ఖమ్మంమయూరిసెంటర్: ఆర్టీసీ సంస్థ పరిరక్షణ, కార్మికుల సంక్షేమమే లక్ష్యంగా సమ్మెకు సిద్ధమవుతున్నట్లు ఆర్టీసీ జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు వెల్లడించారు. సంస్థ పరిధిలోని కార్మికుల సమస్యలను పరిష్కరించేలా ప్రభుత్వం ఆలోచన చేయకపోవడం, హామీల అమలులోనూ విఫలమైందని ఆరోపించారు. ఈమేరకు జేఏసీ ఖమ్మం రీజియన్ కమిటీ సమావేశం ఖమ్మంలోని గిరిప్రసాద్ భవన్లో శుక్రవారం నిర్వహించారు. అనంతరం జేఏసీ చైర్మన్ వెంకన్న మాట్లాడుతూ కార్మికులను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి ప్రభుత్వ ఉద్యోగులతో సమాన వేతనాలు చెల్లిస్తామన్నా హామీ నెరవేరలేదన్నారు. అంతేకాక ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతూ సంస్థ ప్రైవేటీకరణకు యత్నిస్తున్నారని ఆరోపించారు. సీసీఎస్ బకాయిలు రూ.900 కోట్లు, పీఎఫ్ బకాయిలు రూ.1,250 కోట్లతో పాటు పెండింగ్ ఉన్న డీఏలను విడుదల చేయడమే కాక ఇతర సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈమేరకు ఏప్రిల్ 1న డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లడంతో కార్మికుల సమక్షంలోనే సమ్మె తేదీని ప్రకటిస్తామన్నారు. ఈసమావేశంలో జేఏసీ నాయకులు కే.ఎస్.పాల్, యాదయ్య, సుద్దాల సురేష్, పాటి అప్పారావు, నామ వీరభద్రం, పిల్లి రమేష్, జీ.ఎస్.రావు, యాదగిరి, జి.నారాయణ, ఎల్ఆర్కే.రావు, అరుణ, వై.నాగరాజు తదితరులు పాల్గొన్నారు.