
మంటల్లో గడ్డివాము బుగ్గి
బళ్లారిటౌన్: నగరంలోని సంగనకల్లు రోడ్డులోని శృంగేరి శారదా మఠానికి వెళ్లే దారిలో బుధవారం సాయంత్రం హరీష్గౌడ అనే రైతు గేదెల కోసం నిల్వ చేసిన గడ్డివాముకు నిప్పంటుకుంది. శృంగేరి శారద మఠంలో పెళ్లి సందర్భంగా వధూవరులను తీసుకెళ్లే సమయంలో పేల్చిన టపాసు రవ్వలు గడ్డివాముపై పడటంతో నిప్పంటుకుంది. ఈ ప్రాంతంలో రెండు గడ్డివాములతో పాటు నాలుగైదు గేదెలు కూడా పశువుల శాలలో తలదాచుకుంటున్నాయి. అయితే స్థానికులంతా చేరి మంటలను ఆర్పడంతో పక్కనే ఉన్న మరో గడ్డివాము, పశువులు కూడా ప్రాణాపాయం నుంచి తప్పించుకున్నాయి. మంటలు చెలరేగగానే అగ్నిమాపక దళానికి కూడా సమాచారాన్ని అందించారు. అయితే వాహనం వచ్చే లోపు మంటలు ఆర్పే ప్రక్రియలో స్థానికులు శ్రమించారు. కాగా బాధితుడు తన స్థలంలో గడ్డివామును వేసుకున్నా కూడా తమకు రక్షణ లేకపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు.
మే 3కు నేహా హత్య
కేసు విచారణ వాయిదా
హుబ్లీ: ఏడాది క్రితం బీవీబీ కళాశాల ఆవరణలో దారుణ హత్యకు గురైన విద్యార్థిని నేహా హిరేమఠ హత్య కేసు విచారణ హుబ్లీ 1వ అదనపు జిల్లా సెషన్స్ కోర్టు మంగళవారం చేపట్టింది. న్యాయమూర్తి పరమేశ్వర్ ప్రసన్న కేసు విచారణ వేశారు. సీఐడీ, నేహా హిరేమఠ తరపున సీనియర్ న్యాయవాది మహేష్ వైద్య వాదించారు. నిందితుడు ఫయాజ్ తరపున సీనియర్ న్యాయవాది జెడ్ఆర్ ముల్లా కోర్టుకు హాజరయ్యారు. కేసు విచారణ తొలి రోజు కావడంతో న్యాయమూర్తి విచారణను మే 3కు వాయిదా వేశారు. కాగా నిందితుడు ఫయాజ్ను కూడా కోర్టులో హాజరు పరిచారు.