తొక్కిసలాటలో యాదగిరి యువకుడు మృతి | - | Sakshi
Sakshi News home page

తొక్కిసలాటలో యాదగిరి యువకుడు మృతి

Jun 7 2025 1:06 AM | Updated on Jun 7 2025 1:06 AM

తొక్క

తొక్కిసలాటలో యాదగిరి యువకుడు మృతి

రాయచూరు రూరల్‌: బెంగళూరులో జరిగిన ఆర్‌సీబీ విజయోత్సవ తొక్కిసలాటలో యాదగిరికి చెందిన యువకుడు మృతి చెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. మృతుడిని యాదగిరి తాలూకా హొనగెరెకు చెందిన శివలింగ(17)గా పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు తిమ్మమ్మ, చంద్రప్పలతో కలిసి బతుకు తెరువు కోసం బెంగళూరుకు వలస వెళ్లిన శివలింగ యలహంక వద్ద సిమెంట్‌ పరిశ్రమలో విధులు నిర్వహిస్తున్నాడు. శివలింగ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. బుధవారం ఆర్‌సీబీ సంబరాల సమయంలో జరిగిన తొక్కిసలాటలో గాయపడ్డాడు. బెంగళూరు బౌరింగ్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మరణించాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదం నెలకొంది. గురువారం సాయంత్రం హొనగెరెలో అతని మృతదేహానికి అంత్యక్రియలు పూర్తి చేశారు.

మొక్కలను కన్న బిడ్డల్లా పెంచాలి

రాయచూరు రూరల్‌: మొక్కలను కన్నబిడ్డల్లా పెంచాలని శ్రీరామనగర క్యాంప్‌ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు మహంతేష్‌ పేర్కొన్నారు. ఆయన శుక్రవారం ప్రాథమిక పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి మాట్లాడారు. విద్యార్థులు తమ ఇంటి చుట్టు పక్కల మొక్కలు పెంచాలన్నారు. కన్నబిడ్డలను ఎలా పెంచుతారో అలా చెట్లను పెంచాలన్నారు.

మృతుడి కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి

హుబ్లీ: నిరంతరం తాగునీటి సరఫరాలో భాగంగా పైపులైన్లు అమరుస్తుండగా మట్టిపెళ్లలు విరిగి పడి మృతి చెందిన కార్మికుడు చేతన్‌ యాదవ్‌ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలని అసంఘటిత దళిత కార్మికుల సంఘం తహసీల్దార్‌కు విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తహసీల్దార్‌ కార్యాలయానికి వెళ్లిన సంఘం నేతలు మాట్లాడుతూ మంటూరు మెయిన్‌ రోడ్డులో ఎల్‌అండ్‌టీ రోడ్డు నిర్మాణ పనులు చేపట్టింది. అందులో భాగంగా పనులు చేస్తున్న కార్మికులకు ముందస్తు జాగ్రత్తలు తీసుకోక పోవడంతో మట్టిపెళ్లలు విరిగిపడి కార్మికుడు స్థలంలోనే మృతి చెందాడు. ఎల్‌అండ్‌టీ కంపెనీ ప్రతినిధుల నిర్లక్ష్యం వల్ల పేద కార్మికుడు ప్రాణాలు కోల్పోయాడు. తక్షణమే మృత కార్మికుని కుటుంబ సభ్యులకు రూ.25 లక్షల పరిహారధనం చెల్లించాలి. అలాగే కుటుంబ సభ్యుల్లో ఒకరికి సంస్థలో పర్మినెంట్‌ ఉద్యోగం ఇవ్వాలన్నారు. అలాగే మరో కార్మికుడు మౌలాసాబ్‌ ఆరోగ్య పరిస్థితి కూడా ఆందోళనకరంగా ఉందని, ఆ కార్మికుడు కోలుకొనేంత వరకు ఆస్పత్రి ఖర్చుతో పాటు ఇంటి ఖర్చులను కంపెనీనే భరించాలని విజ్ఞప్తి చేశారు. ఈ సందర్భంగా సంఘం నేతలు విజయ్‌ కర్రా, సతీష్‌, విశ్వనాథ్‌, విజయ్‌కుమార్‌, సలీం తదితరులు పాల్గొన్నారు.

