ఖమ్మంలీగల్: ఖమ్మం బార్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునేందుకు గురువారం పోలింగ్ నిర్వహించనున్నారు. మొత్తం 816 మంది న్యాయవాదులు ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఇందుకోసం జిల్లా కోర్టులోని బార్ అసోసియేషన్ హాల్లో పోలింగ్కు ఏర్పాట్లు చేశారు. గురువారం ఉదయం 10 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పోలింగ్ నిర్వహించి, ఆ వెంటనే ఓట్లు లెక్కించి ఫలితాలు వెల్లడిస్తామని ఎన్నికల అధికారులు తెలిపారు. కాగా, ఓటర్లు తమ గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. ఎన్నికల బరిలో ఉన్న అభ్యర్థులు హోరాహోరీగా ప్రచారం నిర్వహిస్తున్నారు. అధ్యక్ష పదవికి సుగ్గల వెంకటేశ్వరరావుగుప్తా, తొండపు వెంకటేశ్వరరావు, అయ్యదేవర విజయరాఘవ నడుమ త్రిముఖ పోటీ నెలకొంది. ఇక ఉపాధ్యక్ష పదవికి ఎస్కే జానీమియా, మల్లెం రవిప్రసాద్, మోతుకూరి విజయశాంతి, ప్రధాన కార్యదర్శి పదవికి గద్దల దిలీప్కుమార్, తెల్లాకుల రమేశ్బాబు, గ్రంథాలయ కార్యదర్శి పదవికి దేవరకొండ కల్యాణి, సింగారపు రాంబాబు, క్రీడా కార్యదర్శి పదవికి కేవీవీ లక్ష్మి, ధరావత్ రాందాస్నాయక్ పోటీపడుతున్నారు.
ఓసీ, సీహెచ్పీల్లో సింగరేణి డైరెక్టర్ తనిఖీ
సత్తుపల్లిరూరల్: సత్తుపల్లి మండలం కిష్టారంలోని ఓసీ, జేవీఆర్ సీహెచ్పీలను సింగరేణి డైరెక్టర్ (ప్రాజెక్టు, ప్లానింగ్) కొప్పుల వెంకటేశ్వర్లు బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఓసీల్లో పని స్థలాలను పరిశీలించిన ఆయన బ్లాస్టింగ్ సమయాన దుమ్ము, ధూళి అరికట్టే చర్యలపై ఆరా తీశారు. అనంతరం సీహెచ్పీ, సైలో బంకర్ చుట్టూ బ్యారియర్ ఎత్తు పెంచాలని, మొక్కలు నాటాలని సూచించారు. ఆ తర్వాత జీఎం కార్యాలయంలో కొత్తగూడెం ఏరియా జనరల్ మేనేజర్ షాలెంరాజు తదితరులతో సమావేశమై వివిధ అంశాలపై డైరెక్టర్ సమీక్షించారు. పీఓలు ఎం.నర్సింహారావు, ప్రహ్లాద్, సీహెచ్పీ ఇన్చార్జ్ సోమశేఖర్, వివిధ విభాగాల అధికారులు కోటిరెడ్డి, సత్యనారాయణ, రామకృష్ణ, గోపీకిషోర్, బాబు, డి.శ్రీనివాస్, విజయ్సందీప్ అధికారులు పాల్గొన్నారు.
ఓసీలో అత్యధిక ఉత్పత్తి
సత్తుపల్లి మండలం కిష్టారం ఓసీలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి గాను ఈ నెల 24న 12,814,660 టన్నుల బొగ్గు ఉత్పత్తితో రికార్డు నమోదైందని పీఓ ఎం.వీ.నర్సింహారావు తెలిపారు.బుధవారం జీఎం షాలెంరాజు అత్యధిక బొగ్గు ఉత్పత్తి సాధించడానికి కారకులైన ఉద్యోగులు, కార్మికులను అభినందించారు. కిష్టారం పీఓ నర్సింహారావు, మేనేజర్ రామకృష్ణ, ఇంజనీర్ మాధవరావు, రక్షణ అధికారి గోపికిషోర్తో పాటు భరణి, ఆఫ్రోజ్, సందీప్ ఉద్యోగులు పాల్గొన్నారు.
కొత్త పార్ట్ ఇవ్వండి లేదా పరిహారం చెల్లించండి
ఖమ్మంలీగల్: సాగులో ఉపయోగానికి కొనుగోలు చేసిన పరికరం పనిచేయక నష్టపోయినట్లు ఓ రైతు ఖమ్మంలోని జిల్లా వినియోగదారుల ఫోరంను ఆశ్రయించగా.. కొత్తది ఇవ్వాలని, లేనిపక్షంలో పరిహారం చెల్లించాలంటూ ఫోరమ్ మెంబర్లు వి.మాధవీలత, వి.లలిత బుధవారం తీర్పు వెలువరించారు. తల్లాడ మండలం పాత మిట్టపల్లికి చెందిన రైతు మువ్వా కృష్ణార్జునరావు పొలానికి పురుగుల మందు పిచికారీ కోసం ట్రాక్టర్కు బిగించేలా 2024 జులై 1న 500 లీటర్ల ట్యాంక్ను రూ.70 వేలకు కొనుగోలు చేశాడు. ఉమ్మడి మహబూబ్నగర్ జిల్లా కల్వకుర్తి తిలక్నగర్లోని సిగ్నటరీ ఎస్ఎన్కే కంపెనీ డీలర్ వద్ద దీన్ని కొనుగోలు చేయగా, సరిగా పనిచేయకపోవడంతో కంపెనీ బాధ్యులను సంప్రదిస్తే మరమ్మతు చేయించారు. అయినా ఫలితం లేక తాను నష్టపోయాయనని న్యాయవాదులు మువ్వా నాగేశ్వరరావు, తెల్లాకుల రమేశ్బాబు ద్వారా రైతు ఖమ్మం వినియోగదారుల ఫోరంలో కేసు దాఖలు చేశాడు. ఇరుపక్షాల వాదనలు విన్న అనంతరం రైతుకు కొత్త ట్యాంక్ ఇవ్వాలని, లేనిపక్షంలో దాని ఖరీదు రూ.70 వేలను ఏడు శాతం వడ్డీతో సహా చెల్లించడమే కాక ఖర్చుల కింద రూ.10 వేలు, నష్టపరిహారం రూ.10 వేలు చెల్లించాలని తీర్పు ఇచ్చారు.
రెండు ఇసుక ట్రాక్టర్లు సీజ్
చింతకాని: మండలంలోని చిన్నమండవ మున్నేరు నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను పోలీసులు బుధవారం సీజ్ చేశారు. జగన్నాథపురం సమీపాన చేపట్టిన తనిఖీల్లో ఎలాంటి అనుమతి లేకుండా ఇసుక తరలిస్తున్న రెండు ట్రాక్టర్లను సీజ్ చేశామని ఎస్ఐ నాగుల్మీరా తెలిపారు. ఇసుక అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.