
యుగ పురుషుడు బసవణ్ణ
సాక్షి,బళ్లారి: విశ్వగురు బవసణ్ణ ఒక వ్యక్తి కాదు, ఒక శక్తి అని నిరూపించారు. మానవుడుగా పుట్టి దానవుడయ్యారు. ఆయన చిన్నప్పటి నుంచి నడిచిన దారి, పడిన కష్టాలు, చూపిన మార్గం ఆదర్శనీయమైంది. పువ్వు పుట్టగానే పరిమళిస్తుందన్న విధంగా బసవణ్ణ సామాన్యుడుగా జన్మించి, అసామాన్యుడుగా, దైవాంశ సంభూతుడుగా, కారణజన్ముడుగా కీర్తి పొంది, కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా, ప్రపంచంలోనే పేరు గడించారంటే అతిశయోక్తి కాదు. 12వ శతాబ్దంలో 1134వ సంవత్సరంలో నాటి బీజాపూర్ జిల్లా బసవన బాగేవాడిలో జన్మించిన బసవేశ్వరుడు విశ్వగురు బసవణ్ణగా కీర్తి గడించారంటే ఆయన చిన్ననాటి నుంచి చేసిన సాధనలు, పడిన కష్టాలు కోకొల్లలు. సాక్షాత్తు శివస్వరూపుడుగా భావిస్తున్న బసవణ్ణ కర్ణాటకలోని మాదలాంబిక, మాదిరాజు అనే బ్రాహ్మణ దంపతులకు జన్మించారు. ఆయన బ్రాహ్మణ కులంలో జన్మించడంతో చిన్నప్పుడే ఉపనయనం చేసేందుకు తల్లిదండ్రులు సిద్ధపడటంతో ఆయన ఉపనయనాన్ని వ్యతిరేకించి ఇల్లు విడిచి వెళ్లిపోయారు. 8వ ఏటనే తల్లిదండ్రులకు దూరంగా వెళ్లి జీవించడం ప్రారంభించారు.
కుల, మత బేధాలు పారదోలారు
కర్ణాటక చరిత్రలోనే కాకుండా యావత్ భారత దేశ చరిత్రలోనే 12 శతాబ్దం సువర్ణాక్షరాలతో లిఖించదగిన కాలం. ఎందుకంటే అలనాడు కుల, మతాలు, వర్ణ వ్యవస్థలు, లింగభేదాలతో సమాజం అతలాకుతలమవుతున్న రోజుల్లో ధార్మిక, సామాజిక, ఆర్థిక, రాజకీయ విప్లవాలకు ఎదురొడ్డి నిలిచి సమసమాజ స్థాపన కోసం పాటుపడిన మహా యుగపురుషుడు విశ్వగురు బసవణ్ణ. కుల, మత, వర్గ, వర్ణ, అసమామానతలను రూపుమాపేందుకు, హిందూ సమాజంలో ఎన్నో సమూల మార్పులను తెచ్చారు. బిజ్జలుడి రాజ్యంలో చిరుద్యోగిగా చేరిన ఆయన అంచెలంచెలుగా మంత్రిగా ఎదిగారు. అప్పటి నుంచి సమాజోద్ధరణకు అద్భుత పాలన ప్రారంభించారు. వీరశైవ లింగాయత్ ధర్మానికి ఆయన బీజం వేశారు. లింగదీక్ష తీసుకుని శివున్ని ఆరాధించిన వారంతా ఒకే కులమని బోధించారు. సీ్త్ర, పురుషులు అన్న భేదభావాన్ని అప్పట్లోనే రూపుమాపేందుకు కృషి చేశారు. నేడు ప్రపంచ దేశాలు పార్లమెంట్లు, అసెంబ్లీలు స్థాపించుకుని పాలన చేస్తున్నారంటే అప్పట్లో బసవణ్ణ అనుభవ మంటపం ద్వారా అందరికి సమాన హక్కులు కల్పించి అభినవ పార్లమెంటు ద్వారా పాలన సాగించిన గొప్ప దార్శనికుడు. ప్రతి ఒక్కరికీ సమాన హక్కులు కల్పించాలని పోరాటం చేశారు.
కాయకమే కై లాసం అని బోధించారు
బసవణ్ణ తన ప్రవచనాలు, ఆధ్యాత్మిక బోధనలతో జనంలో చైతన్యం తీసుకుని వచ్చి అందరిని లింగ దీక్షను చేపట్టే విధంగా ప్రేరేపించి నిమ్న కులాల వారికి లింగదీక్ష ఇస్తూ వీరశైవులుగా మార్చారు. కాయకమే కై లాసమని, ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేస్తూ జీవిస్తూ భక్తి మార్గం, ఆధ్యాత్మిక చింతనతో ముందుకెళ్లాలని బోధించారు. ఎన్నో అటు పోట్లు, కష్టాలు, చివరకు సమాజమే తన ఊపిరిగా భావించిన బసవణ్ణ 1196వ సంవత్సరంలో కూడలసంగమంలో శివైక్యం చెందారు. సమానత్వ భావాలకు పర్వాయ పదంగా కీర్తి గడించిన బసవణ్ణ జయంతిని బుధవారం బళ్లారితో పాటు కర్ణాటకలోనే కాకుండా దేశ వ్యాప్తంగా వీరశైవ లింగాయత్లతో పాటు అన్ని కుల, మతాలకు చెందిన వారు ఘనంగా నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తి చేశారు.
కూడల సంగమ ఆర్ట్ గ్యాలరీ అదుర్స్
రాయచూరు రూరల్: కూడల సంగమ క్షేత్రంలోని కళా సంగ్రహాలయం(ఆర్ట్ గ్యాలరీ) అధిక ప్రాధాన్యత సంతరించుకుంది. కళా సంగ్రహాలయంలో ఉన్న చిత్రాలను చూడటానికి కనువిందు కలిగిస్తుంది. బాగల్కోటె జిల్లా హునగుంద తాలూకా కూడల సంగమ ప్రధాన రహదారిలో బసవ శరణుల కళా సంగ్రహాలయం కనబడుతుంది. ఎడమ వైపు బసవణ్ణ అనుచరుల చిత్రాలు ఉన్నాయి. సౌర మండలానికి సూర్యుడు కేంద్ర బిందువైతే బసవణ్ణ సూర్యోపాదిలో భూమి మీద తన కిరణాలను చూపిస్తూ వచనాలు రాసే భంగమ అందరి మనస్సు దోచుకుంది. అక్కడ ఏర్పాటు చేసిన చిత్రాలు, శిల్పాలు అందరినీ ఆకట్టుకుంటున్నాయి. కళా సంగ్రహాలయాన్ని కూడల సంగమ అభివృద్ధి మండలి నుంచి ఎకరా భూమిలో 2011లో రూ.6 కోట్ల వ్యయంతో ప్రారంభించారు.
మహా మానవతావాది, మహోన్నతుడు
నేడు విశ్వగురు బసవణ్ణ 892వ జయంతి

యుగ పురుషుడు బసవణ్ణ

యుగ పురుషుడు బసవణ్ణ

యుగ పురుషుడు బసవణ్ణ