిచోట్ల చెట్లు కూలి రహదారులపై పడడంతో రాకపోకలు నిలిచిపోయాయి.

వర్షం.. అన్నదాతలకు నష్టం

వర్షం.. అన్నదాతలకు నష్టం

వర్షం.. అన్నదాతలకు నష్టం