
తొట్టెలో ముంచి.. కూతురి హత్య
మండ్యలో ఒంటరి తల్లి దాష్టీకం
యశవంతపుర: తల్లి అంటే పిల్లలను గుండెల్లో పెట్టుకుని కాపాడుతుందని అనుకుంటారు. కొందరు తల్లుల వైఖరి ఇందుకు విరుద్ధంగా ఉంటోంది. తొట్టెలో ముంచి ఆరేళ్ల కూతుర్ని హత్య చేసిన ఘటన హాసన్ జిల్లా చన్నరాయపట్టణ తాలూకా జిన్నేనహళ్లి కొప్పలు గ్రామంలో జరిగింది. తల్లి శ్వేత (36), కూతురు సాన్వి (6)ని తమ పొలంలో తొట్టెలో ముంచి ప్రాణాలు తీసింది. వివరాలు.. ఏడేళ్ల క్రితం రఘు అనే రైతుతో శ్వేతకు పెళ్లయింది. రెండేళ్లకే గొడవలు ప్రారంభమయ్యాయి. నాలుగేళ్ల నుంచి భర్తకు దూరంగా ఉంటోంది. అనేకసార్లు బంధువులు రాజీ ప్రయత్నాలు చేసినా ఫలితం లేదు. శ్వేత విడాకులకు కోర్టులో పిటిషన్ వేసింది.
బెంగళూరు నుంచి తీసుకొచ్చి
సాన్విని బెంగళూరులో రఘు తల్లిదండ్రులు చూసుకొంటున్నారు. రెండు రోజుల క్రితం బెంగళూరు నుంచి సాన్విని శ్వేత తీసుకొచ్చింది. ఆదివారం ఉదయం ఊరిబయటకు బాలికను పిలుచుకుని వెళ్లింది. అయితే పొలానికి వెళ్లి అక్కడ నీటిలో ముంచి హత్యకు యత్నించింది. బాలిక కేకలు వేయటంతో చుట్టుపక్కల రైతులు గమనించి బయటకు తీసి ఆస్పత్రికి తరలించగా బాలిక చనిపోయింది. ఎందుకు ఇలా చేశామంటూ స్థానికులు ప్రశ్నించగా ఇద్దరం కలిసి ఆత్మహత్య చేసుకొంటున్నట్లు తల్లి చెప్పింది. రఘు వచ్చి హిరిసావె పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోస్టుమార్టం వద్ద ఇరు కుటుంబల మధ్య గొడవలు జరిగాయి. శ్వేతపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నారు.