ప్రయాణికునితో

కానిస్టేబుల్‌ గొడవ

బస్సు అద్దాన్ని పగలగొట్టిన పోలీస్‌

రాయచూరు రూరల్‌: ప్రయాణికునితో గొడవ పెట్టుకున్న కానిస్టేబుల్‌ ఆర్టీసీ బస్సు అద్దాన్ని పగలగొట్టిన ఘటన జిల్లాలోని దేవదుర్గలో చోటు చేసుకుంది. గురువారం సాయంత్రం విధులు ముగించుకొని దేవదుర్గ నుంచి రాయచూరుకు వస్తున్న కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌ బస్సులో కూర్చున్నాడు. అంబేడ్కర్‌ సర్కిల్‌ వద్ద సీట్‌లో కూర్చొన్న వృద్ధుడితో అసభ్యంగా ప్రవర్తిస్తూ గొడవకు దిగాడు. కోపంలో బస్సు నుంచి దిగి ముందు భాగంలోని అద్దంపైకి రాసి విసిరి అద్దాన్ని పగలగొట్టి ధ్వంసం చేశాడు. వృద్ధుడిని భయ పెట్టిన పోలీస్‌ కానిస్టేబుల్‌ శ్రీనివాస్‌తో సహా బస్సును డ్రైవర్‌ సురేష్‌బాబు నేరుగా పోలీస్‌ స్టేషన్‌కు పోనిచ్చాడు. అక్కడ పోలీసు అధికారులు చర్చించి ఇద్దరి మధ్య రాజీ చేసి శాంతింపచేశారు.

రోడ్ల మరమ్మతులు చేపట్టండి

హొసపేటె: వర్షాకాలం ప్రారంభమైనందున రోడ్లపై గుంతలను మూసివేసి రాకపోకలు సజావుగా సాగేలా వ్యవస్థ కల్పించాలని కూడ్లిగి ఎమ్మెల్యే డాక్టర్‌ శ్రీనివాస్‌ తెలిపారు. శుక్రవారం పట్టణంలోని ప్రజా పనుల శాఖ కార్యాలయంలో ఆ శాఖ ఇంజినీర్లతో నిర్వహించిన ప్రగతి సమీక్ష సమావేశానికి ఆయన అధ్యక్షత వహించి మాట్లాడారు. ఈ ప్రాంతంలో రోడ్ల అభివృద్ధికి రూ.కోట్లాది నిధులు కేటాయించి మంచి రోడ్లు నిర్మించారు. అయితే కొన్ని చోట్ల రోడ్లపై గుంతలు ఏర్పడి వాహనదారులకు ఇబ్బంది కలిగిస్తున్నాయి. వాటిని వెంటనే మరమ్మతులు చేయాలి. రోడ్డు పక్కన పెరుగుతున్న చెట్లను నరికి వేయాలి. దీనికి అవసరమైన నిధులు మంజూరు చేస్తామన్నారు. రోడ్డు విస్తరణ, అభివృద్ధి సమయంలో నాణ్యతను కాపాడుకోవాలని ఆయన అన్నారు. ప్రజా పనుల శాఖకు చెందిన ఎగ్జిక్యూటివ్‌ ఇంజినీర్‌ దేవదాస్‌, అసిస్టెంట్‌ ఎగ్జిక్యూటివ్‌ ఇంజనీర్‌ కే.నాగనగౌడ, అసిస్టెంట్‌ ఇంజినీర్‌, జూనియర్‌ ఇంజనీర్లు పాల్గొన్నారు.

నకిలీ జర్నలిస్టుల బెడద అరికట్టాలి

హొసపేటె: కొట్టూరు తాలూకాలో నకిలీ జర్నలిస్టుల బెడద అరికట్టాలని, నిజమైన జర్నలిస్టులకు రక్షణ, న్యాయం అందించాలని, నకిలీ లేఖ తయారీదారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేస్తూ తాలూకా వర్కింగ్‌ జర్నలిస్ట్స్‌ అసోసియేషన్‌ శనివారం తహసీల్దార్‌కు వినతి పత్రాన్ని సమర్పించింది.అసోసియేషన్‌ అధ్యక్షుడు సురేష్‌ దేవరమనె మాట్లాడుతూ నిజమైన, విధి నిర్వహణలో ఉన్న జర్నలిస్టులు నకిలీల వల్ల ఇబ్బంది పడుతున్నారు. అంతేకాకుండా జర్నలిస్టుల పేరుతో అధికారులు, ఇతరులపై దౌర్జన్యాలు జరుగుతున్నాయి. ఈనేపథ్యంలో అసోసియేషన్‌ నకిలీ జర్నలిస్టులపై చర్యలు తీసుకోవాలని తహసీల్దార్‌ను కోరింది. డబ్బు వసూలుకు సంబంధించి చాలా ప్రజా ఫిర్యాదులు వస్తున్నాయి. తాలూకా యంత్రాంగం ఈ విషయంపై దృష్టి సారించి నిజమైన జర్నలిస్టులకు సహకరించాలని అభ్యర్థించారు. సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు ఉజ్జిని రుద్రప్ప, జిల్లా కార్యదర్శి రవికుమార్‌, తాలూకా కార్యదర్శి మంజునాథ్‌, సభ్యులు గురుప్రసాద్‌, ప్రకాష్‌, హళ్లి కొట్రేష్‌, చిగటేరి కొట్రేష్‌, ఎన్‌.నాగరాజ్‌ పాల్గొన్నారు.

తొక్కిసలాటలో యాదగిరి యువకుడు మృతి   1
1/1

తొక్కిసలాటలో యాదగిరి యువకుడు మృతి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement