మరో 2 రోజుల్లో రిటైరు కానుండగా.. కోట్లాది సంపాదన | - | Sakshi
Sakshi News home page

పెద్దమొత్తంలో నగదు, నగలు, ఆస్తుల గుర్తింపు

Jun 25 2025 1:19 AM | Updated on Jun 25 2025 9:20 AM

-

8 మంది అధికారులకు లోకాయుక్త షాక్‌

ఇళ్లు, ఆఫీసుల్లో దాడులు

 

బనశంకరి : పెద్ద బంగ్లాల మాదిరి ఇళ్లు, కళ్లు చెదిరే వస్తు సామగ్రి, ఖరీదైన జీవన విధానం.. ఇదీ కొందరు అధికారుల తీరు. అక్రమంగా ఆదాయానికి మించి ఆస్తులను కూడబెట్టిన 8 మంది ప్రభుత్వ అధికారులకు లోకాయుక్త షాక్‌ ఇచ్చింది. మంగళవారం వేకువ నుంచే ఆకస్మిక దాడులను నిర్వహించారు. శివమొగ్గ సేంద్రియ వ్యవసాయ విభాగం పరిశోధన డైరెక్టర్‌ ప్రదీప్‌, చిక్కమగళూరు నగరసభ అకౌంట్స్‌ సూపరింటెండెంట్‌ లతామణితో పాటు 8 మంది పై దాడులు జరిగాయి. భారీగా నగదుతో పాటు కోట్లాది రూపాయల విలువచేసే బంగారం, విలువైన వస్తువులు, ఇళ్లు, భూములను కనిపెట్టారు. బెంగళూరు, చిక్కమగళూరు, ధార్వాడ, శివమొగ్గ, గదగ, కలబురిగితో పాటు 12 కు పైగా జిల్లాల్లో 40 ప్రాంతాల్లో సోదాలు జరిపారు.

బాత్‌రూంలో దాక్కున్న సీఐ

గదగ్‌ పట్టణ సీఐ ధృవరాజ్‌ అయితే బయపడి ఇంటి బాత్‌రూమ్‌ దాక్కున్నారు. వదిలిపెట్టని లోకాయుక్త అధికారులు ఆయనను బయటకు రప్పించి ఇంట్లో గాలింపు నిర్వహించారు. ఈయన బాగల్‌కోటే, జమఖండిలో ఇళ్లు, అపారమైన సంపాదన చేసుకున్నట్లు ఫిర్యాదులు అందాయి. ఆయన పోలీస్‌ జీపులోనూ కొన్ని రికార్డులు లభించాయి. ఇంట్లోని నగదుతో పాటు బంగారం, విలువైన వస్తు సామగ్రిని సీజ్‌ చేశారు.

బెంగళూరు పరిధిలో

బెంగళూరు నగర శివార్లలోని ఆనేకల్‌ పట్టణ పంచాయతీ ఈఓ అమరనాథ్‌, బీబీఎంపీ అసిస్టెంట్‌ ఇంజనీర్‌ ప్రకాష్‌ ఇళ్లలో తనిఖీలు చేశారు. ప్రకాష్‌ అనేక స్థలాలు, వాణిజ్య సముదాయాలను కలిగి ఉన్నట్లు తెలిసింది. ఇంట్లో నగదు, బంగారు ఆభరణాలను పరిశీలిస్తున్నారు. రాత్రి పొద్దుపోయే వరకూ తనిఖీలు సాగాయి. బ్యాంకు ఖాతాలు, లాకర్లలోను ఇంకా పరిశీలించాల్సి ఉంది. ఆ అధికారులను అదుపులోకి తీసుకున్నారు.

మరో 2 రోజుల్లో  రిటైరు కానుండగా.. 

ధార్వాడలో మలప్రభ ప్రాజెక్టు ఇంజినీర్‌ అశోక్‌ వాల్సంద్‌, కలబుర్గి పీఆర్‌ఈ విభాగం ఈఈ మల్లికార్జున అలీపుర, సణ్ణూరు పీడీఓ రామచంద్ర ఇళ్లు, ఆఫీసులు, వారి బంధుమిత్రుల ఇళ్లలో ముమ్మరంగా తనిఖీలు చేశారు.

ఇంజినీర్‌ మల్లికార్జున కలబుర్గి, బెంగళూరులో ఇళ్లలో తనిఖీలు చేశారు. మరో రెండురోజుల్లో ఈయన రిటైరు కానుండగా సన్మానానికి ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఇంతలో లోకాయుక్త ఝలక్‌ ఇచ్చింది. ఇంట్లోని విలువైన వస్తువులను కనిపెట్టి విలువను అంచనా వేస్తున్నారు.

సణ్ణూరు గ్రామ పీడీఓ రామచంద్రకు సేడం రోడ్డులో ఉండే ఇళ్లు, విజయపురలో ఉండే ఇంట్లో గాలించారు. అనేక చోట్ల పొలాలు, ఇళ్లతో పాటు భారీ ఎత్తున ఆస్తులను కూడబెట్టినట్లు గుర్తించారు.

నిందితులు రాష్ట్రంలో అనేకచోట్ల భూములతో పాటు పలుచోట్ల వాణిజ్య వ్యవహారాలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు.

చిక్కమగళూరు నగర సభ లెక్కాధికారిణి లతామణి నివాసం, ఆఫీసుల్లో తనిఖీలు చేశారు. నగదు, బంగారంతో పాటు అనేక బ్యాంకు అకౌంట్లలో ఉన్న డిపాజిట్లను పరిశీలించారు.

లోకాయుక్త ఎస్‌పీలు ఉమేశ్‌, మంజునాథ్‌, డీఎస్పీ గీతా బేనాళ నేతృత్వంలో దాడులు నిర్వహించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement