
నిజాయితీగా పనిచేయండి
● కొత్త ఉద్యోగులకు సీఎం సూచన
శివాజీనగర: రెవెన్యూ శాఖలో ఖాళీగా ఉన్న పాలనాధికారి ఉద్యోగాలను పూర్తిగా దశలవారీగా భర్తీ చేయనున్నట్లు సీఎం సిద్దరామయ్య తెలిపారు. మంగళవారం నగరంలో ఇటీవల ఉద్యోగ నియామకాల్లో ఎంపికై న 1000 మంది గ్రామ పరిపాలనాధికారులకు నియామక పత్రాలు అందజేశారు. అలాగే 4 వేల వీఏఓలకు ల్యాప్ట్యాప్, ఇతర ఉపకరణాలను పంపిణీ చేశారు. ఎలాంటి అవినీతికి అవకాశం కల్పించకుండా సక్రమంగా సేవలందించాలని పిలుపునిచ్చారు. త్వరలో 500 మంది పాలనాధికారుల నియామకం చేపడతామని చెప్పారు. ఉద్యోగులు జిల్లా, తాలూకా కేంద్రాల్లో ఉండకుండా ఆయా గ్రామాల్లోనే ఉండాలి. రైతులకు సులభంగా అందుబాటులో ఉండాలి అని పలు సూచనలు చేశారు. ఉద్యోగాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.
పెద్ద పులి మృత్యువాత
మైసూరు: చామరాజనగర జిల్లా గుండ్లుపేటె బండీపుర పులి అభయారణ్యంలోని ఓంకార జోన్ శ్రీకంఠపుర గుడ్డలో మగ పులి కళేబరం కనిపించింది. అటవీ శాఖ సిబ్బంది గస్తీలో ఉండగా 8–9 ఏళ్ల వయస్సుగల పులి కళేబరం చూశారు. అది చనిపోయి కనీసం 8– 10 రోజులు అయినట్లు అంచనా వేశారు. అనంతరం అటవీ సిబ్బంది వలయ అటవీ అధికారి సతీష్ దృష్టికి ఈ విషయాన్ని తెచ్చారు. పులి మృతికి ఇంకా కారణాలు తెలియరాలేదు. మరొక పులితో పోట్లాటలో మరణించిందా, లేదా ఏదైనా వ్యాధితో బాధపడుతూ చనిపోయిందా అనేది మరణోత్తర పరీక్ష ద్వారా వెలుగు చూడాల్సి ఉంది.
జూన్ 15 వరకు బైక్
ట్యాక్సీ సేవలు
బనశంకరి: ఓలా, ఉబర్, ర్యాపిడో బైక్ ట్యాక్సీసేవలను రాష్ట్రంలో జూన్ 15 వరకు పొడిగిస్తూ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఆయా సంస్థలు దాఖలు చేసిన పిటిషన్లపై మంగళవారం విచారణ చేపట్టిన న్యాయమూర్తి బీఎం.శ్యాంప్రసాద్ ధర్మాసనం ఈ మేరకు వెసులుబాటు ఇచ్చింది. సుమారు 6 లక్షలకు పైగా బైకు ట్యాక్సీల ద్వారా జీవనం సాగిస్తున్నారు, బైకు ట్యాక్సీలను రద్దు చేస్తే వారి ఉపాధి దెబ్బతింటుందని న్యాయవాదులు పేర్కొన్నారు. బైక్ ట్యాక్సీలను రద్దు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం సిద్ధమైంది. ఆటో, క్యాబ్ సంఘాలు కూడా ఇదే కోరుతున్నాయి.
మహిళను బలిగొన్నఏనుగు
యశవంతపుర: దక్షిణ కన్నడ జిల్లా బెళ్లారె సమీపంలోని కొళ్తిగడ గ్రామం సీఆర్సీ కాలనీ సమీపంలో అడవి ఏనుగు దాడిలో మహిళ బలైంది. సెల్లమ్మ (65) అనే వృద్ధురాలిని మంగళవారం ఉదయం ఏనుగు కాళ్లతో తొక్కి చంపింది. ఆమె, ఇద్దరు మహిళా కార్మికులు రబ్బర్ చెట్లకు గాట్లు వేయడానికి వెళ్లారు. ఆ సమయంలో ఏనుగు వెంటాడి తరిమింది. ఇద్దరు మహిళలు తప్పించుకోగా, సెల్లమ్మను ఏనుగు తొక్కి హతమార్చింది. బెళ్లారె పోలీసులు ఘటనా స్థలిని పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. అటవీశాఖ అధికారులు మృతురాలి కుటుంబానికి న్యాయం చేస్తామని హామీనిచ్చారు.
కట్న వేధింపులతో ఆత్మహత్య
మైసూరు: భర్త, అతని కుటుంబ సభ్యులు చేస్తున్న అదనపుకట్న వేధింపులకు విసిగి పోయిన ఓ మహిళ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈఘటన మైసూరులో జరిగింది. వివరాలు.. విద్యారణ్యపురం నివాసి వై.ప్రేరణకు బెంగళూరుకు చెందిన సు ఘోష్తో 2022లో పెళ్లయింది. వివాహ సమయంలో 250 గ్రాముల బంగారు, వెండి వస్తువులను వరకట్నంగా ఇచ్చారు. అయినా భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపుకట్నం తేవాలని ఆమెను వేధింపులకు గురి చేసేవారు. శివరాత్రి రోజున ప్రేరణతో గొడవ పడి ఆమెను ఇంటి నుంచి బయటకు గెంటారు. దీంతో ఆమె మైసూరులోని పుట్టింటికి వచ్చేసింది. ఇలా ఉండగా భర్త సుఘోష్ ఆమెకు ఫోన్ చేసి అదనపు కట్నం తేకుంటే నీవు నాకు అవసరం లేదని నిందించడంతో జీవితంపై విరక్తి చెందిన ప్రేరణ గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని ఉరి వేసుకుంది. తమ అల్లుడు, అతని కుటుంబ సభ్యుల వేధింపుల వల్లే తన కుమార్తె ఆత్మహత్య చేసుకున్నట్లు ప్రేరణ తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విద్యారణ్యపురం పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.

నిజాయితీగా పనిచేయండి