
భారత సైన్యం గెలవాలని మసీదుల్లో ప్రార్థనలు
శివాజీనగర: పహల్గాం దాడి నేపథ్యంలో ఆపరేషన్ సిందూర్ కార్యచరణ చేపట్టి దేశాన్ని కాపాడేందుకు నిమగ్నమైన భారతీయ సైనికులు విజయం సాధించాలని మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ సూచన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు శుక్రవారం మసీదుల్లో ప్రార్థనలు చేశారు. బెంగళూరులోని శేషాద్రిపురం మసీదులో మంత్రి ప్రత్యేక ప్రార్థనలు చేశారు.
తుమకూరు: పహల్గాంలో పర్యాటకులపై జరిగిన ఉగ్రవాదుల దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ముస్లింలు శుక్రవారం ప్రార్థించారు. ప్రస్తుతం ఉగ్రవాదుల అడ్డాలపై దాడిలో నిమగ్నమై ఉన్న భారత సైన్యం విజయాన్ని కోరుకొన్నారు. నగరంలోని మక్కా మసీదుతో సహా జిల్లాలోని మసీదుల్లో ముతవల్లీల నాయకత్వంలో ప్రత్యేక సామూహిక ప్రార్థనలు జరిగాయి. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి జమీర్ అహమ్మద్ ఖాన్ ఆదేశాల మేరకు దేశ సైన్యానికి నైతిక మద్దతును కోరుతూ యుద్ధంలో భారత సైన్యం విజయం సాధించాలని ప్రార్థించారు. మైనార్టీ నాయకుడు తాజుద్దీన్ షరీఫ్ మాట్లాడుతూ భారత దేశంలోని ముస్లింలకు భారతదేశమే మాతృభూమి అన్నారు. అందువల్ల భారత సైన్యం పాకిస్థాన్తో ప్రారంభమైన యుద్ధంలో మాత్రమే కాకుండా పహల్గాం దాడిలో మరణించిన వారి ఆత్మకు శాంతి చేకూర్చాలని, పర్యాటకులపై దాడి చేసిన ఉగ్రవాదులందరినీ నిర్మూలించాలని, ఉగ్రవాదుల గుండెల్లోఽ దడ పుట్టించాలని అన్నారు. భారతీయ సైన్యం బలిష్టంగా ఉందని, మన సైన్యానికి నైతిక బలం చేకూరాలని శుక్రవారం నమాజ్ వేళలో సామూహిక ప్రార్థనలు చేశారు. ఈ ప్రార్థనలో మౌలానా యాసిన్ సాబ్, అబ్దుల్ సుభాన్, తాజుద్దీన్ షరీఫ్, పాషా తన్వీర్, అదిబ్ అహమ్మద్, అఫ్సర్ఖాన్ ముజాహిద్, ఫారుక్ అహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.

భారత సైన్యం గెలవాలని మసీదుల్లో ప్రార్థనలు