
పరిసరాల శుభ్రతతో అతిసారకు చెక్
బళ్లారి రూరల్ : అతిసార సామాన్యమైనది కాదు గంభీరమైన వ్యాధి. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకొని ఆ వ్యాధిని నివారించాలని దావణగెరె జిల్లాధికారి గంగాధరస్వామి తెలిపారు. సోమవారం దావణగెరె నగరంలోని చిగటేరి జిల్లాసుపత్రిలో అతిసార వ్యాధి నియంత్రణ జాగృతి కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. అతిసార వ్యాధికి ముఖ్యకారణం స్వచ్ఛత లోపించడం. ఇంటి ముందు, వెలుపల పరిశుభ్రంగా ఉంచుకోవడం వల్ల అతిసార వ్యాధిని నివారించొచ్చని తెలిపారు. పిల్లలను మట్టిలోను, మురుగునీటిలో ఆడుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గ్రామాల్లో చెత్తకుండీల్లోనే చెత్తను వేయాలి. డ్రైనేజీ నీరు వీధుల్లోను, రోడ్లపై రాకుండా అధికారులు, సిబ్బంది తగు చర్యలు తీసుకోవాలని తెలిపారు. వానాకాలం అధికంగా అతిసార ప్రబలే ప్రమాదం ఉన్నందున పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని తెలిపారు. జిల్లాసుపత్రిలో రోగులకు, సంబంధీకులకు అతిసార రాకుండా జాగ్రత్తలు పాటించాలని సూచించారు. జెడ్పీ సీఈఓ గీతమాధవ విఠ్ఠల్ రావు, డీహెచ్ఓ డాక్టర్ షణ్ముకప్ప జిల్లా శస్త్ర చికిత్సాధికారి డాక్టర్ నాగేంద్రప్ప, డాక్టర్ రేణుకారాధ్య, డాక్టర్ మృత్యుంజయ తదితరులు పాల్గొన్నారు.