
పాస్టర్ మృతికి నిరసనగా ర్యాలీ
ఖమ్మంగాంధీచౌక్: పాస్టర్ ప్రవీణ్ పగడాల మృతిపై క్రైస్తవుల ఫెలోషిప్ల ఆధ్వర్యంలో ఆదివారం ఖమ్మం నగరంలో శాంతియుత ర్యాలీ నిర్వహించారు. ప్రవీణ్ మృతిపై అనుమానాలున్నాయని, తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, హోంహత్రుంలు, పోలీస్ శాఖ అధికారులు ప్రవీణ్ మృతిపై సమగ్ర విచారణ జరిపాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో క్రైస్తవ సంఘాల ప్రతినిధులు జకర్యా హన్మంతరావు, చల్లగుండ్ల రమేశ్బాబు, ఆనంద్, విజయ్కుమార్, డేవిడ్, శేఖర్బాబు, తిమోతి, వేముల సత్యం, నెలాల బాలస్వామి, కృష్ణమోహన్, సంజీవరావు, పీటర్, చిన్న డేవిడ్, రవికిరణ్, జ్యోతి సుశీల, సేవకులు సైమన్, రాము, అభిషేక్, అశోక్ యోహాను, కిశోర్, పాల్, మోషే, సామేల్, నెహేమ్యా, బాలస్వామి తదితరులు పాల్గొన్నారు.
ద్విచక్రవాహనాన్ని
ఢీకొన్న లారీ
● ఒకరికి గాయాలు
సత్తుపల్లిరూరల్: ద్విచక్రవాహనాన్ని లారీ ఢీ కొనడంతో ఓ వ్యక్తికి తీవ్ర గాయాలైన ఘటన సత్తుపల్లి మండలం గంగారంలో ఆదివారం చోటుచేసుకుంది. గంగారానికి చెందిన కోటయ్య టీవీఎస్ ఎక్స్ఎల్పై వెళ్తుండగా అశ్వారావుపేట నుంచి ఖమ్మం వైపు వెళ్తున్న ట్రాలీ లారీ ఢీకొట్టింది. కోటయ్య కాలుకు తీవ్ర గాయాలు కావడంతో 108 ద్వారా సత్తుపల్లి ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
బైక్ ఢీకొని వ్యక్తికి గాయాలు
నేలకొండపల్లి: వాకింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా గుర్తు తెలియని యువకులు బైక్తో ఢీకొట్టడంతో ఓ వృద్ధుడికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంబడించగా వారు పరారయ్యారు. మండల కేంద్రానికి చెందిన ఆర్మీ రిటైర్డ్ ఉద్యోగి డి.రామారావు ఆదివారం వాకింగ్కు వెళ్లి తిరిగి వస్తుండగా కూసుమంచి – నేలకొండపల్లి రహదారిపై గుర్తు తెలియని యువకులు బైక్పై వస్తూ.. అక్కడ ఆరబెట్టిన మొక్కజొన్నల మీదుగా వెళ్లి బైక్ అదుపుతప్పి వెనుక నుంచి వచ్చి రామారావును ఢీకొట్టారు. తీవ్రంగా గాయపడిన ఆయన్ను ఖమ్మం ఆస్పత్రికి తరలించారు. కాగా, యువకులను స్థానికులు, పోలీసులు వెంబడించినా ఆచూకీ లభించలేదు.
గుర్తు తెలియని
మృతదేహం లభ్యం
పెనుబల్లి: మండలంలోని పాతకారాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం ఆదివారం లభ్యమైంది. పోలీసుల కథనం ప్రకారం.. పాతకారాయిగూడెం ఎన్ఎస్పీ కాల్వలో గుర్తు తెలియని మృతదేహం కొట్టుకొచ్చింది. గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా.. కుడి చేతిపై ఆంజనేయ స్వామి పచ్చబొట్టు ఉన్నట్టుగా గుర్తించారు. ఘటనపై కేసు నమోదు చేసి, విచారణ చేయనున్నామని పోలీసులు తెలిపారు.
రోడ్డు ప్రమాదంలో
కండక్టర్ మృతి
పెనుబల్లి: సత్తుపల్లి మండలంలోని కొత్తలంకపల్లి శివారులో రోడ్డుపై ఆగి ఉన్న లారీ ట్యాంకర్ను ఆర్టీసీ బస్సు వెనుక నుంచి బలంగా ఢీకొట్టిన ఘటనలో ఒకరు మృతి చెందగా, మరో ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసుల కథనం ప్రకారం.. కల్లూరుకు చెందిన వన్నపురపు సీతారాంప్రసాద్ (45) సత్తుపల్లి ఆర్టీసీ డిపోలో కండక్టర్గా పనిచేస్తున్నాడు. ఆదివారం తెల్లవారుజామున విధులు పూర్తయిన సొంత ఊరికి వెళ్లడానికి, వైజాగ్ నుంచి ఖమ్మం వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఎక్కాడు. ఈ క్రమంలో బస్సు కొత్తలంకపల్లి శివారుకు చేరుకోగా, జాతీయ రహదారిపై ఆగి ఉన్న ట్యాంకర్ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సు ఎడమ పక్కన భాగం అంతా ధ్వంసం కాగా కండక్టర్ సీతారాంప్రసాద్తో పాటు మగ్గురికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 దారా పెనుబల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తీవ్రంగా గాయపడిన కండక్టర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఉదయ్ను మెరుగైన వైద్యం కోసం ఖమ్మం తరలించగా మరో ఇద్దరిని సత్తుపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. మృతుడికి భార్యతో పాటుగా కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఉగాది పండుగను సంతోషంగా జరుపుకోవాల్సిన కుటుంబంలో ఒక్కసారిగా విషాదఛాయలు అలుముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేయనున్నారు.

పాస్టర్ మృతికి నిరసనగా ర్యాలీ