
ఆర్టీసీ బస్సు.. మృత్యు శకటం
దొడ్డబళ్లాపురం: నెలమంగల సమీపంలో యూటర్న్ తీసుకుంటున్న ఆటోను కేఎస్ ఆర్టీసీ బస్సు ఢీకొనింది. ఈ ఘోర ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు. ఆటో డ్రైవర్ శ్రీనివాస్ (40), పుట్టమ్మ (55), వర్షిణి (13) మరణించారు. లేఖన (11), నాగరత్నమ్మ (35), వెంకటేశ్ (37) అనేవారు తీవ్రంగా గాయపడ్డారు.
ఎలా జరిగింది?
వివరాలు..శనివారం స్థానికంగా ఒకే కుటుంబానికి చెందినవారు, బంధువుల ఇంట్లో శుభకార్యం ఉండడంతో వెళ్లి, ఆటోలో తిరిగి వస్తున్నారు. నెలమంగల తాలూకా మల్లరబాణవాడి వద్ద 75వ జాతీయ రహదారి నుంచి నెలమంగల పట్టణంలోకి వెళ్లేందుకు ఆటో యూ టర్న్ తీసుకుంటోంది. ఇంతలో మృత్యు శకటంలా బెంగళూరు నుంచి హొరనాడుకు వెళ్తున్న కేఎస్ఆర్టీసీ బస్సు ఆటోను శరవేగంగా ఢీకొట్టింది. ఆటో నుజ్జునుజ్జయింది. అందులో ముగ్గురు అక్కడే దుర్మరణం చెందారు. క్షతగాత్రుల ఆర్తనాదాలతో జనం పోగై సహాయక చర్యలు చేపట్టారు. నెలమంగల ట్రాఫిక్ పోలీసులు చేరుకుని క్రేన్ సాయంతో ఆటోను రోడ్డుమీద నుంచి పక్కకు తొలగించి ట్రాఫిక్ క్లియర్ చేశారు. బస్సులో 20మందిపైగా ప్రయాణికులు ఉండగా ఎవరికీ గాయాలు కాలేదు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యంగా నడపడమే కారణమని స్థానికులు ఆరోపించారు. యూటర్న్ వద్ద కొంచెం నెమ్మదిగా వెళ్లి ఉంటే ప్రాణనష్టం జరిగేది కాదని తెలిపారు. పోలీసులు బస్సు డ్రైవర్పై కేసు నమోదు చేసుకున్నారు.
యూటర్న్ తీసుకుంటున్న ఆటోను ఢీ
ఆటోడ్రైవర్, ఇద్దరు దుర్మరణం
ముగ్గురికి తీవ్రగాయాలు
నెలమంగళ వద్ద ఘోరం