బాధ్యతలు స్వీకరించిన బార్‌ అసోసియేషన్‌ | - | Sakshi
Sakshi News home page

బాధ్యతలు స్వీకరించిన బార్‌ అసోసియేషన్‌

Apr 2 2025 12:45 AM | Updated on Apr 3 2025 1:43 PM

ఖమ్మం లీగల్‌: ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన బార్‌ అసోసియేషన్‌ నూతన కార్యవర్గం మంగళవారం బాధ్యతలు స్వీకరించింది. అధ్యక్షుడిగా తొండపు వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షురాలిగా మోత్కూరి విజయశాంత, కార్యదర్శిగా గద్దల దిలీప్‌కుమార్‌, సంయుక్త కార్యదర్శిగా ఎం.నవీన్‌ కుమార్‌తో పాటు ఎస్‌. రాంబాబు, కే.వీ.వీ.లక్ష్మి, పి.నర్సింహారావు, పి.ఇందిర ప్రమాణం చేశారు. అనంతరం అధ్యక్ష, కార్యదర్శులు వెంకటేశ్వరరావు, దిలీప్‌కుమార్‌ మాట్లాడుతూ కోర్టు ప్రాంగణంలో జరిగే అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనడమే కాక, న్యాయవాద సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని, బార్‌ – బెంచ్‌ మధ్య మంచి సంబంధాలు కొనసాగిస్తామని వెల్లడించారు.

హెచ్‌సీయూ భూముల స్వాధీనం నిలిపివేయాలి

ఖమ్మంమయూరిసెంటర్‌: దశాబ్దాలుగా హైదరాబాద్‌ సెంట్రల్‌ యూనివర్సిటీ ఆధీనంలో ఉన్న భూముల స్వాధీనాన్ని నిలిపివేయాలని సీపీఐ(ఎంఎల్‌) మాస్‌లైన్‌ రాష్ట్ర కార్యదర్శి పోటు రంగారావు ఒక ప్రకటనలో డిమాండ్‌ చేశారు. అనేక రకాల వృక్షాలు, జంతువులతో పర్యావరణానికి నిలయంగా ఉన్న 400 ఎకరాల భూములను అమ్మేలా రాష్ట్రప్రభుత్వం స్వాధీనానికి యత్నించడం సరికాదని పేర్కొన్నారు. అంతేకాక భూములు కాపాడేందుకు నిరసన తెలుపుతున్న విద్యార్థులపై దౌర్జన్యం చేయడం, లాఠీచార్జ్‌ చేసి కేసులు పెట్టడం నిరంకుశత్వానికి నిదర్శనమని పేర్కొన్నారు. భూములను యూనివర్సిటీ ఆధీనంలో ఉంచడమే కాక అక్రమ అరెస్టులు ఆపాలని రంగారావు డిమాండ్‌ చేశారు.

బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా విజయ్‌సారధి

ఖమ్మం స్పోర్ట్స్‌: బాస్కెట్‌బాల్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడిగా కొనసాగుతున్న ఏసీపీ విజయ్‌ సారధికి కార్యవర్గంలో స్థానం దక్కింది. హైదరాబాద్‌లో మంగళవారం జరిగిన సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకోగా ఆయన రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. జాతీయస్థాయిలో గుర్తింపు కలిగిన క్రీడాకారుడైన ఆయన పోలీస్‌ శాఖలో ఏసీపీగా కొనసాగుతున్నారు.

ఇసుక లారీలు సీజ్‌

తల్లాడ: అనుమతి లేకుండా ఏపీలోని నంది గామ నుంచి తల్లాడ మండలం మిట్టపల్లి వైపు ఇసుక తీసుకొస్తున్న రెండు లారీలను పోలీసులు సీజ్‌ చేశారు. సోమవారం అర్ధరాత్రి సీజ్‌ చేయగా, మంగళవారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై కొండల్‌రావు తెలిపారు.

చోరీ కేసుల్లో ఒకరి అరెస్ట్‌

ఖమ్మంక్రైం: జల్సాలకు అలవాటు పడి ఇళ్లలో, బైక్‌లు చోరీ చేస్తున్న వ్యక్తిని ఖమ్మం వన్‌టౌన్‌ పోలీసులు మంగళవారం అరెస్ట్‌ చేశారు. సీఐ ఉదయ్‌కుమార్‌ కథనం ప్రకారం.. భద్రాచలానికి చెందిన కోడి శేఖర్‌ అలియాస్‌ జంపన్న మరో వ్యక్తితో కలిసి చోరీలకు పాల్పడుతున్నాడు. దీంతో నిఘా పెట్టిన పోలీసులకు పంచాక్షరి కాలనీలో ఉన్నట్లు సమాచారం అందగా శేఖర్‌ను అరెస్ట్‌ చేసి నాలుగు బైకులు, 10 గ్రాముల బంగారం స్వాధీనం చేసుకున్నామని, మరో నిందితుడు పారిపోయాడని సీఐ తెలిపారు. కీలకంగా వ్యవహరించిన కానిస్టేబు ళ్లు హరికృష్ణ, బోరయ్యను సీపీ సునీల్‌దత్‌, ఏసీపీ రమణమూర్తి అభినందించారు.

కానిస్టేబుల్‌ ఆత్మహత్య

ఖమ్మంక్రైం: మూడు రోజులుగా సెలవులో ఉన్న ఓ కానిస్టేబుల్‌ బలవన్మరణానికి పాల్ప డ్డాడు. ఖమ్మంలో మంగళవారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటన వివరాలు... నేలకొండపల్లిలో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న బండి కృష్ణ(38) మూడు రోజు లుగా సెలవులో ఉన్నాడు. ఖమ్మం ముస్తఫానగర్‌లోని ఇంటి నుంచి మంగళవారం సాయంత్రం బయటకు వెళ్లిన తిరిగి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు ఎక్కడ వెతికినా ఆచూకీ లేక సెల్‌ఫోన్‌ లొకేషన్‌ ఆధారంగా ఆరా తీస్తూ పిల్లిగుట్టల వద్దకు వెళ్లారు. 

అప్పటికే ఆయన గూడ్స్‌ రైలుకు ఎదురెళ్లి ఆత్మహత్య చేసుకున్నాడని రైల్వే పోలీసులు వెల్లడించారు. దీంతో అన్నం ఫౌండేషన్‌ చైర్మన్‌ శ్రీనివాసరావు సాయంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఖమ్మం రూరల్‌ ఏసీపీ తిరుపతిరెడ్డి, కూసుమంచి సీఐ సంజీవ్‌, నేలకొండపల్లి ఎస్‌ఐ సంతోష్‌ మృతదేహాన్ని సందర్శించగా, కృష్ణ ఆత్మహత్యకు కారణాలు తెలియరాలేదు.

బాధ్యతలు స్వీకరించిన బార్‌ అసోసియేషన్‌1
1/1

బాధ్యతలు స్వీకరించిన బార్‌ అసోసియేషన్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement