పోలీసు విధులకు ఆటంకం.. నిందితులకు జైలు
హొసపేటె: విధుల్లో ఉన్న పోలీసు అధికారిపై దాడికి యత్నించి, అవాచ్య పదజాలంతో దూషించిన నిందితులకు హొసపేటె జేఎంఎఫ్సీ కోర్టు చీఫ్ సివిల్ జడ్జి జైలు శిక్ష, జరిమానా విధించారు. హంపీ ఉత్సవాల్లో ఏఎస్ఐ షుకూర్ ట్రాఫిక్ నిబంధనలను ఉల్లంఘించిన వాహనాలను తనిఖీ చేస్తున్నారు. నిందితుడు గుడాలి రాజేష్ ఎలాంటి కారణం లేకుండా గొడవ సృష్టించాడు. అతను రోడ్డు మధ్యలో పోలీసు అధికారిని బహిరంగంగా దుర్భాషలాడి, అతని విధుల నిర్వహణకు ఆటంకం కలిగించాడు. మరో నిందితుడు యన్నప్ప అతనికి సహాయం చేశాడు. ఈ విషయంపై హొసపేటె టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితులపై కోర్టులో చార్జిషీట్ సమర్పించారు. కేసు విచారణ జరిపిన న్యాయమూర్తి ప్రశాంత్ నాగలాపుర నిందితులపై అభియోగాలు రుజువు కావడంతో వివిధ ఐపీసీ సెక్షన్ల కింద రెండేళ్ల జైలు శిక్ష, రూ.10,000 జరిమానా విధించారు. జరిమానా చెల్లించక పోతే అదనపు శిక్ష అనుభవించాలని తీర్పులో సూచించారు. అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.ప్రియాంక ప్రభుత్వం తరపున కేసును వాదించారు.
పోలీసు విధులకు ఆటంకం.. నిందితులకు జైలు


