
రోడ్డెక్కిన ఉపాఽధి కూలీలు
సాక్షి,బళ్లారి: రెక్కాడితే కాని డొక్కాడని వ్యవసాయ కూలీలతో పనులు చేయించుకుని నెలల తరబడినా చేసిన పనికి సంబంధించిన కూలి సొమ్ము ఇవ్వకపోవడంతో వ్యవసాయ కూలీలు రోడ్డెక్కారు. బుధవారం ఏఐకేకేఎంఎస్ ఆధ్వర్యంలో జిల్లా పంచాయతీ కార్యాలయం ముందు ధర్నా చేపట్టారు. ప్రతి రోజు ఉదయం సద్ది మూట కట్టుకుని ఉపాధి హామీ పనులకు వెళ్లి పని చేసి వస్తున్నామన్నారు. కూలీ ఇవ్వకపోవడంతో తమ కుటుంబాలు ఎలా గడవాలని ప్రశ్నిస్తూ ఆందోళన చేపట్టారు. జిల్లా పంచాయతీ కార్యాలయం ద్వారా రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి లేఖలు పంపారు.
ఐదు, పది రోజుల్లో డబ్బు జమయ్యేవి
అనంతరం జరిగిన సమావేశంలో ఏఐకేకేఎంఎస్ జిల్లాధ్యక్షుడు గోవింద్, కార్యదర్శి గుర్రళ్లి రాజ మాట్లాడుతూ ప్రతి ఏటా ఉపాధి హామీ పనులు చేసిన కూలీలకు ఐదు లేదా 10 రోజుల్లో వారి ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యేవన్నారు. అయితే ఈ ఏడాది అందుకు విరుద్ధంగా జరుగుతోందన్నారు. కూలీలకు పనులు చేసిన తర్వాత డబ్బులు రాకపోతే వారు ఎలా జీవనం సాఽగించాలని ప్రశ్నించారు. ప్రభుత్వ ఉద్యోగులు వారికి జీతాలు రాకపోతే వెంటనే పైఅధికారుల దృష్టికి తీసుకెళ్లి వెంటనే వచ్చే విధంగా ప్రయత్నం చేస్తారని, అదే కూలీలకు ఎందుకు సకాలంలో చెల్లించడం లేదని ప్రశ్నించారు. కూలీల పరిస్థితి ఎవరికి చెప్పుకోవాలని మండిపడ్డారు. ఆయా కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నాయని వాపోయారు. తక్షణం కూలి సొమ్ములు విడుదల చేయాలని కోరారు. ఆందోళనలో ఏఐకేకేఎంసీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
నెలల తరబడి అందని సొమ్ము
జెడ్పీ కార్యాలయం ఎదుట ధర్నా

రోడ్డెక్కిన ఉపాఽధి కూలీలు